ఒక్క సినిమాతో ఫుల్‌ క్రేజ్‌.. పారితోషికం పెంచేసిన బ్యూటీ! | Sakshi
Sakshi News home page

Mamitha Baiju: రెమ్యునరేషన్‌ పెంచేసిన ప్రేమలు హీరోయిన్‌

Published Wed, Mar 20 2024 10:15 AM

Premalu Actress Mamitha Baiju Hikes Her Remuneration - Sakshi

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఈ తరం తారలు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. మలయాళ భామ మమితా బైజు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఈ 22 ఏళ్ల బ్యూటీ క్రేజ్‌ దక్షిణాది మొత్తం వ్యాపిస్తోంది. 2017లో నటిగా రంగప్రవేశం చేయగా.. ఈమె నటించిన కోకో, సూపర్‌ శరణ్య వంటి మలయాళ చిత్రాలు విజయం సాధించాయి. ఇటీవల ఈ అమ్మడు నటించిన ప్రేమలు మూవీ మలయాళంలోనే కాకుండా, తమిళం, తెలుగు భాషల్లోనూ అనూహ్య విజయాన్ని అందుకుంది.

ఆ సినిమా నుంచి అవుట్‌
కాగా ఆ మధ్య బాలా దర్శకత్వంలో సూర్యకు జంటగా వణంగాన్‌ చిత్రంలో నటించడానికి కమిట్‌ అయ్యింది. అయితే అనివార్య కారణాల వల్ల సూర్య ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తర్వాత మమితా బైజు కూడా ఆ చిత్రం నుంచి బయటకు వచ్చేసింది. దర్శకుడు బాలా తనను కొట్టారని, చాలా సార్లు తిట్టారని ఆరోపణలు చేసింది. ఈ సంఘటన కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇది తన కెరీర్‌పై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని భయపడిందో ఏమోకానీ వెంటనే మాట మార్చేసింది. దర్శకుడు బాలా ఎప్పుడూ కొట్టలేదని, ఆయన దర్శకత్వంలో నటించిన సమయంలో చాలా నేర్చుకున్నానని, ఇతర చిత్రాల కారణంగా వణంగాన్‌ చిత్రం నుంచి తప్పుకోవలసి వచ్చిందని కవర్‌ చేసింది.

క్రేజీ హీరోయిన్‌గా..
ప్రస్తుతం ఈమె జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా రెబల్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శుక్రవారం తెరపైకి రానుంది. తదుపరి నటుడు విష్ణువిశాల్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రేమలు మూవీ తెలుగులోనూ విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది. దీంతో మమితా బైజు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా మారనున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుంటోంది బ్యూటీ. మరిన్ని అవకాశాలు వస్తుండటంతో ఈ అమ్మడు తన పారితోషికాన్ని పెంచేసినట్లు టాక్‌. ఇప్పటివరకు ఒక్క సినిమాకు రూ. 30 లక్షలు పుచ్చుకుందట. దాన్ని కాస్తా రూ.50 లక్షలు చేసిందని ప్రచారం నడుస్తోంది.

చదవండి: తమన్నా..పెళ్లెప్పుడో?

Advertisement
Advertisement