
భావ్నగర్: దేశంలోనే అతిపొడవైన తీర ప్రాంతమున్న గుజరాత్ అభివృద్ధి కోసం దశాబ్దాలపాటు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని ప్రధాని మోదీ అన్నారు. ఫలితంగా ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం గత 20 ఏళ్లుగా నిజాయతీతో ప్రయత్నాలు చేసి రాష్ట్రం అభివృద్ధికి బాటలు పరిచిందని పేర్కొన్నారు. ప్రచార ఆర్భాటాలకు డబ్బు వృథా చేయకుండా తీర ప్రాంతం వెంబడి పలు భారీ ప్రాజెక్టులు చేపట్టిందని ఆయన అన్నారు. ఫలితంగా లక్షలాది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని చెప్పారు.
ప్రజాసేవే పరమావధిగా భావిస్తున్న బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడూ నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు. భావ్నగర్, బొటాడ్, అమ్రేలీ జిల్లాల్లో గురువారం రూ.6 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపిన సందర్భంగా భావ్నగర్లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ టెర్మినల్, బ్రౌన్ఫీల్డ్ పోర్ట్ అభివృద్ధి, కార్గో కంటెయినర్ ఉత్పత్తి విభాగం తదితరాలు ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సమయంలో ప్రధాని మోదీ రూ.29 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment