![Rakul Brother Aman Preet 14 Days Remand](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/1_12.jpg.webp?itok=go8BsY0P)
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగిన విషయం తెలిసిందే. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్లో ఐదుగురు డ్రగ్ పెడ్లర్స్ చిక్కారు. వీరి విచారణలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, నటుడు అమన్ ప్రీత్ సింగ్ సహా 13 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షించగా అమన్తో పాటు మరో ఐదుగురు డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది.
దీంతో ఈ ఐదుగురినీ నిందితులుగా చేర్చి అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. వారి నుంచి సుమారు 200 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
నైజీరియాకు చెందిన డివైన్ ఎబుక సుజీ, ఫ్రాంక్లిన్లు బిజినెస్, స్టడీ వీసాలపై హైదరాబాద్కు వచ్చి ఇక్కడ డ్రగ్స్ దందా నడుపుతున్నారు. ఈ దందాలో రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ని A6గా కేసు నమోదు చేశారు. అతనితో పాటు ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్ ఉన్నట్లు తేలింది. అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజుల రిమాండ్ను ఉప్పరపల్లి కోర్టు విధించింది. వారందరినీ చంచల్గూడ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment