private schools
-
స్కూళ్లలో ‘ఇంటర్నల్’ దందా!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి(Tenth class) అంతర్గత మార్కులపై ప్రైవేటు,(Private schools) కార్పొరేట్ విద్యా సంస్థలు దందా మొదలుపెట్టాయి. ఎక్కువ ఇంటర్నల్ మార్కులు వేసే పేరిట అదనపు వసూళ్లు మొదలు పెట్టాయి. ఇలా ఎక్కువ మార్కులు వేస్తే, మొత్తంగా మార్కులు పెరి గి... జీపీఏ ఎక్కువగా వస్తుందని ఒత్తిడి చేస్తున్నాయి. ఇంటర్నల్ మార్కుల(internal marks) తనిఖీలకు వచ్చే బృందాలకు కొంత ముట్టజెబుతున్నాయి. జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకూ అందులో వాటాలు వెళుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.‘ఇంటర్నల్స్’వసూళ్ల దందా దాదాపు రూ.వంద కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ఓ అధికారి కనుసన్నల్లో ఇదంతా నడుస్తున్నట్టు విద్యాశాఖ వర్గాలే పేర్కొంటుండటం గమనార్హం. ప్రతీ జిల్లాకు టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లు పెద్ద ఎత్తున ‘ఇంటర్నల్స్’ఖర్చు పెడుతున్నాయి. విద్యార్థుల జీపీఏ పెంచుకోవడం, దాన్ని ప్రచారానికి వాడుకోవడం, తద్వారా మార్కెట్ పెంచుకోవడమే దీని ముఖ్య ఉద్దేశంకాగా.. ఈ అక్రమాలకు విద్యాశాఖ అధికారులు సహకరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తం మార్కులూ వేసుకుని.. టెన్త్ క్లాస్లో ఒక్కో సబ్జెక్టుకు వంద మార్కులుంటాయి. 80 మార్కులు థియరీ పరీక్షల ద్వారా వస్తాయి. ఇంటర్నల్ మార్కులు 20. విద్యార్థులకు ఈ మార్కులు వేయడానికి విద్యాశాఖ కొన్ని నిబంధనలు పెట్టింది. సంవత్సరంలో నిర్వహించే అంతర్గత పరీక్షలన్నింటినీ కొలమానంగా తీసుకోవాలి. స్లిప్ టెస్టులకు 5 మార్కులు, ప్రాజెక్టు వర్క్కు 5, టెక్ట్స్బుక్స్ రైటింగ్, రీడింగ్కు 5, పుస్తక సమీక్షకు 5 మార్కులు వేయాలి. ప్రతీ ప్రైవేటు పాఠశాల ఈ మార్కులను మొత్తం 20కి 20గా వేసుకుంటున్నాయి. నిజానికి ఈ మార్కుల శాస్త్రీయతను జిల్లా విద్యాశాఖ నేతృత్వంలోని కమిటీలు పరిశీలించాలి.డీఈవో నేతృత్వంలో ప్రతి మండలానికి కొన్ని కమిటీలను వేస్తారు. జిల్లావ్యాప్తంగా 60 నుంచి వంద కమిటీల వరకూ వేస్తుంటారు. ఒక్కో కమిటీలో ఒక గెజిటెడ్ హెచ్ఎం, నాన్–లాంగ్వేజ్, లాంగ్వేజ్ టీచర్ కలిపి ముగ్గురు ఉంటారు. వారు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి.. విద్యార్థులకు వేసిన ఇంటర్నల్స్ మార్కులు సరిగానే ఉన్నాయా? లేదా? పరిశీలిస్తారు. తర్వాత మార్కులను డీఈవో కార్యాలయానికి పంపుతారు. అక్కడ రాష్ట్రస్థాయి పోర్టల్లో ఈ మార్కులను ఫీడ్ చేస్తారు.థియరీ పరీక్షల్లో మార్కులను, ఇంటర్నల్ మార్కులను కలిపి తుది ఫలితాన్ని ఇస్తారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులకు వేసిన మార్కులు సరైనవేనని తనిఖీ కమిటీలు నిర్ధారిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు 14కు మించని పరిస్థితి ఉంటే.. ప్రైవేటు బడుల్లో మాత్రం కనిష్టంగా 18 నుంచి గరిష్టంగా 20 వరకు వేసినా కమిటీలు ఆమోదం చెబుతున్నాయి.జరుగుతున్న తంతు ఇదీ... ⇒ ప్రైవేటు స్కూళ్లలో ఇంటర్నల్ అసెస్మెంట్పై తనిఖీ బృందాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా యి. ఎక్కడా శాస్త్రీయత లేదని సభ్యులు పేర్కొంటున్నారు. అయినా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేయడం వల్ల తామేమీ చేయలేపోతున్నా మని అంటున్నారు. తనిఖీ బృందాలు ఇచ్చి న ఫీడ్ బ్యాక్ ప్రకారం కొన్ని ఉదాహరణలివీ.. ⇒ హైదరాబాద్లోని నాలుగు ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల ప్రాజెక్టు వర్క్ అందరిదీ ఒకే రకంగా ఉంది. దాన్ని గూగుల్ నుంచి కాపీ కొట్టినట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు విద్యార్థులను ఆ ప్రాజెక్టు వర్క్పై ప్రశి్నస్తే.. సమాధానం చెప్పలేకపోయారు. ⇒ ఖమ్మంలోని ఓ ప్రైవేటు స్కూల్లో వంద మంది విద్యార్థుల రికార్డులు ఒకే రకంగా ఉన్నాయి. అవి కూడా ఎవరో రాసినట్టు తెలుస్తోంది. కొన్ని పదాలు పూర్తిగా ఆన్లైన్ నుంచి తీసుకున్నట్టుగా ఉంది. భాష కఠినమైన, పొంతనలేని తరహాలో ఉంది. దీనిపై విద్యార్థులకు ఏమాత్రం అవగాహన లేదు. ⇒ నిజామాబాద్లోని ఓ ప్రైవేటు స్కూల్లో అంతర్గత పరీక్షలకు హాజరవని విద్యార్థులకూ ఇంటర్నల్ మార్కులు వేశారు. పరీక్ష పేపర్లు ఎక్కడో పోయినట్టు వారు పేర్కొనడం గమనార్హం. ఓ రాజకీయ నాయకుడి బంధువు స్కూల్ కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.రూ.వంద కోట్ల దందా.. రాష్ట్రంలో ఈ సంవత్సరం 5,09,391 మంది టెన్త్ పరీక్షలు రాయనున్నారు. అందులో రెగ్యులర్గా రాసేవాళ్లు 4,97,341 మంది, గత ఏడాది ఫెయిలైన విద్యార్థులు మరో 12,050 ఉన్నారు. 11,544 ప్రైవేటు స్కూళ్ల నుంచి ఈ ఏడాది 2,36,674 మంది టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. వీరిలో చాలా మంది ఓ నాలుగైదు కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందిన వారేనని అంచనా. ఇంటర్నల్ మార్కులు ఎక్కువ వస్తే జీపీఏ పెరుగుతుందని ఆ స్కూళ్లు చెబుతున్నాయి. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి స్కూల్ స్థాయిని బట్టి రూ.5 వేలు మొదలు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.2 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్నల్ మార్కుల కోసం అదనంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని.. ఈ మొత్తం రూ.వంద కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రతీ స్కూల్ కూడా తనిఖీ బృందాల్లో ముగ్గురికి రూ.లక్షల్లో ముట్టజెబుతున్నారని.. ఎంఈవోలు, డీఈవోలు, రాష్ట్ర విద్యాశాఖలోని ఉన్నతాధికారులకూ ముడుపులు వెళ్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో స్కూళ్లు వేసిన మార్కులు సరికాదని తెలిసినా.. కమిటీలు తూతూమంత్రంగానే తనిఖీ చేసి ఆమోదించాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.విచారణకు ఆదేశిస్తాం ఇంటర్నల్ మార్కుల తనిఖీ వ్యవహారంపై విచారణ జరిపిస్తాం. అనుమానమున్న జిల్లాలు, ప్రాంతా ల్లోని పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు ఆదేశి స్తాం. ఇంత వరకు ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అయినా ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయేమో పరిశీలించి, అలాంటివి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఈవీ నర్సింహారెడ్డి, పాఠశాల విద్య డైరెక్టర్దగ్గరుండి పరిశీలిస్తున్నాం ప్రైవేటు స్కూళ్లలో అంతర్గత మార్కులను తనిఖీ బృందాలు పరిశీలించిన తర్వాత.. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మరోసారి పరిశీలన చేస్తున్నాం. ఎక్కడైనా అనుమానం వస్తే స్వయంగా వెళ్లి పరిశీలిస్తాం. బృందాలు ఇంకా మార్కులు ఫీడ్ చేయలేదు. చేసిన తర్వాత ఈ ప్రక్రియ ఉంటుంది. – సోమశేఖరశర్మ, డీఈవో, ఖమ్మంఇలా చేయడం దారుణం.. తనిఖీ బృందాలకు ముట్టజెప్పాలనే పేరుతో ప్రైవేటు స్కూళ్లు డబ్బులు వసూలు చేయడం దారుణం. దీనికి టీచ ర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. దీనిపై సమ గ్ర విచారణ జరిపించాల్సి ఉంది. అంతర్గత మార్కులు పెంచేందుకు అన్యాయంగా అనుమతిస్తే.. సంబంధిత తనిఖీ బృందాల్లోని టీచర్లపై చర్య లు తీసుకోవాలి. – ఆర్.రాజగంగారెడ్డి, గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడురూ.10 వేలు అడిగారు ఇంటర్నల్ మార్కులు జీపీఏ పెరగడానికి కీలకమని కరస్పాండెంట్ చెప్పారు. అధికారులను మేనేజ్ చేయాలని, అందుకోసం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే మార్కులు తగ్గిస్తారని చెప్పారు. అందరూ ఇస్తున్నారు కాబట్టి భయంతో మేం కూడా ఇచ్చాం. – హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థి -
బడి బయటే బాల్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు గురుకులాలు, ఇతర హాస్టల్ వసతి ఉన్న స్కూళ్లు కావాల్సినన్ని ఉన్నా.. బడి మధ్యలోనే మానేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాథమిక స్థాయిలో కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చేసరికి చాలామంది విద్యార్థులు బడి మానేస్తున్నారు. ప్రాథమికోన్నత స్థాయిలో 0.34 శాతం, ఉన్నత పాఠశాలల్లో 11.92 శాతం డ్రాపౌట్స్ నమోదయ్యాయి.ప్రాథమిక స్థాయిలో ఇది మైనస్ 2.23 శాతంగా ఉంది. ప్రధానంగా పల్లెల్లోనే డ్రాపౌట్లు ఎక్కువగా ఉన్నాయి. సోమవారం రాష్ట్ర ప్రణాళికా విభాగం విడుదల చేసిన ‘తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్–2024’లో ఈ వివరాలను పొందుపర్చింది. హనుమకొండ, కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల్లో డ్రాపౌట్లు తక్కువగా ఉన్నాయి.నివేదికలోని ప్రధానాంశాలు⇒ రాష్ట్రంలో 40,975 స్కూళ్లున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 20,539, ప్రాథమికోన్నత పాఠశాలలు 7,482, ఉన్నత పాఠశాలలు 11,561, హయ్యర్ సెకండరీ 1,393 స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 65,41,085 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో పాఠశాలకు సగటున 160 మంది విద్యార్థులు ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 533 స్కూళ్లు ఉండగా.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,907 ఉన్నాయి.⇒ హైస్కూల్ పరిధిలో 39,92,429 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 8,98,588, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 9,16,869, హయ్యర్ సెకండరీలో 7,33,199 మంది పిల్లలున్నారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 9,02,674 మంది విద్యార్థులుండగా.. అతి తక్కువగా ములుగు జిల్లాలో 41,061 మంది మాత్రమే ఉన్నారు.⇒ 6 నుంచి 10 ఏళ్లలోపు చిన్నారులు రాష్ట్రంలో 26,62,200 మంది ఉండగా, పాఠ శాలల్లో నమోదైనవారు 29,28,678 ఉన్నా రు. ప్రాథమిక పాఠశాలల్లో గ్రాస్ ఎన్రో ల్మెంట్ రేషియో(స్థూల నమోదు నిష్పత్తి) 110 శాతంగా ఉంది. ఇది అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 175 శాతం ఉండగా, అతి తక్కువగా జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో 70 శాతం ఉంది.⇒ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జీఈఆర్ 107 శాతం ఉంది. రాష్ట్రంలో 11 నుంచి 13 సంవత్సరాల వయసున్న పిల్లలు 16,53,800 మంది ఉండగా, ఆరోతరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూళ్లలో నమోదైన పిల్లలు 17,73,298 (కుటుంబాల వలస ఇతరత్రా కారణాల వల్ల) ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపా లపల్లి జిల్లాలో 59 శాతం ఉండగా, ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో 173 శాతంగా ఉంది.⇒ ఉన్నత పాఠశాలల్లో జీఈఆర్ 95 శాతంగా ఉంది. రాష్ట్రంలో 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 11,44,600 మంది ఉండగా, ఉన్నత పాఠశాలల్లో నమోదైన పిల్లలు 10,82,551 మంది మాత్రమే. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 55 శాతం, అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 149 శాతం నమోదైంది.⇒ రాష్ట్రంలో సగటున 19 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. ప్రాథమిక స్థాయిలో 18 మందికి, ప్రాథమికోన్నత స్థాయిలో 14 మందికి, ఉన్నత పాఠశాల స్థాయిలో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. హయ్యర్ సెకండరీ స్థాయిలో 17 మందికి ఒక టీచర్ ఉన్నారు. టీచర్–స్టూడెంట్ నిష్పత్తి 22 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. ప్రాథమికోన్నత స్థాయిలో 21 జిల్లాల్లో, ఉన్నత స్థాయిలో 23 జిల్లాలు, హయ్యర్ సెకండరీ స్థాయిలో 13 జిల్లాల్లో ఇది రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. మెదక్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి, హైదరాబాద్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో టీచర్–స్టూడెంట్ నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది.⇒ రాష్ట్రంలో లింగనిష్పత్తి 988గా ఉంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు 988 మహిళలు ఉన్నారు. అత్యంత తక్కువ లింగనిష్పత్తి ఉన్న జిల్లా రంగారెడ్డి. ఆ తర్వాత స్థానాల్లో హైదరాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి, వనపర్తి జిల్లాలున్నాయి. పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్న జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి. -
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ!
సాక్షి, హైదారబాద్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల విషయమై తెలంగాణ విద్యా కమిషన్ పలు కీలక సిఫారసులు చేసింది. రాష్ట్రంలోని సాంకేతిక విద్యా కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రస్తుతం ఉన్న ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) మాదిరిగానే పాఠశాలలల్లోనూ ఫీజుల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసేలా చూడాలని సిఫారసు చేసింది. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు శుక్రవారం ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు నివేదిక సమర్పించారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చే పక్షంలోనే అదనపు ఫీజులు ఫీజుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి కమిటీతో పా టు, ప్రతి జిల్లాలో కలెక్టర్ల ఆధ్వరంలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. రాష్ట్రంలో పాఠశాలల స్థాయి ఆధారంగా ఫీజులు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఉన్నట్లుగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తమకు అందిన ఫిర్యాదులను కమిషన్ తన నివేదికలో పొందుపరిచింది. ఆప్షనల్గా విద్యార్థులకు ఈత, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చే పక్షంలోనే అదనపు ఫీజులకు అనుమతించాలని లేని పక్షంలో ఒక్క ట్యూషన్ ఫీజు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. స్కూళ్లను కేటగిరీల వారీగా విభజించి ఫీజులను నిర్ధారించాలని పేర్కొంది. పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మాకుండా చూసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించింది. పుస్తకాలు, డ్రెస్ల అమ్మకాలు నిషేధించాలి పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, స్కూల్ డ్రెస్లు, షూ, టై లాంటివి అమ్మడాన్ని నిషేధించాలని, తమకు ఇష్టమైన చోట వాటిని కొనుగోలు చేసే అవకాశం విద్యార్థులకు కల్పించాలని సిఫారసు చేసింది. పాఠశాలల్లో మౌలిక వసతులైన లైబ్రరీ, ప్రయోగశాలలు, కంప్యూటర్లు, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, బోధనా సిబ్బంది విద్యార్హతలు, ఉపాధ్యాయుల సంఖ్య, వారికి చెల్లిస్తున్న వేతనాలు, ఉన్న క్రీడా సౌకర్యాలు, పాఠశాల నిర్వహణ వ్యయం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఫీజులు నిర్ధారించాలని స్పష్టం చేసింది. పాఠశాలలు పూర్తిగా దోపిడీ చేస్తున్నాయన్న కమిషన్! కలెక్టర్, జిల్లా విద్యాధికారి, ఆడిటర్ తదితరులతో ఏర్పాటయ్యే కమిటీ నిర్ధారించే ఫీజులు అధికంగా ఉన్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తే రాష్ట్రస్థాయి కమిటీకి అప్పీల్ చేసే సౌకర్యం ఉండాలని కమిషన్ సూచించింది. ఒకవేళ రాష్ట్రంలో మరో కమి టీ ఎందుకు అని ప్రభుత్వం భావించినట్టైతే..పూర్తి చట్టబద్ధతతో విద్యా కమిషన్కు ఆ బాధ్యతను అప్పగించాలని సూచించినట్లు తెలిసింది. మొత్తం ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను పూర్తిగా దోపిడీ చేస్తున్నాయన్న అభిప్రాయాన్ని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పై వివిధ వర్గాలతో చర్చలు జరిపిన తర్వాత కమిషన్ ఈ అభిప్రాయానికి వచి్చంది. చైర్మన్ ఆకు నూరి మురళితో పాటు సభ్యులు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, జ్యోత్స్న, శివారెడ్డిలు నివేదికను సమరి్పంచారు. -
80 మంది విద్యార్థునుల పట్ల స్కూల్ ప్రిన్సిపల్ పైశాచికత్వం!
ధన్బాద్: ఓ ప్రైవేట్ స్కూల్ (private school) యాజమాన్యం 80 మంది పదో తరగతి విద్యార్థునుల పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. పెన్ డే పేరుతో నిర్వహించిన వేడుకల్లో బలవంతంగా విద్యార్థునుల షర్ట్లను విప్పదీయించి బ్లేజర్తో ఇంటికి పంపించింది. పరీక్షలు పూర్తవడంతో ‘పెన్ డే’ (penday)పేరిట షర్ట్లపై పెన్నులతో రాసుకున్న పదో తరగతి విద్యార్థునులను ఆ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ దారుణంగా శిక్షించిన ఘటన జార్ఖండ్ jharkhand)లో ఆలస్యంగా వెలుగుచూసింది. మొత్తం 80 మంది అమ్మాయిల షర్ట్లను బలవంతంగా వారితోనే విప్పదీయించి అందర్నీ బ్లేజర్ (కోటు) మీదనే ఇంటికి పంపించేసిన ఉదంతం ధన్బాద్ జిల్లాలోని డిగ్వాడియా పట్టణంలో జరిగింది.విషయం తెల్సుకుని జిల్లాయంత్రాంగం వెంటనే విచారణకు ఆదేశించింది. జోరాపోఖార్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుందని వివరాలను ధన్బాద్ డెప్యూటీ కమిషనర్ మాధవీ మిశ్రా వెల్లడించారు. స్నేహితులకు సందేశాల పేరిట చొక్కాలను పెన్ను గీతలతో నింపేయడమేంటంటూ ప్రిన్సిపల్ పట్టరాని ఆవేశంతో విద్యార్థులపై కోప్పడి షర్ట్లను తీసేయాలని ఆజ్ఞాపించాడు. పిల్లలు క్షమాపణలు చెప్పినా వినిపించుకోలేదు. బలవంతంగా వారితోనే తీయించి ఇంటికి పంపేశారు.అవమానంగా భావించిన కొందరు విద్యార్థునులు తమ తల్లిదండ్రులకు చెప్పడం, వారు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు కోసం జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ , జిల్లా విద్యాధికారి, జిల్లా సామాజిక సంక్షేమాధికారి, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఉంటారు. ప్రిన్సిపల్ ఘటన సిగ్గుమాలిన, దురదృష్టకర చర్య అని ఝరియా ఎమ్మెల్యే రాగిణి సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.👉చదవండి : మీకు తెలుసా? ప్రమాద బాధితుల్ని కాపాడితే కేంద్రం డబ్బులిస్తుంది! -
స్కూళ్ల ఫీ‘జులుం’కు చెక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలకు ముకుతాడు వేసేలా రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి కీలక సూచనలు, సిఫార్సులు చేసేందుకు సిద్ధమైంది. ప్రైవేటు స్కూళ్లను వర్గీకరించడంతోపాటు ఆయా స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా స్కూళ్లపై విద్యాశాఖకు పూర్తి అధికారం ఇవ్వాలని.. ప్రైవేటు స్కూళ్లను ఎంఈవో స్థాయి అధికారి తనిఖీ చేయాలనే సిఫార్సు చేయనుంది. అలాగే మౌలిక వసతుల కల్పన, అనుభవజు్ఞలైన టీచర్లు, ఇతర సిబ్బందికి అయ్యే ఖర్చును ప్రామాణికంగా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. అన్ని స్కూళ్లను ఆడిట్ పరిధిలోకి తేవడాన్ని సరైన విధానంగా భావిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల విషయంలో మరికొన్ని షరతులు విధించాలనే యోచనలో ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ సిఫా ర్సు మేరకే ఫీజులు ఉండాలనే ప్రభుత్వానికి సూచించాలని భావిస్తోంది. రూ. లక్షల్లో ఫీజులు: ప్రైవేటు స్కూళ్లు భారీగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలంటూ కొన్నేళ్లుగా ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతు న్నాయి. అలాగే పుస్తకాలు, దుస్తులు, ఇతర అవసరాల పేరుతో అదనంగా వసూళ్లు చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక కార్పొరేట్ స్కూళ్లు అయితే రూ. 5 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు వార్షిక ఫీజులు దండుకుంటున్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్లను కట్టడి చేసేందుకు సిఫార్సులు చేయాలని విద్యా కమిషన్ను ప్రభుత్వం ఆదేశించింది. కమిషన్ నివేదిక అనంతరం వచ్చే ఏడాది నుంచి ఫీజుల కట్టడికి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రైవేటు స్కూళ్ల వాదన ఇలా.. ⇒ రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేసే స్కూళ్లను.. రూ. 50 వేలలోపు ఫీజులు తీసుకొనే స్కూళ్లను ఒకే గాటన కట్టకూడదు. ∙ఏటా 15 శాతం ఫీజు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కార్పొరేట్ స్కూళ్ల డిమాండ్ ఇదీ.. ⇒ మారిన విద్యా విధానంలో కంప్యూటర్ విద్యకు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. సబ్జెక్టు టీచర్ల వేతన భారం పెరిగింది. ⇒ ఏటా ఫీజులు పెంచుకొనే అవకాశం ఇవ్వాలి.అందరికీ ఆమోద యోగ్యంగా నివేదిక..ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల విధానం ఎలా ఉండాలనే అంశంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. విద్యా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ స్కూళ్ల యాజమాన్యాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం. అందరికీ ఆమోదయోగ్యమైన అంశాలతోనే నివేదిక రూపొందిస్తున్నాం. ఫీజుల నియంత్రణ వల్ల పేద వర్గాలకు ఊరట ఉంటుందని ఆశిస్తున్నాం. – ఆకునూరి మురళి, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ -
