భయంతోనే అలా చేయాల్సి వచ్చింది.. నన్ను క్షమించండి: రవీనా టాండన్ | Actress Raveena Tandon Apologizes To Fans | Sakshi
Sakshi News home page

భయంతోనే అలా చేయాల్సి వచ్చింది.. నన్ను క్షమించండి: రవీనా టాండన్

Sep 14 2024 10:49 AM | Updated on Sep 14 2024 11:46 AM

Actress Raveena Tandon Apologizes To Fans

బాలీవుడ్ నటి రవీనా టాండన్ సోషల్‌మీడియా వేదికగా తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తాజాగా రవీనా టాండన్‌  లండన్‌ వెళ్లారు. అక్కడ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను అభిమానులు చూశారు. దీంతో సెల్ఫీ తీసుకోవాలనే కోరికతో రవీనా వద్దకు వెళ్లారు. కానీ, అందుకు ఆమె నిరాకరించారు. ఈ క్రమంలో తన సెక్యూరిటీని పిలిచి అక్కడినుంచి వేగంగా వెళ్లిపోయారు. దీంతో నెటిజన్లు కూడా ఆమెపై మండిపడ్డారు. అయితే, ఈ సంఘటన గురించి రవీనా తన ఎక్స్‌ పేజీలో ఒక నోట్‌ రాసి పోస్ట్‌ చేశారు.  

'అభిమానులు నా వద్దకు వచ్చినప్పుడు నేను భయాందోళనకు గురయ్యాను. అందుకు కారణం ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న నేరాలే. వారందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు కాస్త భయపడ్డాను. దీంతో వారు ఎవరు..? ఎందుకొచ్చారో కూడా  తెలుసుకోలేదు. ఆ సమయంలో నేను ఒంటిరిగానే ఉండటంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాను.  కొన్ని నెలల క్రితం బాంద్రాలో జరిగిన సంఘటన తర్వాత నన్ను కొంత భయాందోళనకు గురి చేసింది. అందుకే నేను ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కారు ఎక్కిన కొంత సమయం తర్వతా వారికి ఫొటో ఇవ్వాలని నా మనసుకు అనిపించింది. కానీ ధైర్యం చేసి వెళ్లలేకపోయాను. వారితో అలా ప్రవర్తించి చాలా పెద్ద తప్పు చేశాను. 

ఇదీ చదవండి: హీరోయిన్‌ 'సమంత' దినచర్య ఇదే.. నెట్టింట వైరల్‌

ఇప్పటికీ దాని గురించి బాధపడుతున్నా.  వారికి సెల్ఫీ ఇవ్వనని చెప్పినందుకు క్షమించమని కోరుతున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. భవిష్యత్తులో మిమ్మల్ని మళ్లీ కలసే అవకాశం వస్తుందని కోరుకుంటున్నా.. అప్పుడు మీతో ఫొటోలు తప్పకుండా దిగుతా. ఈ పోస్ట్ మీకు చేరుతుందని ఆశిస్తున్నా.' అంటూ రవీనా వివరణ ఇచ్చారు. దీంతో ఆమెపై సోషల్‌మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలా బహిరంగంగా క్షమాపణలు కోరడం చాలా మంచి విషయం అంటూ నెటిజన్లు చెబుతున్నారు. రవీనా ఎప్పటికీ సురక్షితంగా ఉండాలని అభిమానులు తమ మద్ధతు తెలుపుతున్నారు.

ఈ ఏడాది జూన్‌లో రవీనా టాండన్‌, ఆమె డ్రైవర్‌పై బాంద్రాలో దాడి జరిగింది. ఆ సమయంలో మాపై దాడి చేయకండి అంటూ ఆమె చేసిన అరుపులు నెట్టింట వైరల్‌ అయ్యాయి. రవీనా, ఆమె డ్రైవర్‌ మద్యం సేవించి ర్యాష్‌ డ్రైవింగ్‌ పాల్పడ్డారని వారిపై ఫిర్యాదు నమోదు అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ముంబై పోలీసులు అది తప్పుడు కేసు అని క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో రవీనా మద్యం తీసుకోలేదని చెప్పారు. ఈ సంఘటన తర్వాత ఒంటరిగా వెళ్లాలంటే ఆమె ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement