గ‘ఘన’ రక్షణ వ్యవస్థ సూపర్‌ సక్సెస్‌  | DRDO Successfully Conducts Maiden Flight Tests | Sakshi
Sakshi News home page

గ‘ఘన’ రక్షణ వ్యవస్థ సూపర్‌ సక్సెస్‌ 

Aug 24 2025 12:11 PM | Updated on Aug 25 2025 4:05 AM

DRDO Successfully Conducts Maiden Flight Tests

గగనతల రక్షణ స్వావలంబనలో ముందడుగు 

దిగ్విజయంగా మూడు క్షిపణుల ప్రయోగం  

న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఎస్‌–400 తదితరాలకు ప్రత్యామ్నాయంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ (ఐఏడీడబ్ల్యూఎస్‌)ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. రక్షణ రంగ సంస్థ డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో ఒడిశాలో చాందీపూర్‌లో శనివారం మధ్యాహ్నం ఈ పరీక్షలు జరిగాయి. 

తద్వారా గగనతల రక్షణ రంగంలో స్వావలంబన దిశగా మరో ముందడుగు వేసింది. పొరుగు దేశాలతో ఉద్రిక్తతల వేళ కీలక ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యం లేకుండా గగనతల రక్షణ వ్యవస్థలను సొంతగానే తయారు చేసుకోగలమన్న ధీమాను ఈ పరీక్ష మరింతగా పెంచిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హర్షం వెలిబుచ్చారు. దీన్ని విజయవంతంగా చేసిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను అభినందించారు. 

అత్యంత కచ్చితత్వం... 
గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్షలో భాగంగా ఒక డ్రోన్, రెండు అత్యంత వేగంగా దూసుకెళ్లే మానవరహిత గగనతల వాహనాలను గాల్లోనే తుత్తునియలు చేసేలా క్యూఆర్‌ఎస్‌ఏఎం, విశోరద్స్, డీఈడబ్ల్యూలను ఒకేసారి భిన్న ప్రాంతాల నుంచి ప్రయోగించారు. ఇవన్నీ తమ పథంలో అత్యంత ఖచ్చితత్వంతో పయనించి తమ తమ లక్ష్యాలను ఛేదించాయి. మూడు ఆయుధాలు తమ నిర్దేశిత పరామితులను సాధించాయి. 

మిస్సైల్‌ వ్యవస్థ, డ్రోన్‌ జాడ కనిపెట్టే వ్యవస్థ, విధ్వంసక వ్యవస్థ, కమాండ్, కంట్రోల్‌ వ్యవస్థలు, కమ్యూనికేషన్, రాడార్ల వ్యవస్థలన్నీ సమష్టిగా పూర్తి సమన్వయంతో పనిచేసే ఈ మిషన్‌ను విజయవంతం చేశాయి’ అని రక్షణశాఖ తెలిపింది. ఈ పరీక్షను డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, త్రివిధదళాల ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. 

మరో పదేళ్లలో భారత గగనతలాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చే, అనుక్షణం కాపాలాకాసే అధునాతన ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థను తీసుకొస్తామని ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట మీద ప్రధాని మోదీ ప్రసంగించడం తెల్సిందే. సుదర్శన చక్ర పేరిట తేబోతున్న వ్యవస్థలో ఈ తాజా మూడు ఆయుధాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రతిపాదిత బహుళ అంచెల రక్షణ వ్యవస్థలో గగనతలంతోపాటు నిఘా, సైబర్‌ సెక్యూరిటీ అంశాలకు ప్రాధాన్యతనివ్వనున్నారు.  

మూడంచెల్లో శత్రుపీచం అణచే తిరుగులేని వ్యవస్థలు
ఐఏడీడబ్ల్యూఎస్‌  బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ అత్యంత వేగంగా స్పందించే సర్ఫేస్‌ టు ఎయిర్‌ (క్యూఆర్‌ఎస్‌ఏఎం) మిసైల్స్, అత్యల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ (విశోరద్స్‌) క్షిపణులు, అత్యంత శక్తిమంతమైన లేజర్‌ ఆధారిత డైరెక్టెడ్‌–ఎనర్జీ ఆయుధ (డీఈడబ్ల్యూ) వ్యవస్థలు దీనితో భాగం.

→ ఈ మూడు వ్యవస్థలను శనివారం విజయవంతంగా పరీక్షించారు.

→ ఇలా అన్ని రకాల ఆయుధాలను ఒకేసారి సమన్వయంతో ప్రయోగించే ఈ ఆపరేషన్‌ను కేంద్రీకృత కమాండ్, కంట్రోల్‌ సెంటర్‌(సీసీసీ) ద్వారా పర్యవేక్షించారు.

→ ఆపరేషన్‌ సిందూర్‌ ముగిసిన మూడున్నర నెలల తర్వాత భారత్‌ ఇలా గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థను పరీక్షించడం ఇదే తొలిసారి.

→ సీసీసీని డీఆర్‌డీఓ అభివృద్ధిచేసింది. రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్, సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్‌ అభివృద్ధి చేసిన విశోరద్స్, డీఈడబ్ల్యూలకు కూడా అది నోడల్‌ లేబోరేటరీగా వ్యవహరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement