
బెంగళూరు: బెంగళూరులోని కర్ణాటక అసెంబ్లీ ఎదుట ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మాహుతి చేసుకునేందుకు ప్రయత్నించారు. రుణ బకాయిలను రికవరీ చేసేందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఈ ఘటనకు పాల్పడ్డారు. కర్ణాటక అసెంబ్లీ బయట మహిళలు, పిల్లలతో సహా కుటుంబ సభ్యులు తమపై కిరోసిన్ పోసుకున్నారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. బాధిత కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బెంగుళూరు సిటీ కోఆపరేటివ్ బ్యాంక్లో 2016లో అల్లం సాగు వ్యాపారం చేసేందుకు రూ.50 లక్షలు రుణం తీసుకున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ అల్లం వ్యాపారం నష్టాలను చవిచూసింది. దీంతో సహాయం కోరుతూ బాధిత కుటుంబం కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ను ఆశ్రయించింది. లోన్ వడ్డీని తగ్గిస్తామని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ బ్యాంకు అధిక రేట్లు విధిస్తూనే ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈఎమ్ఐలను తిరిగి చెల్లించడంలో కుటుంబం విఫలమైనందున బకాయిలను తిరిగి పొందేందుకు బాధితుల ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేశారు. దీనితో మనస్థాపానికి గురైన కుటుంబం అసెంబ్లీ ఎదుట ఆత్మాహుతి చేసుకోవడానికి పాల్పడ్డారు. రూ.3 కోట్ల విలువైన నివాసాన్ని కేవలం రూ.1.41 కోట్లకు బ్యాంకు అధికారులు వేలం వేశారని నిస్సహాయతను వెలిబుచ్చారు.
ఇదీ చదవండి: మాల్దీవులు-భారత్ వివాదం ముగియాలంటే ఇదే మార్గం..!
Comments
Please login to add a commentAdd a comment