అతిషి మర్లెనా సింగ్: ఢిల్లీ సీఎం పీఠం ఎక్కబోతున్న ఈమె ఎవరు? | Atishi journey From an activist, advisor and AAP force to the new CM of Delhi | Sakshi
Sakshi News home page

Atishi Marlena: ఢిల్లీ సీఎం కాబోతున్న ఈ మహిళ ఎవరు?

Published Tue, Sep 17 2024 12:53 PM | Last Updated on Tue, Sep 17 2024 1:32 PM

Atishi journey From an activist, advisor and AAP force to the new CM of Delhi

గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. దిల్లీ తదుపరి సీఎం పేరును ఆమ్​ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కేజ్రీవాల్‌ నివాసంలో మంగళవారం జరిగిన ఆప్‌ శాసనసభ సమావేశంలో మంత్రి అతిషి పేరును ఢిల్లీ సీఎంగా ప్రకటించారు. ఆమె పేరును కేజ్రీవాల్​ స్వయంగా ప్రతిపాదించారు. 

ప్రస్తుత సీఎంగా ఉన్న అరవింద్​ కేజ్రీవాల్​ నేటి సాయంత్రం లెఫ్ట్‌నెంగ్‌ గవర్నర్‌ సక్సేనాతో భేటీ కానున్నారు. ఆయన్ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ఆ తర్వాత అతిషి . సీఎంగా బాధ్యతలను చేపట్టనున్నారు.

ఎవరీ అతిషి
ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో మాజీ డిప్యూటీసెం మనీష్‌ సిసోడియా జైలుకెళ్లినప్పటి నుంచి అతిషి మర్లెనా సింగ్‌ పేరు బాగా ప్రాముఖ్యంలోకి వచ్చింది. ఆమె ఢిల్లీలోని కల్కాజీ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు కూడా. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో విద్య, పీడబ్ల్యూడీ, సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అతిషి మర్లెనా సింగ్ 8 జూన్ 1981న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు విజయ్‌ సింగ్‌, త్రిప్తా వాహి ప్రొఫెసర్‌లు ఆమె తల్లిదండ్రులు  కార్ల్‌ మార్స్క్‌, లెనిన్‌ పేర్లలోని కొన్ని భాగాలను కలిపి అతిషీ పేరులో ‘మార్లీనా’ అని చేర్చారు. 2018 ఎన్నికల ముందు నుంచి ఆతిశీ తన ఇంటి పేరును వాడటం మానేశారు.  

తన ఉన్నత పాఠశాల విద్యను న్యూ ఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్స్ స్కూల్ (పూసా రోడ్)లో పూర్తి చేసింది. ఆమె 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు.  2003లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిస్టరీలో మాస్టర్స్‌ పూర్తి చేశారు. అక్కడ ఆమె చెవెనింగ్ స్కాలర్‌షిప్‌న్‌ను కూడా పొందారు.

రాజకీయ ఎంట్రీ..
2013 జనవరిలో ఆమ్ ఆద్మీ పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. పార్టీ విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2015లో,ఆమె మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో జరిగిన చారిత్రాత్మక జల సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన నిరసనలు, న్యాయ పోరాటం సమయంలో ఆప్‌ నేత,  కార్యకర్త అలోక్ అగర్వాల్‌కు మద్దతునిచ్చారు.

2019 పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో తూర్పు ఢిల్లీకి లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.  ఆ  ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ నంచి బరిలోకి దిగిన గౌతమ్ గంభీర్‌పై అతిషి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 4.77 లక్షల ఓట్ల తేడాతో గౌతమ్‌ గంభీర్‌పై ఓడిపోయి మూడో స్థానంలో నిలిచారు.

2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..
ఆ తర్వాత 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషికి ఆప్‌ టికెట్‌ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆమె 11,422 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్‌పై విజయం సాధించారు. 2020 ఎన్నికల తర్వాత ఆమె గోవా ఆప్‌ యూనిట్‌కు ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.

కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి..
2015 నుంచి 2018 ఏప్రిల్‌ 17 వరకు ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్‌ సిసోడియాకు సలహాదారురాలిగా పనిచేశారు. ఉప ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ రాజీనామా తర్వాత సౌరభ్‌ భరద్వాజ్‌తోపాటు ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా చేరారు. అనే పోర్టుఫోలియోల భారం ఆమె మీదే పడింది. దాదాపు 14 శాఖలకు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం విద్య, ఆర్థిక, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, నీరు, విద్యుత్, ప్రజా సంబంధాలు వంటి కీలక మంత్రిత్వ శాఖలను అతిషి చూసుకుంటున్నారు. 

అప్పట్లో విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టిన హ్యాపీనెస్‌ కరికులం, ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ కరికులం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్యార్థుల భావోద్వేగాలపై దృష్టిపెట్టడం, వారిలో పలురకాల స్కిల్స్‌ను పెంపొందించడంపై దృష్టిపెట్టింది. ఆ తర్వాత ఆమె విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె చేపట్టిన విద్యా సంస్కరణలను పార్టీ తరచూ ఎన్నికల ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తుంటుంది

ఢిల్లీ ప్రభుత్వంలో ఆమె పాత్ర..
ఢిల్లీలో విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకు రావడంలో అతిషి కీలక పాత్ర పోషించారు. నగరంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనే మార్చేసిన ఘనత ఆమెది. అప్పట్లో విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టిన హ్యాపీనెస్‌ కరికులం, ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ కరికులం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్యార్థుల భావోద్వేగాలపై దృష్టిపెట్టడం, వారిలో పలురకాల స్కిల్స్‌ను పెంపొందించడంపై దృష్టిపెట్టింది.  ఆమె చేపట్టిన విద్యా సంస్కరణలను పార్టీ తరచూ ఎన్నికల ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తుంటుంది.

అతిషీనే ఎందుకు?
మద్యం కుంభకోణంలో ఆప్‌ కీలక నేతలందరూ జైలుకు వెళ్లారు.  మార్చి 21న కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత పార్టీ పరంగా అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అటు సౌరభ్‌ భరద్వాజ్‌తో కలిసి ప్రభుత్వ పరమైన నిర్ణయాల్లోనూ తనదైన పాత్ర పోషించారు.

 ఆప్‌ ప్రతిష్టను నిలబెట్టే బాధ్యతను తన భూజాలపై వేసుకున్నారు.  తన వాగ్ధాటితో ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టారు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో ఆమె ఢిల్లీ పీఠాన్ని అధిరోహించబోతున్నారు. కీలక అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రభుత్వాన్ని నడపనున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement