
న్యూఢిల్లీ: హింస చెలరేగి ఐదుగురు పోలీసుల మరణాలకు కారణమైన అస్సాం–మిజోరం సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర బలగాల మొహరింపునకు అస్సాం, మిజోరం, కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అంగీకరించాయి. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ను బారువా, అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా, మిజోరం సీఎస్ లాల్నున్మా వియా చవుంగో, డీజీపీ ఎస్బీకే సింగ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాల మధ్య రెండు గంటలపాటు కొనసాగిన చర్చల అనంతరం ఈ నిర్ణయానికొచ్చారు.
306 నంబర్ జాతీయ రహదారి వెంట సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్)ను రంగంలోకి దించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని హోం శాఖ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది.‡ మిజోరం రాష్ట్రానికి నిత్యావసర సరుకులు సహా అన్ని రకాల రవాణాకు జీవనాడిలాంటి 306 నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను అస్సామీలు 26వ తేదీ నుంచి మూసేశారని, వెంటనే ఈ దిగ్బంధాన్ని ఎత్తేయాలని మిజోరం డిమాండ్ చేసింది.