అనగనగా ఒక కథ | upcoming periodical films in Tollywood | Sakshi
Sakshi News home page

అనగనగా ఒక కథ

Published Sun, Mar 16 2025 1:19 AM | Last Updated on Sun, Mar 16 2025 1:19 AM

upcoming periodical films in Tollywood

టాలీవుడ్‌లో పదికిపైగా పీరియాడికల్‌ చిత్రాలు 

ఈ జానర్‌పై ఆసక్తి చూపుతున్న అగ్ర హీరోలు

తెలుగు సినిమాల కలెక్షన్స్‌ స్పీడ్‌గా ముందుకెళుతున్నాయి. కానీ తెలుగు సినిమా కథలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి. అరవై – డెబ్బై ఏళ్ల క్రితం నాటి కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు తెలుగు హీరోలు పాత కాలం కథలను ఓకే చేస్తున్నారు. ఇలా ‘కట్‌ చేస్తే... అనగనగా ఒక కథ’ అంటూ కొందరు స్టార్‌ హీరోలు చేస్తున్న పీరియాడికల్‌ ఫిల్మ్స్‌ గురించి తెలుసుకుందాం...

అడవిలో అడ్వెంచర్‌
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామాగా సాగే పీరియాడికల్‌ ఫిల్మ్‌ అని సమాచారం. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రకథను, రచయిత విజయేంద్రప్రసాద్‌ రెడీ చేశారనే ప్రచారం సాగుతోంది.

ఇక ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది. మహేశ్‌బాబు, ప్రియాంకాచోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027ప్రారంభంలో రిలీజ్‌ అవుతుందనే టాక్‌ వినిపిస్తోంది.

సైనికుడి స్టోరీ
ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఎస్మాయిల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా 1940 నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ ఓ సైనికుడిగా కనిపిస్తారనే టాక్‌ తెరపైకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

మిథున్‌ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ఖేర్‌ కీలక పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. మరోవైపు ప్రభాస్‌ చేస్తున్న హారర్‌ అండ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘రాజా సాబ్‌’. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ మూవీ కూడా పీరియాడికల్‌ చిత్రమే. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్‌ ఈ మూవీలో హీరోయిన్స్‌గా చేస్తున్నారు.

టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. ‘రాజా సాబ్‌’ సినిమాను ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేస్తామని గతంలో యూనిట్‌ ప్రకటించింది. కానీ ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్‌ కావడం లేదని, త్వరలోనే మేకర్స్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తారని తెలిసింది.

డ్రాగన్‌ వార్‌
హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘డ్రాగన్‌ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌పై 1969 అని కనిపిస్తోంది. సో... ఈ ‘డ్రాగన్‌’ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ అని ఆల్మోస్ట్‌ ఖరారైపోయినట్లే. కథ ప్రధానంగా కోల్‌కత్తా నేపథ్యంలో  సాగుతుందని తెలిసింది.

ఓ పెద్ద డ్రగ్స్‌ మాఫియా ఈ సినిమాలోని మరో ముఖ్య అంశమని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2026 జనవరి 9న ‘డ్రాగన్‌’ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  

ఆటగాడు
‘క్రికెట్, కుస్తీ, కబడ్డీ’... ఈ మూడు స్పోర్ట్స్‌ ఆడుతున్నారట రామ్‌చరణ్‌. మరి... మల్టీస్పోర్ట్స్‌ పర్సన్‌గా రామ్‌చరణ్‌ ఎందుకు మారారు? అనేది ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమాలో చూడాలి. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ మల్టీస్పోర్ట్స్‌ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 1970–1980 నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగుతుందని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కానీ ఈ చిత్రకథలో... కుస్తీ, కబడ్డీ.. ఖోఖో ఆటల ప్రస్తావన కూడా ఉంటుందట. అయితే మెయిన్‌ స్పోర్ట్‌గా కబడ్డీ ఉంటుందట. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘పెద్ది’ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. ఈ నెల 27న రామ్‌చరణ్‌ బర్త్‌ డే. ఆ రోజున ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ అవుతుందని, ఆ సమయంలోనే ఈ మూవీ రిలీజ్‌పై కూడా ఓ స్పష్టత వస్తుందని సమాచారం.

విలేజ్‌లో యాక్షన్‌
విలేజ్‌లో యాక్షన్‌కు సై అన్నారు శర్వానంద్‌. సంపత్‌ నంది దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా ఓ రూరల్‌ పీరియాడికల్‌ ఫిల్మ్‌ తెరకెక్కనుంది. కేకే రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రూరల్‌ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ 1960 నేపథ్యంలో సాగుతుంది. ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దుప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఓ పెద్ద సెట్‌ను క్రియేట్‌ చేశారు.

అలాగే శర్వానంద్‌ హీరోగా అభిలాష్‌ కంకర డైరెక్షన్‌లో ఓ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమా మూడు తరాల నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలోని మేజర్‌ సీన్స్‌ 1990లో ఉంటాయని తెలిసింది. విక్రమ్‌ సమర్పణలో వంశీ – ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో శర్వానంద్‌ ఓ బైక్‌ రేసర్‌గా నటిస్తున్నారు.

కింగ్‌డమ్‌
హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ ‘కింగ్‌డమ్‌’. ఈ పీరియాడికల్‌ ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారని తెలిసింది. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో విజయ్‌ దేవరకొండ కనిపిస్తారని తెలిసింది. అలాగే విజయ్‌ దేవరకొండ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయట.

ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఈ మూవీని మే 30న రిలీజ్‌ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్‌ అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాటు రవికిరణ్‌ కోలా డైరెక్షన్లో ‘రౌడీ జనార్ధన’ అనే మూవీ చేయనున్నారు విజయ్‌ దేవరకొండ. ఈ రూరల్‌ యాక్షన్‌ డ్రామా కూడా పీరియాడికల్‌ చిత్రమే అని తెలిసింది. ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది.

మాస్‌ సంబరాలు
సాయిదుర్గా తేజ్‌ కెరీర్‌లోనే అత్యధిక భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘సంబరాల యేటిగట్టు’. రూ. 125 కోట్ల బడ్జెట్‌తో కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్‌ ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామాతో రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల, సంజయ్‌ దత్‌  ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ  భాషల్లో ‘సంబరాల యేటిగట్టు’ మూవీ సెప్టెంబరు 25న విడుదల కానుంది.

చాంపియన్‌
బ్రిటిష్‌ పరిపాలన కాలంలో ఓ యువ ఫుట్‌బాల్‌ ఆటగాడి జీవితం ఏ విధంగా సాగిందనే కథాంశంతో రూపొందుతున్న సినిమా ‘ఛాంపియన్‌’. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా చేస్తున్న ఈ పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ మూవీకి ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి చెందిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్‌ ఇటీవల తెలిపారు.  

ఇలా పీరియాడికల్‌ ఫిల్మ్స్‌ చేస్తున్న మరికొంతమంది హీరోలు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement