
చలనచిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగులో తొలి మహిళా సింగర్ రావు బాలసరస్వతి దేవి (97) (Raavu Balasaraswathi Devi) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం (అక్టోబర్ 15) హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సంతాపం ప్రకటించిన వైఎస్ జగన్
సింగర్ బాల సరస్వతీదేవి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) సంతాపం వ్యక్తం చేశారు. 'తెలుగు సంగీత ప్రపంచంలో బాల సరస్వతీ దేవి తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా' అని ట్వీట్ చేశారు.
తెలుగు సంగీత ప్రపంచంలో తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేసిన తొలి సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతీ దేవిగారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. pic.twitter.com/2y2lneAY7O
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2025
సింగర్ జర్నీ
బాలసరస్వతి.. స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. 1928లో పుట్టిన ఆమె నాలుగేళ్ల వయసులోనే పలు స్టేజీలపై సాంగ్స్ పాడారు. ఆరో ఏట హెచ్.ఎం.వి కంపెనీ ఆమె పాటను గ్రామఫోన్లో రికార్డు చేసింది. మొదటగా రేడియోలో ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగువారికి పరిచయమయ్యారు. ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు, విజయవాడ స్టేషన్ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే. తెలుగులో తొలి నేపథ్య గాయని రికార్డు కూడా తనదే! సతీ అనసూయ (1936) సినిమాలో తొలిసారి పాట పాడారు.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక పాటలు ఆలపించారు. దాదాపు రెండువేలకి పైగా సాంగ్స్ పాడారు. భక్త ధ్రువ, ఇల్లాలు, రాధిక వంటి పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. పెళ్లి తర్వాత పదిహేనేళ్లకు సినిమాల్లో పాడటం మానేశారు. కానీ గొంతు సవరించుకోవడం ఆపలేదు. సినారె తెలుగులోకి అనువదించిన మీరాభజన్ గీతాలను ఆలపించారు. కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి ‘రాధా మాధవం’ సీడీ విడుదల చేశారు. అలా చివరి వరకు పాడుతూనే ఉన్నారు.
