
యూపీలోని ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది. కోట్లాదిమంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం ప్రయాగ్రాజ్ను తీర్థరాజం అని అంటారు.
ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ తీరం నుండి అక్షయ వాటిక వరకు పలు మతపరమైన కట్టడాలు ఉన్నాయి. మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ మరింత అందంగా ముస్తాబయ్యింది. నగరంలో పలు సాంస్కృతిక, చారిత్రక వారసత్వ కట్టడాలు కనిపిస్తాయి. ఇక్కడ కొలువుదీరిన శయన హనుమంతుడు, నాగవాసుకి, అలోపి ఆలయం, అక్షయ వాటికలు సందర్శకులను ఎంతగానో అలరిస్తాయి. ప్రయాగ్రాజ్లో ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాలు కూడా ఉన్నాయి.
ఖుస్రో బాగ్
ఖుస్రో బాగ్.. ఇది ప్రయాగ్జార్లోని ఒక ప్రధాన చారిత్రక ప్రదేశం. ఇక్కడ జహంగీర్ కుమారుడు ఖుస్రో, సుల్తాన్ బేగం సమాధులు ఉన్నాయి. ఈ సమాధులు ఇసుకరాయితో నిర్మించిన మొఘల్ నిర్మాణ శైలికి చక్కని ఉదాహరణలు. ఈ తోటను జహంగీర్ ఆస్థాన కళాకారుడు అకా రజా తీర్చిదిద్దారు.
అలహాబాద్ కోట
అలహాబాద్ కోటను మొఘల్ చక్రవర్తి అక్బర్ 1583లో నిర్మించాడు. ఈ కోట గంగా సంగమం దగ్గర యమునా నది ఒడ్డున నిర్మించారు. అక్బర్ ఈ కోటకు ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. అంటే అల్లా అనుగ్రహించినదని అర్థం. తరువాత ఇది అలహాబాద్గా మారింది. ఈ కోట అక్బర్ నిర్మించిన కోటలలో అతిపెద్దది.
ఆనంద్ భవన్
ఆనంద్ భవన్ అనేది నెహ్రూ కుటుంబపు నివాస గృహం. ఇది ఇప్పుడు మ్యూజియంగా మారింది. దీనిని మోతీలాల్ నెహ్రూ నిర్మించారు. తరువాత కాంగ్రెస్ కార్యకలాపాలకు స్థానిక ప్రధాన కార్యాలయంగా ఉండేది.
భరద్వాజ ఆశ్రమం
ఇక్కడున్న ఒక ఆశ్రమాన్ని భరద్వాజ మహర్షి ఆశ్రమం అని చెబుతారు. పురాణాల ప్రకారం ఈ ఆశ్రమంలోనే భరద్వాజ మహర్షి పుష్పక విమానాన్ని నిర్మించారు.
చంద్రశేఖర్ పార్క్
1931లో ఇక్కడి ఒక పార్కులో స్వాతంత్య్ర సమరయోధుడు చంద్ర శేఖర్ ఆజాద్ బ్రిటిష్ వారి కాల్పుల్లో అమరుడయ్యాడు. ఆ సమయంలో ఆజాద్ వయసు కేవలం 24 ఏళ్లు. అప్పటి నుంచి ఈ పార్కును చంద్రశేఖర్ పార్కు అని అంటారు.
ఇది కూడా చదవండి: Kumbh Mela: ప్రముఖుల రాక.. మరిన్ని మార్గదర్శకాలు జారీ
Comments
Please login to add a commentAdd a comment