
ధన్బాద్: ఓ ప్రైవేట్ స్కూల్ (private school) యాజమాన్యం 80 మంది పదో తరగతి విద్యార్థునుల పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. పెన్ డే పేరుతో నిర్వహించిన వేడుకల్లో బలవంతంగా విద్యార్థునుల షర్ట్లను విప్పదీయించి బ్లేజర్తో ఇంటికి పంపించింది.
పరీక్షలు పూర్తవడంతో ‘పెన్ డే’ (penday)పేరిట షర్ట్లపై పెన్నులతో రాసుకున్న పదో తరగతి విద్యార్థునులను ఆ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ దారుణంగా శిక్షించిన ఘటన జార్ఖండ్ jharkhand)లో ఆలస్యంగా వెలుగుచూసింది. మొత్తం 80 మంది అమ్మాయిల షర్ట్లను బలవంతంగా వారితోనే విప్పదీయించి అందర్నీ బ్లేజర్ (కోటు) మీదనే ఇంటికి పంపించేసిన ఉదంతం ధన్బాద్ జిల్లాలోని డిగ్వాడియా పట్టణంలో జరిగింది.
విషయం తెల్సుకుని జిల్లాయంత్రాంగం వెంటనే విచారణకు ఆదేశించింది. జోరాపోఖార్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుందని వివరాలను ధన్బాద్ డెప్యూటీ కమిషనర్ మాధవీ మిశ్రా వెల్లడించారు. స్నేహితులకు సందేశాల పేరిట చొక్కాలను పెన్ను గీతలతో నింపేయడమేంటంటూ ప్రిన్సిపల్ పట్టరాని ఆవేశంతో విద్యార్థులపై కోప్పడి షర్ట్లను తీసేయాలని ఆజ్ఞాపించాడు. పిల్లలు క్షమాపణలు చెప్పినా వినిపించుకోలేదు. బలవంతంగా వారితోనే తీయించి ఇంటికి పంపేశారు.
అవమానంగా భావించిన కొందరు విద్యార్థునులు తమ తల్లిదండ్రులకు చెప్పడం, వారు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు కోసం జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ , జిల్లా విద్యాధికారి, జిల్లా సామాజిక సంక్షేమాధికారి, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఉంటారు. ప్రిన్సిపల్ ఘటన సిగ్గుమాలిన, దురదృష్టకర చర్య అని ఝరియా ఎమ్మెల్యే రాగిణి సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
👉చదవండి : మీకు తెలుసా? ప్రమాద బాధితుల్ని కాపాడితే కేంద్రం డబ్బులిస్తుంది!
Comments
Please login to add a commentAdd a comment