ప్రైవేటుపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో పనిచేసే ఉపాధ్యాయుల సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించింది. ఏయే విద్యార్హతలున్నాయో ఆరా తీయాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాలవిద్య డైరెక్టరేట్ కార్యాలయం ఇప్పటికే అంతర్గత ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ పాఠశాలల వివరాలను ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి..అందులో పొందుపర్చాలని అధికారులు భావిస్తున్నారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత విద్య బోధించే ఉపాధ్యాయుల ధ్రువీకరణ పత్రాలు కూడా పరిశీలించే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయుల సదస్సులో ముఖ్యమంత్రి ప్రైవేట్ స్కూళ్లలో అర్హత లేనివారు బోధిస్తున్నట్టు చెప్పారు. దీనిపై ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు ప్రజలకు వివరించాలని సీఎం భావించినట్టు అధికారులు చెబుతున్నారు. యూడైస్కూ అందించాలి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల డేటా ఏటా పొందుపర్చాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, మౌలిక వసతులు ఏమున్నాయో ఇందులో పేర్కొనాలి. విద్యాశాఖ ఇప్పటివరకూ ప్రభుత్వ స్కూళ్లలోని వివరాలనే యూడైస్కు సమగ్రంగా ఇస్తోంది. ప్రైవేటు స్కూళ్ల నుంచి అన్ని వివరాలు అందడం లేదని అధికారులు చెబుతున్నారు. వివరాల కోసం ఎన్ని లేఖలు రాసినా ప్రైవేట్ స్కూళ్లు స్పందించడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర వివరాలు తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేట్లోనే టీచర్లు ఎక్కువ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల స్కూళ్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 29 వేలు, ప్రైవేట్ 11 వేల వరకూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1.35 లక్షల మంది ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూళ్లలో 2 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. అయితే సర్కారీ స్కూళ్లలో 26 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రైవేట్ స్కూళ్లలో 34 లక్షల మంది చదువుతున్నారు. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు తగ్గడంపై ప్రభుత్వం సీరియస్గా ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కనీసం మౌలిక వసతులు కూడా లేని, ఏ అర్హత లేనివారు బోధిస్తున్నా విద్యార్థులు ఎందుకు ప్రైవేట్ బాట పడుతున్నారో నివేదిక ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పర్యవేక్షణ ఉంటేనే సాధ్యం ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా ఉపాధ్యాయుల అర్హతలను వెల్లడించే అవకాశమే లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. బీఈడీ అర్హతతో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉన్నారా అనేది తెలుసుకోవాలి. దీనికి మండల స్థాయిలోఎంఈఓ, జిల్లా స్థాయిలో డీఈఓలు దృష్టి పెట్టాలి. అయితే డీఈఓ, ఎంఈఓ పోస్టుల్లో మెజారిటీగా ఇన్చార్జ్లనే కొనసాగిస్తున్నారు. దీంతో పర్యవేక్షణ లోపాలు వెంటాడే అవకాశం ఉందని చెబుతున్నారు. -
మన బడుల్లో చేరండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక క్రమంగా తగ్గుతోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చేరికలు కొంత ఆశాజనకంగానే ఉన్నా ఆ తర్వాత క్లాసుల్లో ఎన్రోల్మెంట్ పడిపోతోంది. ఆరో తరగతి నుంచి విద్యార్థులు ప్రైవేటు బాటపడుతున్నారు. దీన్ని సరిదిద్దేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా సమగ్ర శిక్ష ప్రాజెక్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.రాష్ట్రంలో ఎన్రోల్మెంట్ పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమాన్ని అధికారులు చేపట్టనున్నారు. ఏటా పాఠశాలలు తెరిచే ముందు ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టడం సాధరణమే అయినప్పటికీ ఈసారి విద్యార్థుల శాతాన్ని ఎక్కువగా పెంచాలని విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.సమస్యలు పరిష్కరిస్తేనే.. ఈ ఏడాది రూ. 1,907 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఈ నిధులతో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతోపాటు భవనాల మరమ్మతులు, స్మార్ట్ క్లాస్రూంలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిబ్బంది జీతాలకు ఖర్చు చేయనుంది. గతంలో మన ఊరు–మన బడి కార్యక్రమం కింద స్కూళ్లలో మౌలికవసతులు కల్పించాలని నిర్ణయించగా ప్రభుత్వం మారడంతో ఈ కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. దీంతోపాటు టీచర్ల కొరత ప్రభుత్వ పాఠశాలలను వేధిస్తోంది. ప్రధానంగా ఈ రెండు సమస్యలను పరిష్కరిస్తే తప్ప ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం లేదని అధ్యాపక వర్గాలు అంటున్నాయి.ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఇది..⇒ రాష్ట్రంలో 30,023 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1,213 స్కూళ్లలో గతేడాది జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది. 13,364 పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ సంఖ్య 50లోపే ఉంది. ⇒ రాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయి. 5,821 స్కూళ్లు ఒకే టీచర్తో నడుస్తున్నాయి. 80 శాతం స్కూళ్లలో సబ్జెక్టు లేదా భాషా పండితుల కొరత ఉంది. ⇒దివ్యాంగులకు టాయ్లెట్స్ లేని స్కూళ్లు 15.45 శాతం ఉన్నాయి. బాలికలకు టాయ్లెట్స్ లేని బడులు 9.44 శాతం ఉన్నాయి. ⇒ 18, 19 పాఠశాలల్లో సమీకృత సైన్స్ లే»ొరేటరీలు లేవు. ఐసీటీ ల్యాబ్లు లేని స్కూళ్లు 11.7 శాతం. స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్లు లేని బడులు 71 శాతం ఉన్నాయి. ⇒ ఎస్సీఈఆర్టీలో మంజూరైన పోస్టుల్లో 46.15 శాతం పోస్టులు, డైట్ కాలేజీల్లో 67.83 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోవిడ్ కాలంలో పెరిగి.. మళ్లీ తగ్గి.. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. వారిలో 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే మిగతా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగింది. 2020 నుంచి 2022 వరకూ ఏటా 2.5 లక్షల మంది కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరారు. కానీ 2023 నుంచి మళ్లీ క్రమంగా ఏటా లక్ష మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి నిష్క్రమిస్తున్నారు. మెరుగైన విద్య లేనందుకేనా? రాష్ట్రంలోని స్కూళ్లలో విద్యార్థుల హాజరుపై సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఇటీవల ఓ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం 44 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 50 మంది విద్యార్థులు కూడా ఉండటం లేదు. ఐదో తరగతి వరకు ఒక్కో క్లాసులో 40 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత నుంచి విద్యార్థుల చేరికలు క్లాసుకు 46 నుంచి 35కు పడిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడవకపోవడం, ఉపాధ్యాయుల కొరత, సకాలంలో పుస్తకాలు అందకపోవడం వల్ల బోధన కుంటుపడుతోంది. దీంతో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పట్టణాలకు తరలుతున్నాయని నివేదిక పేర్కొంది. విస్తృత ప్రచారం కల్పించేలా.. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, నాణ్యతా ప్రమాణాలు పెంచుతున్న తీరుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని విద్యాశాఖ క్షేత్రస్థాయి టీచర్లకు సూచించింది. జూన్ ఒకటి నుంచి 11వ మధ్య చేపట్టే బడిబాట కార్యక్రమంలో స్కూళ్లను ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా తీర్చిదిద్దుతున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలని, ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొంది. -
ఆన్లైన్లోనే ప్రైవేటు పాఠశాలలకు అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు ఆన్లైన్లో మాత్రమే అనుమతి మంజూరు చేస్తామని, ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశించారు. దీనికి సంబంధించి సాంకేతిక సమస్యలు, సూచనలు, సలహాలపై మంగళవారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. విజయవాడ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రైవేటు పాఠశాలలకు అనుమతి, గుర్తింపునకు సంబంధించి ఆన్లైన్ ద్వారా సకాలంలో చలానా చెల్లింపులు, పోర్టల్లో సమస్యలు, ప్రైవేట్ ఉపాధ్యాయులు–సిబ్బంది సమస్యలు, పీఎఫ్, ఆరోగ్య బీమా, ఈఎస్ఐ కార్డు, ఉద్యోగుల జీతాల చెల్లింపు, గుర్తింపు పొడిగింపు, వార్షిక పరిపాలన నివేదిక, ఫీజులు, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాల నిర్వహణపై చర్చించారు. ఇతర సంస్థల ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) వంటివి అప్లోడ్ చేసేందుకు వీలుగా విద్యాశాఖ పోర్టల్ను పునరుద్ధరిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రతి ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన వార్షిక పరిపాలన నివేదికను సంబంధిత విద్యాశాఖాధికారులకు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పి.పార్వతి, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయినికి అభినందన అనకాపల్లి జిల్లా రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న పీవీఎం నాగజ్యోతి ఈనెల 5 నుంచి 9 వరకు నేపాల్లో జరిగిన అంతర్జాతీయ సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ పోటీల్లో పాల్గొని నాలుగు పతకాలు సాధించారు. ఆమెను ఈ సందర్భంగా సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో కమిషనర్ సురేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల విద్య డైరెక్టర్ పి.పార్వతి, ఏపీ టెట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మేరీ చంద్రిక, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు పాల్గొన్నారు. -
నడీరోడ్డుపై స్కూల్ పిల్లలు చేసిన పనికి సబితా మేడం ఏమంటుందో మరి ?
-
భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నేడు స్కూళ్లకు సెలవు
సాక్షి న్యూఢిల్లీ: భారీ వర్షాలతో ఉత్తరభారతం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎడతెరిపిలేని వానలతో దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైనది. ఇప్పుడు దేశ వాణిజ్య రాజధాని ముంబై వంతు వచ్చింది. దంచి కొడుతున్న వానలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. నేడు అనగా గురువారం కూడా ముంబైకి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముంబైలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అధికారు లను అలర్ట్ చేశారు. అవసరమైన అన్ని సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలను ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ఇతర సముదాయాలను కాస్త ముందుగానే మూసివేయాలని సూచించారు. #WATCH | Maharashtra: Heavy rain lashes parts of Mumbai. IMD has issued a 'Red' alert for Palghar, and Raigad districts and an 'Orange' alert for Thane, Mumbai and Ratnagiri today. pic.twitter.com/HR0KUqGCPZ — ANI (@ANI) July 19, 2023 తద్వారా జనం త్వరగా ఇళ్లకు చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఎప్పుడు తెరవాలో పరిస్థితులను బట్టి స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ముంబై తో పాటు పాల్గర్, రాయఘడ్ జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ సూచనతో పాల్గర్, రాయఘడ్ జిల్లాల్లో కూడా నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. -
ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూల్స్
-
మొక్కు‘బడి బాట’..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించేందుకు విద్యాశాఖ చేపట్టిన ‘బడిబాట’కు స్పందన నామమాత్రంగానే ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఇందుకు సహకరించట్లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటుండగా..టీచర్ల నిర్లిప్తత ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు స్కూళ్లు ఆకర్షించినట్టుగా విద్యార్థులను ప్రభుత్వ టీచర్లు ఆకర్షించడం లేదని ఉన్నతాధికారులు సైతం భావిస్తున్నట్టు సమాచారం. కాగా చాలాచోట్ల బడిబాట కార్యక్రమానికి వెళ్లేందుకు టీచర్లు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. రికార్డుల్లో వెళ్లినట్టుగా చూపిస్తూ, ఆన్లైన్లో ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు పంపుతున్నారు. దీంతో కార్యక్రమం మొక్కుబడిగా మారింది. డీఈవోలు, ఎంఈవోల కొరతతో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. బడి మానేసినవారు తిరిగి చేరేలా.. బడి మానేసిన వారిని బడికి తిరిగి రప్పించడమే కాకుండా, ప్రభుత్వ స్కూళ్లలోకి విద్యార్థులను మరలించేందుకు విద్యాశాఖ ఈ నెల 3 నుంచి ‘బడిబాట’చేపట్టింది. ప్రతి స్కూల్ పరిధిలో టీచర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లలు బడిలో చేరేలా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గుర్తించింది 66 వేలు.. ఏటా ప్రభుత్వ స్కూళ్లలో 2 లక్షల మందిని కొత్తగా చేర్పిస్తున్నామని విద్యాశాఖ చెబుతోంది. కానీ ఇప్పటివరకు బడిలో చేర్పించాల్సిన విద్యార్థులు 66,847 మందిని మాత్రమే గుర్తించినట్టు విద్యాశాఖ వెల్లడించింది. వీరిలో ఒకటవ తరగతిలో చేర్చాల్సిన వారి సంఖ్య 16,038 ఉంది. ఇందులో 12,120 మందిని అంగన్వాడీల్లో చేరి్పంచేందుకు పేర్లు నమోదు చేశారు. ప్రైవేటు స్కూళ్లలో చేరేందుకు 1,181 మంది మొగ్గుచూపారు. ఇక 2,737 మంది బడిబాట బృందాలతో సంబంధం లేకుండానే స్కూళ్లలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు 2–7 తరగతుల మధ్య బడి మానేసిన పిల్లలు 8,966 మందిని కూడా గుర్తించారు. వీళ్లు ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఎక్కడ చేరారన్నది స్పష్టత ఇవ్వలేదు. రాజధాని పరిసరాల్లోనే ఎక్కువ బడి మానేస్తున్న వారిలో గ్రామీణ ప్రాంతాలకన్నా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువమంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 4,137 మందిని గుర్తించారు. హైదరాబాద్లో 2,376 మంది బడి మానేసినట్టు తెలుసుకున్నారు. మెదక్లో 2,254 మంది, మేడ్చల్లో 1,457 మంది బడికి దూరమైనట్టు గుర్తించారు. ఇక ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో 3,371 మంది, నిజామాబాద్లో 4,107 మంది బడి మానేసిన పిల్లలున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో స్కూళ్లకెళ్లని విద్యార్థుల తల్లిదండ్రులంతా దినసరి కూలీలే కావడం గమనార్హం. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు పిల్లలను కూడా రోజువారీ పనులకు పంపుతున్నట్టు తేలింది. వీళ్లను గుర్తించడమే తప్ప, వీరంతా స్కూళ్లలో చేరతారా? లేదా? అనేది మాత్రం స్పష్టం కావట్లేదు. ప్రైవేటు టీచర్లకు టార్గెట్లు ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏజెంట్లను రంగంలోకి దింపుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికీ గాలమేస్తున్నాయి. గ్రామాల్లో కొంతమందికి కమీషన్లు ఇస్తూ పిల్లల్ని తమ స్కూళ్లలో చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పించాలని కోరుతున్నాయి. ఊరూరా ఫ్లెక్ల్సీలతో ప్రచారం చేస్తున్నాయి. టీచర్లకు టార్గెట్లు వి«ధించి మరీ విద్యార్థులను చేర్చేలా ఒత్తిడి చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల లెక్కల ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటివరకు రాష్ట్రం మొత్తమ్మీద లక్షమంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు స్కూళ్లలో చేరినట్టు తెలుస్తోంది. -
Telangana: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల బాదుడు.. ఎల్కేజీకి లక్షన్నర!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలలు ఈసారి ఫీజులు భారీగా పెంచినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. కొన్ని బడుల్లో ఏకంగా 50 శాతం వరకూ ఫీజులు పెంచారని వాపోతున్నారు. కోవిడ్ తర్వాత గత ఏడాది నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీన్ని అదనుగా చేసుకుని తల్లిదండ్రుల నుంచి అందినంతా దోచేస్తున్నాయి. అదీగాక, సగం ఫీజును ముందుగానే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫీజులతోపాటు పుస్తకాలు, యూనిఫాం అంటూ అదనపు బాదుడు సరేసరి. ఇంకోవైపు డీజిల్ ధర విపరీతంగా పెరిగిందంటూ రవాణా చార్జీలూ 30 శాతం వరకూ పెంచారు. దీంతో పేదవాడికి ప్రైవేటు విద్య తడిసి మోపెడవుతోంది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా అంతంతమాత్రంగానే చదువు సాగుతోందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ల బాట పడుతున్నారు. చదవండి: కేటీఆర్, కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజ్.. నియంత్రణ ఏమైనట్టు? ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణలో కూడా ఇదే బాట పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. దాదాపు 11 వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించింది. దీంతో ఫీజుల నియంత్రణ కోసం 2016లో ఆచార్య తిరుపతిరావు కమిటీని నియమించింది. ఈ కమిటీ 2017లో ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. స్కూల్లో విద్యార్థిని చేర్చేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరమే ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నట్లు, కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకూ పెంచుతున్నట్లు కమిటీ దృష్టికొచ్చింది. స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ. 4 లక్షల వరకూ వార్షిక ఫీజు వసూలు చేస్తున్నట్లు కమిటీ గుర్తించింది. ఇష్టానుసారం కాకుండా మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచాలని కమిటీ సూచించినా అది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ విధానం కనుమరుగు... రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకుపైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. ఫీజుల నియంత్రణను బడ్జెట్ స్కూళ్లు (వార్షిక ఫీజు రూ. 20 వేలలోపు ఉండేవి) స్వాగతించాయి. స్కూల్ డెవలప్మెంట్ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి 15% ఏటా పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలిచ్చారు. ఇక్కడే సమస్య వస్తోంది. పెద్ద స్కూళ్లు అవసరం లేని ఖర్చును అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక స్కూల్లో ప్రతీ గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేశారు. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపి 25 శాతం ఫీజు పెంచారు. ప్రతీ స్కూలు 10 శాతం వరకు ఫీజు పెంచుకోవచ్చు. 10 శాతం పైగా ఫీజు పెంచే స్కూళ్లు విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల నియంత్రణ కమిటీ పరిశీలిస్తుంది. పాఠశాల యాజమాన్యం ఎక్కడ తప్పు చేసినా భారీ జరిమానాతోపాటు గుర్తింపు రద్దు చేయొచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఫీజుల పెంపును పరిశీలించేందుకు 2018లో తిరుపతిరావు కమిటీ ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది. దాదాపు 4,500 స్కూళ్లు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతం లోపు ఫీజులు పెంచేందుకు అర్హత పొందాయి. ఈ విధానం ఆ తర్వాత కనుమరుగైంది. ఫీజుల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘంగత ఏడాది ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫీజులనియంత్రణ కార్యాచరణకు నోచుకోలేదు. -
ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద 1వ తరగతిలో ప్రవేశాలు
సాక్షి, అమరావతి: విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం కింద రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి ఒకటో తరగతిలో అర్హులైన పేద విద్యార్ధులకు 25 శాతం సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఈమేరకు జీవో 24ను విడుదల చేశారు. ఐబీ (అంతర్జాతీయ), ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ స్కూళ్లన్నిటిలోను విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను అర్హులైన పేదలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ సీట్లకు సంబంధించి మార్చి 4న ప్రవేశాల క్యాలెండర్తో సహా నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆయా ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు మార్చి 6 నుంచి 16 వరకు సంబంధిత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి సంబంధిత వెబ్సైట్ విండో మార్చి 18నుంచి అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 7వ తేదీవరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థుల ఎంపిక ఏప్రిల్ 9 నుంచి 12 వరకు చేపడతారు. మొదటి విడత కేటాయింపు ఏప్రిల్ 13న ఉంటుంది. విద్యార్థులు ఏప్రిల్ 15 నుంచి 21వ తేదీలోపు ఆయా స్కూళ్లలో చేరికలను ఖరారు చేసుకోవాలి. అనంతరం రెండోవిడత సీట్ల కేటాయింపు ఏప్రిల్ 25న చేపడతారు. ఈ విద్యార్థులు ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీలోపు ఆయా స్కూళ్లలో చేరాలి. రిజిస్ట్రేషన్లను హెచ్టీటీపీఎస్://సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్లో నమోదు చేయాలి. ఈ ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద ప్రవేశాలకు సంబంధించి సమస్యలు తలెత్తితే 14417 టోల్ఫ్రీ నంబరును సంప్రదించాలి. ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను, విధివిధానాలను జీవోలో వివరించారు. ఈ స్కూళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక్కో విద్యార్థికి పట్టణప్రాంతాల్లో రూ.8 వేలు, రూరల్లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100 చొప్పున చెల్లిస్తారని జీవోలో తెలిపారు. రాష్ట్రంలోని తమ పిల్లలను బడులకు (ప్రభుత్వ, లేదా ప్రైవేటు) పంపించే అర్హులైన పేద తల్లులందరికీ అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 75 శాతం, ఆపై హాజరు నిబంధన అమలు చేస్తూ పేద పిల్లలందరికీ అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో సీట్లు పొందే ఈ పిల్లలకు సంబంధించి ఆయా స్కూళ్లకు చెల్లించాల్సిన ఫీజును నిబంధనలను అనుసరించి అమ్మ ఒడిని అందుకున్న అనంతరం విద్యాసంవత్సరం చివరన ఆయా స్కూళ్లకు రీయింబర్స్ చేస్తారని జీవోలో పేర్కొన్నారు. అలా తల్లిదండ్రులు చెల్లించకపోతే ప్రభుత్వం ఆమొత్తాన్ని తదుపరి అమ్మ ఒడి నుంచి మినహాయించి స్కూళ్లకు చెల్లిస్తుందని తెలిపారు. -
