
బీహార్లో మరో దారుణం చోటుచేసుకుంది. రాజధాని పట్నాలో మంగళవారం అర్థరాత్రి బీజేపీ నేత, పాల వ్యాపారి అజయ్ షాపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. బాధితుడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి మృతిచెందినట్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే పట్నా సిటీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడిన బీజేపీ నేత అజయ్ షా(45)గా పోలీసులు గుర్తించారు. పట్నా సిటీ పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీసర్ మీడియతో మాట్లాడుతూ మిల్క్ పార్లర్ నడుపుతున్న అజయ్ షా ఘటన జరిగిన సమయంలో తన దుకాణం వద్ద కూర్చునివున్నాడన్నారు. ఇంతలో ఇద్దరు దుండగులు మోటార్సైకిల్పై అక్కడికి వచ్చారని, వారు ఏదో విషయమై అజయ్షాతో గొడవపడ్డారని తెలిపారు. ఈ క్రమంలోనే ఆ దుండగులు అజయ్ షాపై కాల్పులు జరిపారు. వెంటనే అజయ్ షా గాయపడి కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారు అతనిని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు ఎఫ్ఎస్ఎల్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనకు భూవివాదాలే కారణం కావచ్చని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.