హీరోయిన్లతో ప్రతి ఏడాది పార్టీ.. వేల కోట్లు తిన్నాడు..చిరుపై మన్సూర్ సంచనల వ్యాఖ్యలు
Published
Tue, Nov 28 2023 3:32 PM
త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చిరంజీవి ఫైర్ అయిన సంగతి తెలిసిందే. త్రిషకు మద్దతు ప్రకటిస్తూ.. వక్రబుద్ది కలిగిన వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేస్తారంటూ..మన్సూర్ని విమర్శించాడు. అయితే అసలు విషయం తెలుసుకోకుండా తనను విమర్శించాడంటూ చిరంజీవిపై మండిపడ్డాడు మన్సూర్ అలీఖాన్. అంతేకాదు త్రిష, కుష్భూలతో పాటు చిరంజీవిపై కూడా పరువునష్టం దావా వేశాడు. చిరంజీవి మీద రూ. 20 కోట్లు, త్రిష కుష్బూల మీద రూ. 10 కోట్ల చొప్పున దావా వేస్తున్నట్టుగా తాజాగా మన్సూర్ తెలిపాడు. ఇంతటితో ఆగకుండా.. చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పార్టీ పెట్టి వేల కోట్లు సంపాదించుకున్నాడు కానీ పేదవాళ్లకు సహాయం చేయలేదని విమర్శించాడు.
‘నాది వక్రబుద్ధి అని చిరంజీవి అన్నాడు కదా..మరి ఆయన ఏం చేశాడు? పార్టీ పెట్టి వేల కోట్లు తిని పేదవారికి సాయం చేయలేదు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ నాకు తెలీదు.. ఆయన కూడా పార్టీ పెట్టాడు.. వీళ్లంతా ఏం చేస్తున్నారో నాకు తెలీదు.. ఆ డబ్బంతా వాళ్ల కోసమే వాడుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం చిరంజీవి ఓల్డ్ హీరోయిన్లకు పార్టీ ఇస్తుంటాడు. ఆ పార్టీకి ఎప్పుడూ నన్ను పిలవలేదు అనుకోండి. ఆయన కేవలం హీరోయిన్లకు మాత్రమే పార్టీ ఇస్తాడు. అది ఆయన ఇష్టం. కానీ నాపై విమర్శలు వచ్చినప్పుడు.. అసలు ఏం జరిగిందనే విషయాన్ని నాకు ఫోన్ చేసి తెలుసుకొని ఉంటే బాగుండేది. అలా కాకుండా ఆయన ఏదోదో మాట్లాడాడు. అవి నన్ను బాధించాయి. త్రిష, కుష్భూలపై రూ. 10 కోట్ల చొప్పున, చిరంజీవిపై రూ. 20 కోట్ల పరువు నష్టం దావా వేస్తా. వచ్చిన డబ్బును తమిళనాడులో మద్యం దాగి చనిపోయిన కుటుంబాలకు అందజేస్తా’అని మన్సూర్ అన్నారు. ప్రస్తుతం మన్సూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.