
ముంబై: ఒకప్పటి మీడియా ప్రముఖురాలు ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నరేళ్ల తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చింది. కూతురు షీనాబోరా హత్యకేసులో జైలుకు వెళ్లిన ఆమె.. బెయిల్పై శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయ్యారు. ఈ క్రమంలో మీడియా ఆమెను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాత్రం నవ్వుతూ.. అన్నింటికి సమాధానం ఇచ్చుకుంటూ పోయారు.
ఈ కేసులో ఇంద్రాణిని ఇరికించే ప్రయత్నం ఎవరైనా చేశారా? అని ప్రశ్న ఎదురుకాగా.. నన్ను ఇబ్బంది పెట్టిన అందరినీ క్షమించేస్తున్నా. అంతే అని బదులిచ్చారు. ఇక కూతురు(షీనా బోరా) బతికే ఉందా?.. ఆ వాదనను సమర్థిస్తారా? అనే ప్రశ్నను దాటవేశారామె.
‘‘ఈ కేసు గురించి ఇప్పడేం మాట్లాడలేను. జీవితాన్ని పలు దృకోణాల్లో చూడడం ఇప్పుడే నేర్చుకున్నా. దారిలో ఎందరినో కలుసుకున్నా. ఇదొక ప్రయాణం. ఓపికగా ఎంతో నేర్చుకున్నా. ఇప్పుడు సంతోషంగా ఉంది అని చెప్పింది యాభై ఏళ్ల ఇంద్రాణి ముఖర్జీ.
బయటకు వెళ్లాక ఏం చేస్తారు అనే ప్రశ్నకు.. జైళ్లో ఎంతో నేర్చుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా అంతే. ఎలాంటి ఆలోచనలు లేవు. న్యాయవ్యవస్థ మీద నమ్మకం మళ్లీ వచ్చింది. ఆలస్యం అయినా న్యాయం జరిగిందని నమ్ముతున్నా. సంతోషం తప్ప.. వేరే ఏ భావోద్వేగం లేదు నాలో. త్వరలో ఓ బుక్ రాయాలనుకుంటున్నా. కానీ, అది జైలు జీవితం గురించి మాత్రం కాదు అని చెప్పారామె.
Comments
Please login to add a commentAdd a comment