స్కూళ్లల్లో దోపిడీ షురూ..! జోరుగా ముందస్తు అడ్మిషన్లు
సాక్షి, సిటీబ్యూరో: అప్పుడే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియక ముందే స్కూళ్ల యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. ముందస్తు› ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నిలువు దోపిడీ ప్రారంభమైంది. టెక్నో, ఈ టెక్నో, ఈ స్మార్ట్ అంటూ రకరకాల పేర్లతో అడ్మిషన్ల దందాకు దిగాయి.కొన్ని పాఠశాలలు ముందస్తు సీట్ బుక్ చేసుకుంటే ఫీజులో రా యితీ అని తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం ముగిశాక వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నా విద్యాశాఖాధికారులు నిద్రమత్తులో జోగుతుండడం విమర్శలకు తావిస్తోంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో తీవ్ర పోటీ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఎల్కేజీ, యూకేజీ సీట్లకు అధిక డిమాండ్ ఉండగా, అతర్వాత తరగతుల్లో సీట్ల ఖాళీలును బట్టి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫీజులు, అడ్మిషన్ ఫీజు విషయం పక్కకు పెడితే ..అసలు సీటు దక్కడం అనే ప్రశ్నార్ధకంగా తయారైంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ఆయా స్కూల్లో పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుకు రూ. 1000 నుంచి 2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆయా స్కూల్స్లో సీట్లకు రెండింతలు దరఖాస్తులు రావడంతో ప్రతి సీట్కు తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యమే... కార్పొరేటు, ప్రైవేటు స్కూల్స్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇష్టారాజ్యంగా తయారైంది. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ..అదుపూ లేకుండా పోతోంది. నర్సరీ నుంచి పదవ తరగతి వరకూ ముందస్తు అడ్మిషన్లకు తెరలేపి.. అందిన కాడికి దండుకుంటున్నాయి. కేవలం నర్సరీకే రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు. స్కూల్ యూనిఫాం, పుస్తకాలు ముడిపెట్టి ముందుగానే అడ్మిషన్ ఫీజు చేలిస్తేనే సీటు గ్యారంటì హామీ ఇవ్వడం పరిపాటిగా తయారైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విద్యా సంస్థ కూడా డొనేషన్లు వసూలు చేయకూడదు. కనిపించని నోటీసు బోర్డు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీని ఆసరాగా తీసుకున్న కార్పొరేట్, ప్రై వేటు స్కూల్స్ యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదిలేశాయి. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో తాము వసూలు చేసే ఫీజు వివరాలను తరగతుల వారీగా నోటీసు బోర్డులో ఉం చాలి. కానీ, ఈ నిబంధన ఏ ఒక్క పాఠశాలలో కూడా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రైవేటు టీచర్లకు టార్గెట్ కార్పొరేట్, ప్రై వేటు స్కూళ్లలో అడ్మిషన్లకు యజమాన్యాలు ఆయా సూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు సైతం టార్గెట్ పెడుతున్నాయి. ఒక్కొక్కరికి 10 నుంచి 15 అడ్మిషన్లు చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. టార్గెట్ పూర్తి చేయకుంటే వచ్చే విద్యాసంవత్సరంలో ఉద్యోగానికి ఎసరు తప్పని పరిస్థితి నెలకొంది. ఇదీ చదవండి: Andhra Pradesh: బోధనలో నవశకం -
ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక నజర్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యానికి ముకుతాడు వేయాలని విద్యాశాఖ భావిస్తోంది. డీఏవీ స్కూల్ ఉదంతం నేపథ్యంలో అన్ని ప్రైవేటు పాఠశాలలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో డొనేషన్లు, ఫీజులు కనీస వసతులతో పాటు నిర్వహణ తీరుతెన్నులపై కూడా ఆరా తీసేందుకు సిద్ధమైంది. సీసీ కెమెరాల నిఘా నడుమ పాఠశాల నిర్వహణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మండలం యూనిట్గా ఆయా పాఠశాల వ్యవహారంపై సమగ్ర నివేదిక తెప్పించుకొని దాని ఆధారంగా రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాల అనుమతి పునరుద్ధరించే సమయంలో చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది. పాఠశాలకు అనుమతి రెన్యువల్ చేయడమో.. లేక తిరస్కరించడమో చేయనుంది. నిబంధనలు తూచ తప్పకుండా పాటించే విధంగా షరతులను అనుమతికి కొర్రీగా పెట్టనుంది. నిబంధనలు అమలు చేసే అవకాశం లేకపోలేదని విద్యాశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర స్కూళ్లపై కూడా.. ►స్టేట్ సిలబస్తో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూల్స్పై కూడా పర్యవేక్షణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. స్టేట్ సిలబస్ పాఠశాలపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులది ఉండగా, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ గుర్తింపునకు మాత్రం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) మాత్రమే జారీ చేస్తోంది. ►ఈ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎన్ఓసీ సైతం ఉపసంహరించే విధంగా నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. కేవలం ఫీజులపై దృష్టి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు దండుకునే విషయంలో చూపే శ్రద్ధ.. మౌలిక వసతులను కల్పించడంలో లేకపోవడం సర్వసాధారణంగా తయారైంది. ►ప్రైవేటు యాజమాన్యాలు విద్యకు మినహా ఆటలకు, భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. అపార్టుమెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలిలో దీపంలా ఉంచుతున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి.. ►ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. సంబంధితశాఖ అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే ధ్రువీకరించాలి. ►కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా ఒత్తిళ్లు, పలుకుబడితో అనుమతులు లభించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇక విద్యాశాఖ అధికారులది కూడా అదే పరిస్థితి అని పలువురు పెదవి విరుస్తున్నారు. పాఠశాలలను పరిశీలించకుండానే అనుమతుల జారీ అనుమానాలకు తావిస్తోది. -
చిన్నారిని వేధిస్తున్న కారు డ్రైవర్ ను చితకబాదిన పేరెంట్స్
-
ప్రభుత్వ చర్యలు సంతృప్తికరం
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న తమ ఆదేశాల అమలు విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైకోర్టు సంతృప్తి వ్యక్తంచేసింది. ప్రభుత్వ చర్యల్లో చిత్తశుద్ధి కనిపిస్తోందని, అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోలేమని తేల్చిచెప్పింది. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేశ్కుమార్ దాఖలు చేసిన కోర్టు ఆదేశాల అమలు నివేదికపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని పిటిషనర్కు సూచిస్తూ రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. 2,603 మంది విద్యార్థులకు ప్రవేశాలు.. విద్యా హక్కు చట్ట నిబంధనల ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు అన్ని ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని జనవరిలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ పిటిషనర్ టి.యోగేష్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా.. ప్రభుత్వ న్యాయవాది ఎల్వీఎస్ నాగరాజు స్పందిస్తూ.. ధర్మాసనం ఆదేశాల అమలుకు సంబంధించిన నివేదికను కోర్టు ముందుంచారు. కేటాయించిన సీట్ల వివరాలను కూడా తెలియజేశారు. 25 శాతం సీట్ల గురించి మీడియాలో విస్తృత ప్రచారం చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 9,514 ప్రైవేట్ స్కూళ్లలో ఒకటో తరగతి ప్రవేశాల నిమిత్తం 5,195 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 3,515 మంది ఆన్లైన్ వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారని తెలిపారు. ఆరు దశల్లో దరఖాస్తులను పరిశీలించగా.. 3,288 మంది లాటరీకి ఎంపికయ్యారని చెప్పారు. ఇందులో 2,603 మంది 1వ తరగతి ప్రవేశాలు పొందారని వివరించారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆయా స్కూళ్లకు పంపించామన్నారు. మిగిలిన సీట్లకు రెండో జాబితా విడుదల చేస్తామని నాగరాజు చెప్పారు. ఈ వివరాలపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ టి.యోగేష్ స్పందిస్తూ కేవలం 2,603 సీట్లే భర్తీ చేశారని, మీడియాలో విస్తృత ప్రచారం చేయలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వ చర్యల్లో చిత్తశుద్ధి కనిపిస్తోందని పేర్కొంది. -
ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు 25 % సీట్లు
సాక్షి, అమరావతి: పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లలో ప్రవేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనుంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలతో భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అనాధ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు చేపడతారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ మైనారిటీ, ఓసీలకు 6 శాతం, అనాథ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు ప్రాతిపదికగా నిర్ణయించారు. ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి బాలల హక్కుల చట్టం–2009 జీవో 20ని సవరిస్తూ జీవో 129లో సవివర మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాల కోసం రెండో జాబితా విడుదల చేయనున్నారు. 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లలో పేద విద్యార్థులకు ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 16వ తేదీనుంచి ప్రారంభం అవుతుందని కమిషనర్ తెలిపారు. ఆగస్టు 26వ తేదీ వరకు http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 1వ తరగతిలో ప్రవేశాలు, జీవో సవరణ వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. -
ప్రైవేటు బడుల్లో భద్రతెంత?
