
గౌహతి: అస్సాంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. జూన్ నెల మొదటి రోజున రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద నగరంగా పేరొందిన సిల్చార్(Silchar)లో 24 గంటల్లో ఏకంగా 415.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 1893 తర్వాత ఒక్క రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం. జూన్ 1న సిల్చార్లో కురిసిన వర్షపాతం 132 ఏళ్ల కిత్రం నాటి 290.3 మి.మీ వర్షపాతం రికార్డును బద్దలు కొట్టింది.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఎగువకు వీస్తున్న గాలి ప్రభావం, అల్ప స్థాయి ద్రోణుల కలయిక ఈ అస్థిర వాతావరణానికి కారణంగా నిలుస్తోంది. 2022లో సిల్చార్ వరదల్లో చిక్కుకుంది. నాడు పట్టణంలోని 90 శాతం ప్రాంతం నీటితో నిండిపోయింది. కాగా గత మూడు రోజుల్లో అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)లలో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 34 మంది మృతిచెందారు.
గడచిన ఐదు రోజుల్లో మేఘాలయ అంతటా భారీ వర్షపాతం నమోదైంది. మేఘాలయలోని 10 జిల్లాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. త్రిపురలో 10 వేల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. మణిపూర్లో నదులు పొంగిపొర్లడం, కరకట్టలు తెగిపోవడం వల్ల సంభవించిన వరదల కారణంగా 19 వేల మందికి పైగా ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. వరదల కారణంగా 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయి.
ఇది కూడా చదవండి: ‘స్పైడర్స్ వెబ్’ సక్సెస్: దాడుల వివరాలు షేర్ చేసిన జెలెన్స్కీ