‘ఆ రోజు సుశాంత్‌ డ్రగ్‌ డీలర్‌ని కలిశాడు’ | Dubai Drug Dealer Met Sushant Singh Rajput Alleges Subramanian Swamy | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ కేసు.. స్వామి సంచలన ఆరోపణలు

Aug 24 2020 2:44 PM | Updated on Aug 24 2020 2:50 PM

Dubai Drug Dealer Met Sushant Singh Rajput Alleges Subramanian Swamy - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ హత్య జరిగిన రోజున దుబాయ్‌ కంప్లైంట్‌ డ్రగ్‌ డీలర్‌ అయాష్‌ ఖాన్‌ సుశాంత్‌ సింగ్‌ను కలిశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామి సునంద పుష్కర్‌ కేసుపై కూడా వ్యాఖ్యానించారు. ‘సునంద పోస్ట్‌ మార్టం చేసిన తర్వాత ఆమె కడుపులో వెలికి చూసిన వాటితోనే నిజం ఏంటనేది తెలిసింది. కానీ శ్రీదేవి, సుశాంత్‌ కేసులో ఇది జరగలేదు. అంతేకాక సుశాంత్‌ హత్య జరిగిన రోజు దుబాయ్‌ డ్రగ్‌ డీలర్‌ అయాష్‌ ఖాన్‌ సుశాంత్‌ని కలిశాడు ఎందుకు’ అని స్వామి తన ట్వీట్‌లో ప్రశ్నించారు. (సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో)

సుశాంత్‌ మృతితో దుబాయ్‌కు సంబంధాలు ఉండవచ్చని వారం రోజుల క్రితం స్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాక సీబీఐ సుశాంత్‌ కేసుతో పాటు శ్రీదేవి సహా గతంలోని ఉన్నతస్థాయి వ్యక్తుల మరణాల కేసులను కూడా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇజ్రాయెల్, యూఏఈ దౌత్య సంబంధాలతో, భారతదేశానికి చెందిన దుబాయ్ దాదాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు స్వామి. సుశాంత్, శ్రీదేవి, సునంద హత్య కేసుల సమాచారం కోసం సీబీఐ మొసాద్, షిన్ బెత్ సహాయం తీసుకోవాలి అని స్వామి ఆగస్టులో ట్వీట్ చేశారు. శ్రీదేవి 2018 ఫిబ్రవరిలో దుబాయ్ హోటల్‌లోని బాత్‌టబ్‌లో మునిగిపోయి మరణించిన సంగతి తెలిసిందే. సునంద పుష్కర్ 2014 జనవరి 17న న్యూ ఢిల్లీలోని ఒక హోటల్ గదిలో అనుమానస్పద రీతిలో చనిపోయారు. (సుశాంత్‌ మృతి కేసులో కీల‌క మ‌లుపు)

సుశాంత్ మృతి కేసు దర్యాప్తు కోసం గత వారం ముంబై చేరుకున్న సీబీఐ బృందం, నటుడి స్నేహితుడు సిద్ధార్థ్ పిథాతో పాటు నీరజ్ సింగ్‌ను సోమవారం మరోసారి ప్రశ్నించింది. ముంబైలోని శాంతక్రూజ్ ప్రాంతంలోని డీఆర్‌డీఓ గెస్ట్ హౌస్ వద్ద వీరిద్దరిని ప్రశ్నించారు. అంతేకాక సీబీఐ అధికారులు ఈ రోజు సుశాంత్‌ రెండు నెలలు బస చేసిన వాటర్‌స్టోన్ రిసార్ట్‌ను కూడా సందర్శించారు. అక్కడ ఉన్న సమయంలో సుశాంత్ ఎలా ప్రవర్తించాడో తెలుసుకోవడానికి సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సీబీఐ ఈ రోజు రియా చక్రవర్తి, ఆమె తండ్రి ఇంద్రజిత్‌ను ప్రశ్నించడానికి పిలిపించింది. జూన్ 8న రియా సుశాంత్ అపార్ట్‌మెంట్‌ నుంచి ఎందుకు వెళ్లిపోయిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement