
‘‘35 ఏళ్లలో నువ్వు లేని రాఖీ పండగ ఇదే. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు కూడా’’ అన్నారు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి మీతూ సింగ్. సోమవారం రాఖీ పౌర్ణమి. సుశాంత్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. తమ్ముడు లేకుండా రాఖీ రోజు వస్తుందని నేను ఉహించలేదంటూ ఉద్వేగపూరిత లేఖను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు సుశాంత్ సోదరి మీతు. దాని సారాంశం ఈ విధంగా.
‘‘ఇవాళ మన రోజు. అక్కాతమ్ముళ్ల రోజు. 35 ఏళ్లలో నేను నీకు రాఖీ కట్టలేకపోవడం ఇదే మొదటి సారి. స్వీట్స్ తినిపించలేకపోవడం, నీ నుదుట మీద ముద్దు పెట్టలేకపోవడం, నిన్ను ఆప్యాయంగా హగ్ చేసుకోలేకపోవడం. నువ్వు పుట్టి మా అందరి జీవితాల్లోకి వెలుగు తీసుకొచ్చావు. సంతోషం నింపావు. కానీ మా అందర్నీ వదిలి దూరంగా వెళ్లిపోయావు. ఏదైనా సరే మనిద్దరం కలిసే నేర్చుకున్నాం. ఇప్పుడు నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నాకు తెలియడంలేదు. నువ్వే చెప్పు?’’ అని రాశారు మీతు.
ఇక సుశాంత్ ఆత్మహత్య పై ప్రస్తుతం విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకిత పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘కొంత కాలంగా సుశాంత్ ఏదో ఒత్తిడికి లోనవుతున్నట్టు అనిపిస్తుందని తన అక్క నాతో చెప్పారు. అలాగే సుశాంత్ తన కుటుంబానికి కొంచెం దూరంగా ఉన్నట్టు నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చారు. అలాగే సుశాంత్ సింగ్ కేసు లో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మీద సుశాంత్ కుటుంబ సభ్యులు ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment