
తల్లికి వైద్యం సరిగా చేయలేదని డాక్టర్ను ఓ యువకుడు కత్తితో పొడిచాడు. ఈ ఘటన బుధవారం తమిళనాడు చెన్నైలోని గిండీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువకుడు ఈ ఏడాది మే నుంచి నవంబర్ వరకు తన తల్లి ప్రేమకు క్యాన్సర్ వైద్యం చేయించాడు. ఆమె పరిస్థితి మెరుగు పడకపోవడంతో వైద్యుడు బాలాజీ జగన్నాథన్పై కక్ష పెంచుకుని దాడి చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ఓ యువకుడు ఉద్యోగి వేషధారణలో వచ్చి.. ప్రభుత్వ వైద్యుడిని ఏడుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆయన ఛాతీ పైభాగానికి గాయాలయ్యాయి. ప్రస్తుతం డాక్టర్ ఐసీయూలో ఉన్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కత్తితో పొడిచి పారిపోతుండగా నిందితుడిని వైద్యసిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కలైంజర్ సెంటెనరీ హాస్పిటల్లోని ఓపీడీ లేదా ఔట్ పేషెంట్ విభాగంలో.. క్యాన్సర్ పేషెంట్ అయిన తన తల్లికి డాక్టర్ తప్పుగా మందులు రాశారని కక్ష పెంచుకొని ఆ యువకుడు ఈ డాక్టర్పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై.. తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ స్పందించారు. యువకుడు చిన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భద్రతా లోపం ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారణకు ఆదేశించారు. డాక్టర్కు వైద్య సహాయం హామీ ఇచ్చారు. అలాగే ఇటువంటి దాడి మళ్లీ జరగదని హామీ ఇచ్చారు.
“సమయంతో సంబంధం లేకుండా రోగులకు చికిత్స అందించడంలో మన ప్రభుత్వ వైద్యుల నిస్వార్థ కృషి ఎనలేనిది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
చదవండి: బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Comments
Please login to add a commentAdd a comment