ఘాటు తగ్గిన మిర్చి..!
సౌత్జోన్ షూటింగ్ బాల్ పోటీల్లో సబ్ జూనియర్ బాలికల విభాగంలో ప్రథమ బహుమతి అందుకున్న తెలంగాణ జట్టు
పెద్దవూర : రెండేళ్లుగా మిర్చి రైతుకు గడ్డు పరిస్థితి నెలకొంది. తెగుళ్లతో దిగుబడి తగ్గడం, ధరలు పడిపోవడం, కూలీల కొరత వెరసి రైతును కష్టాల్లోకి నెట్టివేస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం మిర్చికి రూ.20 వేల నుంచి రూ.28 వేల వరకు అధిక రేటు పలకడంతో రైతులు మిర్చిసాగుకు మొగ్గు చూపారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల ఎకరాల్లో పంట వేశారు. వీటిలో ఆర్మూర్, తేజా, దమ్ము వంటి రకాలను సాగు చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో ఆర్మూర్ రకానికి క్వింటా రూ.9 వేలు, తేజా రకానికి రూ.13 వేలు, దమ్ము రకానికి రూ.11 వేలకు కల్లాల వద్దే కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు మార్కెట్లలో కాయల రకం, నాణ్యతను బట్టి రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు ధర పలుకుతుంది. అక్కడి తీసుకెళ్లేందుకు రవాణా ఖర్చు, క్వింటాకు 4 శాతం కమీషన్ ఉండటంతో రైతుకు రూ.9 నుంచి రూ.11 వేలు కూడా రావటం లేదు. దీనికి తోడు కూలీ కొరత కూడా వేధిస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
వేధిస్తున్న కూలీల కొరత..
ప్రస్తుతం రైతులంతా ఒకేసారి మిర్చీ ఏరుతుండటంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో కూలీలకు అధిక కూలి చెల్లించి ఇతర ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. రోజుకు ఒక్కో కూలీకి రూ.350 నుంచి రూ.400 ఇస్తున్నారు. వాహనాల కోసం రోజుకు రూ.800 నుంచి రూ.1000 చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు మేసీ్త్రకి కమీషన్ చెల్లించాలి. దీంతో క్వింటా మిర్చి ఏరేందుకు కూలీలు, రవాణా ఖర్చులు కలిపి రూ.5 వేలు అవుతోంది. పండించిన పంటలో సగానికి పైగా కూలీలకే పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మిర్చికి మద్దతు ధర పెంచాలని రైతులు కోరుతున్నారు. లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకోడమే శరణ్యమని వాపోతున్నారు.
ఫ రోజురోజుకూ తగ్గుతున్న ధర
ఫ వేధిస్తున్న కూలీల కొరత
ఫ పెట్టుబడి కూడా రాదని రైతులు ఆవేదన
ఫ కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం
కూలీలకే సగడం డబ్బు పోతోంది
మేము పండించిన పంటలో సగం డబ్బు కూలీలకే సరిపోతుంది. దీనికితోడు తెగుళ్ల బెడదతో పంటలో పావువంతు తాలుకా యలు అవుతున్నాయి. మద్దతు ధర లేకపోవడంతో మిరప కాయలను హైదరాబాద్లో ఏసీలో పెట్టాను. ధర వచ్చాక అమ్ముకుంటా. ఈ ధరకు అమ్మితే అప్పులపాలే.
– కూన్రెడ్డి వెంకట్రెడ్డి, రైతు, బట్టుగూడెం
మార్కెట్ సదుపాయం కల్పించాలి
సాగర్, దేవరకొండ నియోజవర్గాల పరిధిలో మిరపకు మార్కెట్ సదుపాయం కల్పించాలి. ఇక్కడ మార్కెట్ లేకపోవడంతో హైదరాబాద్, గుంటూరు వెళ్లి అమ్ముకోవాల్సి వస్తోంది. అక్కడ తెలిసిన వాళ్లు ఎవరూ లేకపోవడంతో బ్రోకర్లను ఆశ్రయిస్తున్నాం. మార్కెట్కు నాలుగు శాతం కమీషన్ ఇవ్వడంతో పాటు, బ్రోకర్కు కొంత డబ్బు ఇవ్వాల్సి వస్తోంది. రవాణా ఖర్చుతో పాటు కాయలు అమ్ముడుపోక రెండు, మూడు రోజులు అక్కడే ఉండాల్సి వస్తుండటంతో ఖర్చులు పెరిగిపోతున్నాయి.
– కర్నాటి మల్లారెడ్డి, రైతు, పెద్దవూర
పెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి
మిర్చి సాగుకు ఈ సారి పెట్టుబడి పెరిగింది. మిరప నాటే సమయంలో ఎండలు అధికంగా ఉండడంతో.. రెండు, మూడు సార్లు నారు వేయాల్సివచ్చింది. చీడపీడలు, తెగుళ్లు ఉధృతంగా వ్యాపించడం, పంట ఎదుగుదలకు కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందులు, మొక్కలు నాటడం, కలుపు తీయించటం వంటి వాటికి ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. ఈ సారి దిగుబడి ఆశాజనకంగా లేదు. 8 నుంచి 10 క్వింటాళ్లు కూడా పండే పరిస్థితి లేదు. దీనికితోడు పావువంతు తాలుకాయలు అవుతున్నాయి. సకాలంలో వర్షాలు పడకపోవడం, వాతావరణం మార్పులతో తేమ అధికంగా వుండటంతో పంట దిగుబడి తగ్గినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కత్తి కనకాల్రెడ్డి. ఈ రైతు ఎకరాకు రూ.18వేల చొప్పున 24 ఎకరాలను కౌలుకు తీసుకుని మిరప సాగు చేశాడు. డ్రిప్, సాగునీటి కోసం అదనంగా ఎకరారే మరో రూ.10 వేల చొప్పున ఖర్చయ్యింది. పంట పెట్టుబడి ఎకరాకు రూ.1.5 లక్షలు అయ్యింది. ప్రస్తుతం మిరప కాయలను ఏరిస్తున్నాడు. కాయలు ఏరడానికి కూలీలు, ఆటో కిరాయి, మేసీ్త్ర మామూలు వంటి వాటికి క్వింటాకు రూ.5 వేలు ఖర్చవుతుంది. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆర్మూర్ రకం క్వింటా రూ.9 నుంచి రూ.10వేలు పలుకుతోంది. దీనిలో ట్రేడర్ల కమీషన్, రవాణా ఖర్చులు, బస్తాలు, హమాలీలకు మొత్తం కలిపి క్వింటాకు మరో రూ.1500 ఖర్చవుతుంది. దీంతో అతనికి క్వింటాకు మిగిలేది రూ.3500 నుంచి రూ.4500 మాత్రమే. దీంతో పెట్టిన పెట్టుబడి దేవుడు ఎరుగు, కనీసం కౌలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నాడు. ఇదీ జిల్లాలో మిరప సాగు చేసిన రైతుల పరిస్థితి.
ఘాటు తగ్గిన మిర్చి..!
ఘాటు తగ్గిన మిర్చి..!
ఘాటు తగ్గిన మిర్చి..!
ఘాటు తగ్గిన మిర్చి..!
Comments
Please login to add a commentAdd a comment