Ajay Devgn: మరోసారి మెగాఫోన్ పట్టిన బాలీవుడ్ స్టార్ హీరో
Published
Tue, Jul 5 2022 7:45 AM
కెరీర్లో నాలుగోసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ హిట్ ఫిల్మ్ ‘ఖైదీ’ (2019) హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో కార్తీ చేసిన పాత్రను అజయ్ దేవగన్ చేస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాకు ధర్మేంద్ర శర్మను దర్శకుడిగా అనుకున్నారు. షూటింగ్ కూడా ఆరంభించారు. (చదవండి: గాడ్ ఫాదర్ లుక్లో అదరగొట్టేసిన చిరంజీవి)
అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని సోమవారం ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘బోళ’ అనే టైటిల్ ఖరారు చేశారు. టబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. ఇక ‘యు మీ ఔర్ హమ్’ (2008), ‘శివాయ్’ (2016), ‘రన్ వే 34’ (2022) చిత్రాల తర్వాత అజయ్ దేవగన్ దర్శకత్వంలో రూపొందుతున్న నాలుగో చిత్రం ‘బోళ’యే కావడం విశేషం.