
యుద్ధ విమానాలు, క్షిపణులతో పాక్ వైపు ఐఎన్ఎస్ విక్రాంత్
దన్నుగా వెంట వెళ్తున్న ఐఎన్ఎస్ సూరత్
సాక్షి, విశాఖపట్నం: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం కూడా సన్నద్ధమవుతోంది. యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, దానికి తోడుగా యుద్ధనౌక ఐఎన్ఎస్ సూరత్ పాక్ దిశగా కదులుతున్నట్టు సమాచారం. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులతో విక్రాంత్ పూర్తి స్థాయిలో ‘సిద్ధమైనట్టు’ తెలుస్తోంది.
సరిహద్దులు, తీర ప్రాంతాల్లో పహారా విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు అందినట్టు చెబుతున్నారు. విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం అధిపతి రాజేష్ పెందార్కర్ సిబ్బందితో గురువారం సాయంత్రం అత్యవసరంగా భేటీ సమావేశం నిర్వహించారు. దేశ ప్రయోజనాల కోసం ఎక్కడ నుంచైనా, ఏ సమయంలోనైనా పోరుకు సిద్ధంగా ఉండాలన్నారు.