
టాలీవుడ్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి. కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలు సరిగా ఆడట్లేదు. అదే టైంలో రీ రిలీజ్ల హడావుడి ఎక్కువైపోయింది. గత కొన్నాళ్ల నుంచి ఈ తరహాలోనే పాత చిత్రాల్ని విడుదల చేస్తున్నారు. వీటికే కోట్లకు కోట్లు కలెక్షన్స్ కూడా వస్తుండటం విశేషం. ఇప్పుడు మహేశ్ 'ఖలేజా' కూడా అలానే రీ రిలీజ్ కాగా.. కళ్లు చెదిరే వసూళ్లు వచ్చాయి.
(ఇదీ చదవండి: నాగార్జున కొడుకు పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం)
రీ రిలీజ్ ట్రెండ్లో మహేశ్ సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. మురారి, బిజినెస్మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాలని రీ రిలీజ్ చేయగా.. అభిమానులు థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు. తాజాగా సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా 'ఖలేజా'ని మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చారు. దీనికి ఏకంగా ప్రీమియర్స్ కూడా వేయడం విశేషం.
ఇప్పుడు 'ఖలేజా' మూవీ రీ రిలీజ్లోనూ రికార్డ్స్ సృష్టించినట్లు తెలుస్తోంది. తొలిరోజు మొత్తం రూ.8.26 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన 'ఖలేజా'.. 2010లో థియేటర్లలో రిలీజైంది. అప్పుడేమో డిజాస్టర్ అయింది. తర్వాత టీవీల్లో ప్రసారమైనప్పుడు చాలామందికి ఇది ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు రీ రిలీజ్ వల్ల అభిమానులు ఈ చిత్రంపై తన ప్రేమనంతా చూపించారు. వచ్చే శుక్రవారం వరకు ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