కడప ఎడ్యుకేషన్ : ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు దండుకునే విషయంలో ఉన్నంత శ్రద్ధ వారికి మౌలిక వసతులను కల్పించడంలో లేదనే చెప్పాలి. విద్యార్థులకు ఆటపాటలటుంచితే మలమూత్రాలను కూడా ప్రశాంతంగా విసర్జించని పరిస్థితి దాపురించింది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యకు మినహా ఆటలకు, విద్యార్థుల భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. అపార్టుమెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలిలో దీపంలాగా ఉంచుతున్నారు. జిల్లాలో చాలా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను ఇరుకు గదులు, వ్యాపార సంస్థలు, అపార్టుమెంట్లలో నడుపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 వందలకు పైగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. వీటిలో అధికశాతం ఇరుకుగదుల్లోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపకశాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. సంబంధితశాఖ అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే ధ్రువీకరించాలి. కానీ కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడితో అటు, ఇటుగా ఉన్నా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తరువాత రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇక విద్యాశాఖ అధికారులది కూడా అదే పరిస్థితి అని పలువురు పెదవి విరుస్తున్నారు. పాఠశాలలను పరిశీలించకుండానే అనుమతులు, రెన్యువల్స్కు గ్రీన్సిగ్నల్స్ ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. కనీస వసతులు కరువు కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నా వారికి కావాల్సిన కనీస మౌలిక వసతులను కల్పించడం లేదనే విమర్శలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులకు తాగేందుకు సరిపడా మంచినీటిని కూడా అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలున్నాయి. వీటితోపాటు విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు గానీ మూత్రశాలలు కానీ ఉండటం లేదు. సహజంగా భార్య,భర్తతోపాటు ఇద్దరు పిల్లలున్న ఓ కుంటుంబం సింగిల్ బాత్రూంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది వందల మంది విద్యార్థులున్న పాఠశాలల పరిస్థితిని గమనిస్తే దారుణంగా ఉంది. కడపలో కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో 300 మొదలుకుని వెయ్యికి పైగా విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలున్నాయి. ఆ పాఠశాలల్లో కూడా నాలుగైదు మరుగుదొడ్లతోపాటు తొమ్మిది పది మూత్రశాలలుంటాయి. పాఠశాల విరామ సమయంలో వాటి ముందు పిల్లలు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంటోందని పలువురు వాపోతున్నారు. ఇక అమ్మాయిల ఇబ్బందులు వర్ణనాతీతం. కొంతమంది బాలికలు బాత్రూముల సమస్యతో తగినంత నీరుతాగడం మానేçస్తున్నట్లు కూడా తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇది కొన్ని రుగ్మతలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత అధికారులు పాఠశాలల్లో మౌలిక వసతులపై స్పందించాల్సిన అవసరం ఉంది. పరిశీలిస్తా అపార్టుమెంట్లు, ఇరుకైన సముదాయాల్లో పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వస్తే పరిశీలిస్తాం. నిబంధనలు పాటించకుండా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు కూడా పాఠశాలలను నిర్వహించకూడదు. – చెప్పలి దేవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులున్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన గదులు, ఆటస్థలంతోపాటు, మంచినీటి సౌకర్యం అలాగే ఆధునిక వసతులతో మరుగుదొడ్లు, పరిమితి గంటల్లో బోధన ఉంటుంది. దీంతోపాటు ఆంగ్లమాధ్యమాన్ని కూడా ప్రవేశ పెట్టింది. అయినా చాలామంది తల్లిదండ్రులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలనే ఆశ్రయిస్తున్నారు. అదే అదనుగా ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న చాలామంది ఈ పాఠశాలల్లో చదివిన వారేనన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది. -
ప్రైవేటు విద్యార్థులకు చౌకగా పాఠ్యపుస్తకాలు
సాక్షి, అమరావతి: ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కుల పేరిట జరుగుతున్న దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం ముకుతాడు వేసింది. తల్లిదండ్రులపై ఏటా వేలాది రూపాయల భారం పడకుండా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థలకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కులు తదితరాలను ప్రభుత్వమే ముద్రించి పంపిణీ చేసే విధానానికి ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టింది. అతి తక్కువ ధరకు నాణ్యతతో కూడిన పుస్తకాలను పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు ఈ పాఠశాలల విద్యార్థులకు కావలసిన పుస్తకాలను ఆయా యాజమాన్యాలు ప్రైవేటు పబ్లిషర్ల నుంచి తీసుకొని అందించే విధానాన్ని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేసింది. దీనివల్ల పబ్లిషర్లు, పాఠశాలల యాజమాన్యాలు ఎక్కువ ధరలకు పుస్తకాలను అమ్మి, తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు దండుకొనేవి. కొన్ని పాఠశాలల విద్యార్థులు షాపుల్లో అధిక ధరలకు కొనేవారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలైతే ఒకటో తరగతి నుంచే పాఠ్య పుస్తకాలకోసం రూ.5 వేల వరకు వసూలు చేసేవి. పై తరగతులకు వెళ్తున్నకొద్దీ ఈ వ్యయం రూ.10వేలకు పైనే ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పబ్లిషర్ల పుస్తకాలను కూడా ఈ స్కూళ్లు బలవంతంగా అంటగట్టేవి. ఈ పుస్తకాల నుంచి ఏదైనా బోధిస్తారా అంటే అదీ ఉండదు. ఆయా సంస్థలు రూపొందించే స్టడీ మెటీరియల్ను అనుసరించి బోధన, పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి మళ్లీ అదనంగా వసూలు చేస్తున్నారు. వీటన్నిటికీ ముకుతాడు వేస్తూ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు ఉచితంగా అందిస్తోంది. ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థుల సంఖ్యను అనుసరించి ముందుగా ఇండెంటు తీసుకొని 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ముద్రించింది. ప్రైవేటు పాఠశాలల్లో 24, 44,942 మంది విద్యార్థులుండగా వాటి నుంచి 18,02,879 మంది విద్యార్థులకు సరిపడా ఇండెంటు వచ్చింది. వీరికి ఆయా తరగతులు, టైటిళ్లు, వివిధ మాధ్యమాలకు సంబంధించి 1.83 కోట్ల పాఠ్యపుస్తకాలను విద్యా శాఖ, ప్రభుత్వ పాఠ్య పుస్తక విభాగం సిద్ధం చేశాయి. పంపిణీకి ఏర్పాట్లు చేపట్టాయి. తరగతులు, స్టూడెంట్లవారీగా సెట్ల కింద అందిస్తున్నాయి. స్కూళ్ల యాజమాన్యాలు నిర్దేశిత గేట్వే ద్వారా డబ్బులు చెల్లిం చగానే పుస్తకాలను ఎంఈవోల ద్వారా అం దిస్తారు. పాఠ్య పుస్తకాల ధరలను నిర్ణయిస్తూ శనివారం పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీచేసింది. -
సర్కారు బడి... అడ్మిషన్ల సందడి
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో సర్కారు బడులు కొత్త విద్యార్థుల చేరికతో సందడిగా కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్టుగా ప్రభుత్వ పాఠశాలల ముందు అడ్మిషన్ల కోసం క్యూలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే విద్యార్థుల సంఖ్య ఎక్కువైపోయి అడ్మిషన్లు ఇవ్వలేమని చెప్పేదాకా వెళ్లిపోయాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ‘మన ఊరు–మన బడి’తో ప్రైవేటుకు దీటుగా మెరుగుపర్చడంతోనే విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. అడ్మిషన్లు మొదలైన 15 రోజుల్లోనే లక్షన్నర మందికిపైగా కొత్త విద్యార్థులు చేరారని అంటున్నాయి. బడి బాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తే.. భారీగా అడ్మిషన్లు అవుతాయని పేర్కొంటున్నాయి. 30 వేల పాఠశాలలు.. 30లక్షల విద్యార్థులు రాష్ట్రంలో 30వేల వరకు ప్రభుత్వ విద్యా సంస్థలున్నాయి. వాటి పరిధిలో 30 లక్షల మంది చదువుతున్నారు. రెసిడెన్షియల్ విధానంలో కొనసాగుతున్న గురుకుల విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు మినహాయిస్తే.. 26,040 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 23.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు– మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏటా 25 శాతం పాఠశాలలను పూర్తి స్థాయిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లో ఏకంగా రూ.12 వేల కోట్లు కేటాయించింది. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో పనులు కూడా మొదలయ్యాయి. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు నాణ్యమైన విద్య అందించేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీనితో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాటివైపు ఆకర్షితులవుతున్నారు. పలుచోట్ల ప్రైవేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే గత పదిహేను రోజుల్లో ఏకంగా 1,50,826 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో వేర్వేరు తరగతుల్లో ప్రవేశాలు పొందారు. అంటే రోజుకు సగటున 10వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు లెక్క. అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు నెలాఖరు వరకు ఉంటుందని.. ఇందులో కనీసం నెల రోజుల పాటు రోజూ పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు కొనసాగే అవకాశం ఉందని విద్యా శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇదే విధానాన్ని ఇంటర్, డిగ్రీ స్థాయిల్లోనూ అమలు చేస్తే.. పదో తరగతి తర్వాత విద్యార్థుల డ్రాపౌట్లను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నమోదవుతున్న ప్రవేశాల్లో అత్యధికం పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. రెండేళ్లుగా కోవిడ్–19 ప్రభావంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఫీజులను అడ్డగోలుగా పెంచేశాయి. ఆ భారం మోయలేని పేద, మధ్యతరగతి కుటుంబాల వారు పిల్లలను ఆంగ్ల మాధ్యమం ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. ► ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు జీవనోపాధి కోసం ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో.. నగర శివార్లలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చేరికలు ఉంటున్నాయి. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డిలతోపాటు హన్మకొండ, సిద్దిపేట, ఇతర జిల్లా కేంద్రాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు జిల్లాల్లోనూ గణనీయంగానే అడ్మిషన్లు ఉంటున్నాయి. ► సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సంస్థ ఈ మధ్య నిర్వహించిన సర్వేలో కరోనా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో తీవ్ర ఒడిదుడుకులకు కారణమైందని.. చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని తేల్చింది. తమ పిల్లలను మంచి ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు పంపించలేని స్థితికి జారిపోయాయని తమ నివేదికలో పేర్కొంది కూడా. ఇంగ్లిష్ మీడియం కలిసి వస్తోంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడానికి ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, 1 నుంచి 8 వరకు ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం కలిసి వస్తున్నాయి. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు విపరీతంగా పెరగడం, కోవిడ్ కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారడం కూడా కారణమే. ఉపాధ్యాయుల కొరత తీర్చడం, పారిశుధ్య నిర్వహణ మెరుగుపరిస్తే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతాయి. – చావా రవి, టీఎస్టీయుఎఫ్ ప్రధాన కార్యదర్శి స్కూళ్లు నిండిపోతున్నాయి రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే విద్యార్థులు ఎక్కువైపోయి.. నో అడ్మిషన్స్ బోర్డులు పెడుతున్నారు. రాబోయే కాలంలో అలాంటి స్కూళ్లు మరింతగా పెరుగుతాయి. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. మన ఊరు–మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల తల్లితండ్రులు ఆకర్షితులవుతున్నారు. – రాజ భాను చంద్రప్రకాశ్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను స్వాగతిస్తున్నాం. తల్లిదండ్రులకు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెరగడమే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణం. ప్రైవేటు ఫీజుల భారం కూడా దీనికి కారణమవుతోంది. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడితే బాగుంటుంది. – జి.సదానందంగౌడ్, ఎస్టీయూటీఎస్, రాష్ట్ర అధ్యక్షుడు జోరుగా అడ్మిషన్లు ► తెలంగాణ ఏర్పాటు నుంచి ఏటా సగటున లక్షన్నర నుంచి 2 లక్షల మంది వరకు విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతుంటారు. అదికూడా జూన్ రెండో వారం నుంచి ఆగస్టు చివరి వరకు కూడా అడ్మిషన్లు జరుగుతుంటాయి. ► ఈసారి అడ్మిషన్లు మొదలైన 15 రోజుల్లోనే లక్షన్నర మందికిపైగా విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. ఈ లెక్కన మొత్తంగా అడ్మిషన్లు ముగిసే నాటికి మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల మంది వరకు కొత్తగా చేరే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ► ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ‘మన ఊరు– మన బడి’తో సదుపాయాల కల్పనే దీనికి కారణమని చెప్తున్నారు. ► ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఎక్కువగా ఉంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో సదుపాయాల అభివృద్ధి వేగంగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు కూడా దీనికి కారణమని అంచనా. ► ప్రైవేటు పాఠశాలలు అడ్డగోలుగా ఫీజులు పెంచడం, కరోనాతో కుటుంబాల ఆదాయం తగ్గడం వల్ల కూడా.. ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు తరలడానికి కారణం అని విద్యా రంగ నిపుణులు చెప్తున్నారు. -
విరగ‘బడి’ వసూళ్లు! పీపీకి రూ.22 వేలు? అడిగే దిక్కేది!
నిజామాబాద్అర్బన్: కరోనా కల్లోల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తోన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ల్యాబ్, లైబ్రరీ స్పోర్ట్స్, ఇతర ఫీజుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రస్తుతం 456 ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్ష 25 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కరోనా తర్వాత రెండేళ్లకు తెరుచుకున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ మొదలైంది. ఆర్మూర్ నిజామాబాద్, బోధన్, భీమ్గల్, డిచ్పల్లి వంటి పట్టణాల్లో ఫీజుల దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. పీపీ–1 క్లాస్ పిల్లవాడికి నిజామాబాద్ నగరంలో అన్ని ఫీజులు కలుపుకొని రూ. 50వేల వరకు ఒక కార్పొరేట్ పాఠవాల వసూలు చేస్తోంది. ఆర్మూర్ గ్రామీణ ప్రాంతంలో ఓ కార్పొరేట్ పాఠశాల, బోధన్ రాకాసిపేట్లోని ఓ ప్రైవేట్ పాఠశాల పెద్ద మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. సర్కార్ బడి వైపు పిల్లల్ని చేర్పించాలని ప్రచారం చేస్తున్న విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ మాత్రం చేపట్టడం లేదు. చదవండి👉🏻అసలే కానిస్టేబుల్.. ఆపై తులం బంగారమిస్తే డబుల్ ఇచ్చారు.. అక్కాచెళ్లెళ్ల మాదిరి! ఉత్తర్వులు అమలెక్కడ....? విద్యాశాఖలో కొన్నేళ్ల ఫీజుల నియంత్రిణ కోసం జీవో.నం. 1ను మొదట విడుదల చేశారు. 2017 ఫిబ్రవరి ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో కమిటీ వేసిన ప్రభుత్వం జీవో.నం. 1ను అమలు చేస్తూనే ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవచ్చని జీవో నం. 46ను విడుదల చేసింది. కాని పది శాతాన్ని పక్కకు పెట్టు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే జిల్లా విద్యాశాఖాధికారి మొదలుకొని ఎంఈవో వరకు ఎవరూ కూడా ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భాలు లేవు. ఫిర్యాదులు వస్తేనే చూస్తామనే ధోరణిలో వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలతో మిలాకత్ అయి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎటువంటి అడ్మిషన్ ఫీజు వసూలు చేయరాదు. జిల్లాలో సగటున ప్రతి ప్రైవేట్ విద్యార్థి నుంచి రూ. 1,000 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. హాస్టల్ వసతి పేరుతో రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చదవండి👉🏻పార్కింగ్ బాధ్యత యజమానులదే: హైకోర్టు ప్రైవేట్లో ఫీజుల వివరాలు.. చదువు కంటే బస్సు ఫీజులే ఎక్కువ నగరంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బస్సుల ఫీజులు పాఠశాల ఫీజుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆర్మూర్ రోడ్డులో ఉన్న మూడు ప్రైవేట్ పాఠశాలల్లో ఏడాదికి రూ. 32 వేలు బస్సు ఫీజులు వసూలు చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రూ. 20 వేల వరకు ఉన్నాయి. ఇలా విద్యార్థుల ఫీజుల కంటే బస్సు చార్జీలే ఎక్కువయ్యాయి. భారం మోయలేకపోతున్నాం.. పెరిగిన ఫీజుల భారం మోయలేకపోతున్నాం. ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువగా ఫీజులు పెంచడం సబబు కాదు. తక్షణమే విద్యాశాఖాధికారులు స్పందించాలి. మధ్యతరగతి, పేదవారికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. అసలే కరోనా వల్ల అనేక ఇబ్బందులు పడ్డాము. ఈ ఫీజులను భరించలేకపోతున్నాము. – మనోజ్, విద్యార్థి తండ్రి గాయత్రి నగర్ నిబంధనల ప్రకారం వసూలు చేయాలి ప్రైవేట్ పాఠశాలలు నిబంధనల ప్రకారమే ఫీజులు వసులు చేయాలి. విద్యాశాఖ నిబంధనలు అమలు చేయాలి. లేదంటే పాఠశాలలను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుంటాం. – దుర్గాప్రసాద్, డీఈవో -
తొలి రోజు అంతంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమైనా పెద్దగా సందడి కనిపించలేదు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో కలిపి విద్యార్థుల హాజరు 20 శాతానికి మించలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. తొలిరోజున బోధన ఏదీ జరగదన్న ఉద్దేశం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, సెలవుల కోసం ఊర్లకు వెళ్లినవారు ఇంకా తిరిగి రాకపోవడం వంటివి దీనికి కారణ మని అంటున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఎక్కువ శాతం విద్యార్థులు యూనిఫాంతో కనిపించగా.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంకా యూనిఫాం ఇవ్వకపోవడంతో సాధారణ దుస్తుల్లోనే విద్యార్థులు హాజరయ్యారు. పలుచోట్ల ప్రభుత్వ స్కూళ్లలో స్వాగత తోరణాలు కట్టి విద్యార్థులను ఆహ్వానించారు. మిఠాయిలు పంచారు. నేతలు, టీచర్ల హడావుడి.. బడుల ప్రారంభోత్సవాన్ని పండుగలా జరపాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ ఏడాది నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఉంటుందని, అందువల్ల ప్రైవేటు బడులకన్నా ఇక్కడ చదివించడమే మంచిదని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. మంత్రి సబిత హైదరాబాద్లోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లారు. తరగతి గదిలో విద్యార్థులతో కలసి బెంచీపై కూర్చుని కాసేపు ముచ్చటించారు. స్కూలు ప్రాంగణానికి వచ్చిన తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కామన్పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన గురించి ఉపాధ్యాయులు వివరించారు. గార్లలో ఓ ప్రభుత్వ బడిలో చేరిన ప్రైవేటు స్కూలు విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా స్వాగతించారు. నల్లగొండ జిల్లా మాన్యంచెల్క ప్రాథమిక పాఠశాలలో 24 మంది విద్యార్థులకుగాను తొలిరోజున నలుగురు మాత్రమే హాజరయ్యారు. ఈ పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా.. ఒక్కో గదిలో ఇద్దరేసి విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు. ఇక కార్పొరేట్ తీసికట్టు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నాం. పైసా ఖర్చులేకుండా ఇంగ్లిష్ మీడియంలో విద్య నేర్చుకోవచ్చు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తాం. ఇప్పటికే 75 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశాలు పొందారు. భవిష్యత్లో అన్ని మౌలిక సదుపాయాలు అందించే సర్కారీ బడులను ఆదరించాలి. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి -
220 ప్రైవేటు విద్యాసంస్థల గుర్తింపు రద్దుకు సిఫారసు
బి.కొత్తకోట: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 220 ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల గుర్తింపును రద్దుచేయాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చినట్లు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వెంబులూరు నారాయణరెడ్డి, బి.ఈశ్వరయ్య చెప్పారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్లో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. 2022–23 విద్యాసంవత్సరంలో విద్య, బోధన సామర్థ్యంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిసారించిందని చెప్పారు. దీనిపై ఇప్పటికే మూడుసార్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించారన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఎనిమిది ఐటీడీఏల పరిధిలోని రెండువేల పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేసేందుకుగాను ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా అక్షరాస్యతను పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. మూడుశాతం బడిబయట పిల్లలున్నారని, వీరిని పాఠశాలల్లో చేర్పిస్తామని తెలిపారు. అక్షరాస్యతలో జాతీయస్థాయిలో రాష్ట్రాన్ని రెండు, మూడు స్థానాలకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. గత ఏడాది రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి ఇంటర్ చదువుతున్న ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. ప్రభుత్వం విద్యకు అందిస్తున్న ప్రోత్సాహం, పాఠశాలల అభివృద్ధితోనే ఇది సాధ్యమైందన్నారు. దేశంలో పాఠశాల విద్యకు రూ.29 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించిన ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వృత్తివిద్య కోర్సులను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. విద్యాబోధనలో ఉపాధ్యాయులకు, ఫీజులపై తల్లిదండ్రులకు, అభ్యసన సామర్థ్యంపై విద్యార్థులకు త్వరలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలల కమిటీలను బలోపేతం చేయడం కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. -
