విశ్వంలో చాలా రహస్యాలున్నాయి: దర్శకుడు శ్రీను వైట్ల | Director Srinu Vaitla About Vishwam Movie | Sakshi
Sakshi News home page

విశ్వంలో చాలా రహస్యాలున్నాయి: దర్శకుడు శ్రీను వైట్ల

Oct 6 2024 12:27 AM | Updated on Oct 6 2024 12:27 AM

Director Srinu Vaitla About Vishwam Movie

‘‘దర్శకుడిగా నాకు గ్యాప్‌ వచ్చి ఉండొచ్చు. కానీ నా గత సినిమాల సన్నివేశాలు సోషల్‌ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. కోవిడ్‌ తర్వాత ఆడియన్స్‌ సినిమాలను చూసే తీరు మారిపోయింది. నా కామెడీ, యాక్షన్‌ సన్నివేశాలను ఆడియన్స్‌ ఇష్టపడుతున్నారు. కానీ నా థీమ్‌ వారిని అలరించడం లేదని తెలుసుకున్నాను. ఆ దిశగా మార్పులు చేసుకుని, కొత్త థీమ్‌తో నా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌తో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నాను. ‘విశ్వం’లో నా మార్క్‌ యాక్షన్, ఎమోషన్, ఆడియన్స్‌కు నచ్చే కొత్త థీమ్‌ను మేళవించేందుకు స్ట్రగుల్‌ అయ్యాను. కానీ సినిమా బాగా వచ్చింది’’ అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. గోపీచంద్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనెపూడి, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ‘విశ్వం’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పిన విశేషాలు.


∙విశ్వం అనే ఓ క్యారెక్టర్‌ చేసే జర్నీయే ఈ సినిమా కథ. ఈ విశ్వంలో ఎన్నో సీక్రెట్స్‌ ఉంటాయంటారు. అలానే మా సినిమాలోని విశ్వం క్యారెక్టర్‌లోనూ ఎన్నో సీక్రెట్స్‌ ఉన్నాయి. అవి థియేటర్స్‌లో చూడండి. నా గత చిత్రాల్లో కామెడీ, యాక్షన్‌ బలంగా ఉంటాయి. ఈ అంశాలతోపాటు మంచి ఎమోషనల్‌ డెప్త్‌ కూడా ఈ చిత్రంలో ఉంది. ఇలాంటి ఎమోషనల్‌ డెప్త్‌ ఉన్న సినిమా నేను చేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలోనిపాప సన్నివేశాలకు ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతారు. అలాగే ఓ అంతర్జాతీయ సమస్యని ఈ సినిమాలో ప్రస్తావించడం జరిగింది. ∙‘విశ్వం’లో గోపీచంద్‌ అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమాలోని ట్రైన్‌ ఎపిసోడ్‌ హిలేరియస్‌గా ఉంటుంది. నా గత చిత్రం ‘వెంకీ’లోని ట్రైన్‌ ఎపిసోడ్‌ సక్సెస్‌ అయ్యింది.

ఇప్పటికీ ఆ ఎపిసోడ్‌ని ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే ‘విశ్వం’లో కథ ప్రకారమే ట్రైన్‌ ఎపిసోడ్‌ పెట్టాం. ఈ చిత్రంలో ఆర్గానిక్‌ కామెడీ మాత్రమే ఉంటుంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ రియలిస్ట్‌గా ఉంటాయి. డిఫరెంట్‌ లేయర్స్, వేరియేషన్స్‌ ఉన్న ‘విశ్వం’ తరహా సినిమాకు మ్యూజిక్‌ చేయడం కష్టం. చేతన్‌ భరద్వాజ్‌ మంచి సంగీతం ఇచ్చారు. ఆర్‌ఆర్‌ ఇంకా బాగా చేశారు. అలాగే నా పని తీరు తెలిసిన గోపీ మోహన్‌తో మళ్లీ ఈ సినిమాకు పని చేశాను. ∙‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ (2018) సినిమా వల్ల నిర్మాతలకు నష్టం లేదు. 

కానీ ఈ సినిమా థియేటర్స్‌లో సరిగా ఆడకపోవడంతో ఆ ఎఫెక్ట్‌ నాపై పడింది. సినిమా అంటే ఆడియన్స్‌కు నచ్చేలా కూడా తీయాలని నాకు మరింత అర్థమైంది. వీటన్నింటినీ సదిదిద్దుకుని ‘విశ్వం’ చేశానని నేను నమ్ముతున్నాను. మా టీమ్‌ కూడా నమ్ము తోంది. ప్రేక్షకులు కూడా నమ్మి, ‘విశ్వం’ను హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాను. ‘ఢీ’ సీక్వెల్‌గా ‘ఢీ2’ ప్రకటించాం. కానీ శ్రీహరిగారిపాత్రకు రీప్లేస్‌మెంట్‌ కుదరడం లేదు. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే చెబుతాను.

Advertisement
 
Advertisement
Advertisement