
సాక్షి, న్యూఢిల్లీ: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన చాపర్ క్రాష్ దర్యాప్తు నివేదికను దర్యాప్తు బృందం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు అందజేసింది. హెలికాప్టర్ కూలిపోయిన ఘటన ప్రమాదమేనని ట్రై సర్వీస్ దర్యాప్తు బృందం రిపోర్టులో తేల్చిచెప్పింది.
డిసెంబర్ 8న తమిళనాడులో బిపిన్ రావత్ ప్రయాణించిన భారత వాయుసేనకు చెందిన MI-17V5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 14మంది దుర్మరణం పాలయ్యారు. ‘కోయంబత్తూరు నుంచి వెల్లింగ్టన్కు బయల్దేరిన MI-17V5 హెలికాప్టర్ కనూర్ సమీపంలో దట్టమైన మేఘాలల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా దారి స్పష్టంగా కనిపించకపోవడంతో పైలట్ ఇబ్బందులు పడ్డాడు.
మేఘాల్లో చిక్కుకోవడంతో ముందున్న దృశ్యాలు అస్పష్టంగా కనిపించాయి. దారి కోసం రైల్వే లైన్ను హెలికాప్టర్ పైలట్ అనుసరించాడు. ఎత్తయిన శిఖరం అంచును హెలికాప్టర్ అనూహ్యంగా ఢీకొట్టింది. అదేవేగంతో హెలికాప్టర్ కిందికి పడిపోయింది’ అని ఇండియన్ ఎయిర్ఫోర్స్ నివేదికలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment