
కష్టానికి ఫలితం.. ర్యాంకులు సొంతం
పేదింట మెరిసిన విద్యాకుసుమం
మునగాల: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో మునగాల మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన మేడం సుజాత–వెంకన్న దంపతుల కుమార్తె శ్రావ్య 516.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. శ్రావ్య ప్రాథమిక, హైస్కూల్ విద్య మఠంపల్లి మండలంలోని గురుకుల విద్యాలయం, కోదాడ పట్టణంలోని వైష్ణవి పాఠశాలలో చదివింది. ఇంటర్ కోదాడలోని లక్ష్య జూనియర్ కళాశాలలో, బీటెక్ జేఎన్టీయూ సుల్తాన్పూర్లో చదివింది. అనంతరం హైదరాబాద్లో ఉండి సొంతంగా గ్రూప్–1కు ప్రిపేర్ అయి పరీక్షలకు హాజరైంది. రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు సాధించిన శ్రావ్యకు డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయని పలువురు విద్యావేత్తలు తెలిపారు. రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన శ్రావ్యను గ్రామస్తులు అభినందించారు.
ఎన్ని ఉద్యోగాలు వచ్చినా వదిలేసి..
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కొత్తపల్లి ఖుషీల్వంశీ సత్తాచాటాడు. 496 మార్కులతో జనరల్ ర్యాంక్లో 63వ స్ధానంలో, రిజర్వేషన్లో రాష్ట్రంలో మూడో స్ధానంలో నిలిచాడు. సీపీఐ మాస్లైన్ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్–రేణుక సంతానమైన ఖుషీల్వంశీ ఇప్పటికే ఎస్ఐతోపాటు యూపీఎస్సీలో ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్, మిలటరీ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. కానీ ఏ ఉద్యోగంలో జాయిన్ కాలేదు. ఎలాగైనా కలెక్టర్గా ప్రజలకు సేవలందించాలనే తపనతో తన చదువును కొనసాగించాడు. గతేడాది జరిగిన యూపీఎస్సీలో సెంట్రల్ పోలీస్ అసిస్టెంట్ కమాండో (డీఎస్పీ)గా ఎంపికయ్యాడు. ఏప్రిల్ 19న జాయిన్ కావాల్సి ఉండగా ఇంతలోనే గ్రూప్–1 ఫలితాలు వచ్చాయి.
రాష్ట్రస్థాయిలో 257వ ర్యాంక్ సాధించిన సందీప్
తిరుమలగిరి : మండల కేంద్రానికి చెందిన పత్తి సందీప్కుమార్ గ్రూప్–1 ఫలితాల్లో 468.5 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో 257వ ర్యాంక్, మల్టీజోన్–2 లో (ఎస్సీ) రిజర్వేషన్లో 15వ ర్యాంకు సాధించాడు. సందీప్కుమార్ 2020వ సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి సివిల్స్కు శిక్షణ తీసుకుంటున్నాడు. ఒక సంవత్సరం ఢిల్లీలో శిక్షణ తీసుకున్న అనంతరం హైదరాబాదులో ప్రిపేర్ అవుతున్నాడు. తండ్రి వెంకటాద్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, తల్లి లలిత హెల్త్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పని చేస్తున్నారు. భవిష్యత్లో సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని సందీప్ తెలిపాడు. ఈ విజయం తన అమ్మానాన్నలదే అని పేర్కొన్నారు. ప్రస్తుతం వచ్చిన ర్యాంకు ప్రకారం డీఎస్పీ కానీ సీటీఓ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వార్డు ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ గ్రూప్–1 కు ఎంపిక
● గ్రూప్ –1లో 384 ర్యాంక్ సాధించిన వట్టె రాజశేఖర్రెడ్డి
మేళ్లచెరువు : ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన వట్టె రాజశేఖర్రెడ్డి రాష్ట్రస్థాయిలో 384 వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. చిన్నతనంలోనే తండ్రి మృతిచెందగా తల్లి విద్యావలంటీర్గా విధులు నిర్వహిస్తూ ఇద్దరు కుమారులను కష్టపడి చదివించింది. మొదటి కుమారుడైన రాజశేఖర్రెడ్డి ముందునుంచి చదువులో ప్రతిభ కనబరిచేవాడు. పదో తరగతి వరకు మేళ్లచెరువు మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించాడు. బాసర ట్రిపుల్ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. సొంతంగా చదువుతూ పది సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలు రాశాడు. ఇటీవల గ్రూప్–4 లో ర్యాంకు సాధించి కోదాడ మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రాజశేఖర్రెడ్డి గ్రూప్–1 సాధించడంపై గ్రామస్తులు అభినందించారు.

కష్టానికి ఫలితం.. ర్యాంకులు సొంతం

కష్టానికి ఫలితం.. ర్యాంకులు సొంతం

కష్టానికి ఫలితం.. ర్యాంకులు సొంతం