
పిలిభిత్: ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. యూపీ, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా రచించిన వ్యూహంలో ఘనవిజయం సాధించారు.
ఈ ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు ఖలిస్తానీ కమాండో ఫోర్స్కు చెందినవారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు ఏకే 47, మరో రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు గతంలో గురుదాస్పూర్ పోస్ట్పై గ్రెనేడ్ విసిరారు. పురాన్పూర్ ప్రాంతంలోని హర్దోయ్ బ్రాంచ్ కెనాల్ సమీపంలో సోమవారం ఉదయం 5 గంటలకు ఈ ఎన్కౌంటర్ జరిగింది.
హతమైన ఉగ్రవాదులను ప్రతాప్ సింగ్ (23), వీరేంద్ర సింగ్ (23), గుర్విందర్ సింగ్ (20)గా పోలీసులు గుర్తించారు. పంజాబ్లోని గురుదాస్పూర్లో పోలీసు పోస్ట్పై దాడి చేసిన కేసులో ముగ్గురినీ వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా పంజాబ్ పోలీసులు వీరి ఆచూకీని పిలిభిత్లోని పురాన్పూర్లో గుర్తించారు. అనంతరం వారు పిలిభిత్ పోలీసుల సహాయంతో, సోమవారం తెల్లవారుజామున ముగ్గురు నిందితులను చుట్టుముట్టారు. హర్దోయ్ బ్రాంచ్ కెనాల్ సమీపంలో పోలీసుల ఎన్ కౌంటర్ జరిగింది.
బుల్లెట్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనలు వ్యాపించాయి. ఏం జరిగిందో స్థానికులకు వెంటనే అర్థం కాలేదు. తొలుత ఎన్కౌంటర్లో గాయపడిన నిందితులతో పోలీసులు పురాన్పూర్ సీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యులు వారిని పరీక్షించి వారు మృతిచెందినట్లు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: ఇంకా ఆందోళనకరంగానే పరిస్థితి!
Comments
Please login to add a commentAdd a comment