సెలవుల్లోనూ ‘స్టడీ’గా.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష క్లాసులతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయని భావిస్తున్న సమయంలో, ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు, సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత వరకు పాఠాల పునఃశ్చరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి ఇవి సర్వ సాధారణమే అయినప్పటికీ, ప్రస్తుత ప్రత్యేక పరిస్థి తుల్లో ఇన్ని రోజుల సెలవులపై తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన కన్పిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కరోనా థర్డ్వేవ్తో స్కూళ్లు మూతపడుతున్నాయి. దీంతో సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో యథావిధిగా స్కూళ్లు నడుస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి. గడచిన రెండేళ్ళుగా కరోనా నేపథ్యంలో విద్యా సంస్థ లన్నీ మూతపడ్డాయి. ఫలితంగా విద్యా ర్థులు పెద్ద మొత్తంలో లెర్నింగ్ లాసెస్ (అభ్యసన నష్టాలు) ఎదుర్కొంటున్నారు. 41 శాతం మందిలో రాత నైపు ణ్యం, 34 మందిలో చదివే సామర్థ్యం, 51 శాతానికి పైగా ఇంగ్లీష్ భాషపై పట్టు పోయిందని ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ స్కూళ్లు మూతపడితే విద్యార్థుల పరిస్థితి ఏమి టనే ఆందో ళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల చదువుపై ప్రత్యేకంగా దృష్టి సారించా ల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరి ప్రణాళిక వారిది? ♦సెలవుల్లో విద్యార్థి చదువు స్పృహ నుంచి పక్క దారి పట్టకుండా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో సంక్రాంతిని ఉమ్మడిగా ఆస్వాదించే అవకాశం కూడా లేదు కాబట్టి, విద్యార్థులు చదువుపైనే దృష్టి కేంద్రీకరించేలా చూడాలని భావిస్తున్నాయి. ♦ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యార్థులను మళ్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్కు కనెక్ట్ చేసే (ఆన్లైన్ పాఠాలు) ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి వంటి జిల్లాల్లోని కొన్ని ప్రైవేటు స్కూళ్ళు ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేశాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాయి. ♦ఇప్పటివరకు జరిగిన పాఠాల్లో విద్యార్థులు ఆసక్తిగా వినలేదని భావించే సబ్జెక్టులపై ప్రత్యేక క్లాసులు (పునఃశ్చరణ) నిర్వహించాలని నిర్ణయించినట్టు కొన్ని స్కూళ్ళ నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు ఆన్లైన్ ద్వారా ప్రతిరోజూ విద్యార్థులకు క్విజ్, పజిల్స్, జనరల్ నాలెడ్జ్, పాఠ్యాంశాల్లోంచే సంక్షిప్త ప్రశ్నలు అడిగేలా ప్లాన్ చేసినట్టు ప్రైవేటు విద్యా సంస్థలు కొన్ని తెలిపాయి. ♦ప్రాక్టికల్ నాలెడ్జ్ను త్రీడీ యానిమేషన్తో అందించేందుకు ఖమ్మంలోని ఓ ప్రైవేటు స్కూలు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సైన్స్ సబ్జెక్టులో ఇప్పటివరకు చెప్పిన ఖగోళ, మొక్కలు, మానవ అవయవ నిర్మాణం తదితర అంశాలు త్రీడీ ద్వారా అర్థమయ్యేలా ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు వివరించాలని భావిస్తున్నారు. ♦ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనూ సెలవు దినాల్లో ప్రత్యేక హోంవర్క్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని మహబూబ్నగర్కు చెందిన ప్రధానోపాధ్యాయుడు రవికాంత్ తెలిపారు. ఇప్పటికే ఎస్ఏ–1 పరీక్ష పూర్తి చేశాం. కాబట్టి పిల్లలకు పరీక్షల భయం లేదు. కాకపోతే విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవ్వడం, ఇప్పుడిప్పుడే సిలబస్ ముందుకెళ్ళడం జరుగుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. వాటిని మరిచి పోకుండా ఉండేందుకు ప్రణాళిక బద్ధంగా హోంవర్క్ ఇస్తున్నట్టు చెబుతున్నారు. విద్యార్థుల మూడ్కనుగుణంగా బోధన సెలవుల్లో విద్యార్థులు సాధారణంగా మానసికోల్లాసాన్ని కోరుకుంటారు. అలాంటప్పుడు మళ్లీ చదువు, పాఠాలంటే విసుగుకరంగా భావించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఆసక్తి కలిగించే రీతిలో విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. దీనికోసం మేం డిజిటల్ ప్లాట్ ఫామ్ను వాడుతున్నాం. క్విజ్, పజిల్స్తో పాటు సిలబస్లోని పాఠాలు మరిచిపోకుండా ప్రాక్టికల్గా త్రీడీ యానిమేషన్తో అందించేందుకు విద్యార్థులను సంసిద్ధులను చేశాం. సెలవుల్లో విద్యార్థి మేథోశక్తికి పదును పెట్టకపోతే దాని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. – ఆర్ పార్వతీ రెడ్డి, హార్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, ఖమ్మం బడి మరిచిపోకుండా హోం వర్క్ సెలవుల్లోనూ విద్యార్థి బడిని, చెప్పిన పాఠాన్ని మరిచిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్కూల్ నుంచైతే కొంత హోం వర్క్ ఇస్తున్నాం. దీన్ని ఫాలో అయితే ఫైనల్ పరీక్షల్లో విద్యార్థి చురుకుదనం పెరుగుతుంది. ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. రోజూ కొంత సేపైనా పుస్తకాలు పఠించేలా ప్రోత్సహించాలి. – పరాంకుశం రాజా భానుప్రకాశ్, హెచ్ఎం, ఎల్ అండ్ ఎం ప్రభుత్వ పాఠశాల, కరీంనగర్ -
25 శాతం ఉచిత సీట్ల నిబంధనను అమలు చేస్తాం
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటా యిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిం చింది. విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధన లను తప్పక అమలు చేస్తామని వివరించింది. అర్హు లైన విద్యార్థుల గుర్తింపు జరుగుతోందని తెలిపింది. విద్యా హక్కు చట్టం అమలుకు మూడు నెలల గడువు మంజూరు చేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరు తూ న్యాయవాది యోగేష్ 2017లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాస నం తాజాగా మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది కేవీ రఘువీర్ స్పందిస్తూ.. విద్యా హక్కు చట్టం అమలుపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రాజశేఖర్ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీజే ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మూడు నెలల గడువునివ్వండి.. విద్యా హక్కు చట్టం అమలు నిమిత్తం రూపొందించిన మార్గదర్శకాల్లో భాగంగా సంబంధిత శాఖలన్నింటితో సమావేశం నిర్వహించామని రాజశేఖర్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో 1,19,550 ప్రవేశాలు జరిగాయన్నారు. ఇందులో విద్యా హక్కు చట్టం ప్రకారం.. 25 శాతం అంటే 29,887 మందికి ఉచిత సీట్లు కేటాయించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 24న జీవో 53 జారీ చేసిందని తెలిపారు. ఒకటవ తరగతికి 25 శాతం ఉచిత సీట్ల నిబంధన అమలు చేయడానికి రూ.33 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అంతేకాకుండా ప్రత్యేక పోర్టల్ను రూపొందించాల్సి ఉంటుందని, ఈ పోర్టల్ రూపకల్పనకు రెండు మూడు నెలల సమయం పడుతుందని వివరించారు. ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటికే ప్రవేశాలు ముగిశాయని, అందువల్ల 25 శాతం ఉచిత సీట్ల నిబంధనను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. -
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
బద్వేలు అర్బన్: రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీపై మండిపడ్డారు. బుధవారం ఆయన బద్వేలులో విలేకరులతో మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీకి తోడు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుండటం భావ్యం కాదన్నారు. ప్రైవేటు యాజమాన్యం కింద నడిచే విద్యా సంస్థల పనితీరుపై సీఎం వైఎస్ జగన్ ఒక కమిటీ వేసి ఆ కమిటీకి కొన్ని బాధ్యతలు అప్పగించారన్నారు. ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏ విధంగా పని చేస్తున్నాయి.. టీచర్, విద్యార్థి నిష్పత్తి ఎలా ఉంది.. ఫలితాలు ఎలా వస్తున్నాయి.. నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి, వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి.. తదితర విషయాల్లో సూచనలివ్వాలని కమిటీని ఆదేశించారన్నారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ఎయిడెడ్ స్కూళ్ల పరిస్థితి దారుణం ► ఎయిడెడ్ స్కూళ్లు దాదాపుగా నిర్వీర్యమయ్యాయి. కొన్ని చోట్ల టీచర్లకు, యాజమాన్యం మధ్య సఖ్యత లేదు. చాలా స్కూళ్లలో మౌలిక వసతులు లేవు. అందువల్ల విద్యార్థులు ఆ స్కూళ్లలో చేరడం లేదు. ► ఈ పరిస్థితిలో యాజమాన్యాలు స్కూళ్లను ప్రభుత్వానికి అప్పగిస్తే అవసరమైన మేరకు టీచర్లను నియమించడంతో పాటు నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేయవచ్చని నిర్ణయించాం. ► అయితే ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేస్తే స్కూళ్లు మూత పడిపోతాయని ప్రతిపక్షం, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులను రెచ్చగొడుతున్నాయి. వాస్తవానికి స్కూళ్లు అప్పగించాలని ప్రభుత్వం ఏ ఒక్క స్కూలు యాజమాన్యాన్ని బలవంత పెట్టడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలుగా నడుపుకోవచ్చు ► ఎయిడెడ్ యాజమాన్యాలు తమకు గ్రాంట్ అవసరం లేదని, టీచర్లను ప్రభుత్వానికి సరెండర్ చేసి ప్రైవేటు విద్యా సంస్థలుగా నడుపుకుంటామని చెబితే ఎలాంటి అభ్యంతరం లేదు. ► రాష్ట్రంలో ఉన్న సుమారు 137 పైచిలుకు డిగ్రీ కాలేజీల్లో 7 డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు స్టాఫ్తో పాటు వాటికి సంబంధించిన ఆస్తులు ఇస్తామని రాత పూర్వకంగా తెలిపారు. 124 డిగ్రీ కాలేజీలు స్టాఫ్ను మాత్రమే సరెండర్ చేస్తామని, ఆస్తులను తామే ఉంచుకుని ప్రైవేటు కళాశాలలుగా నడుపుకుంటామని తెలిపాయి. మొత్తంగా 93 శాతం డిగ్రీ కాలేజీలు విల్లింగ్నెస్ ఇచ్చాయి. ► 122 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉంటే 5 జూనియర్ కాలేజీలు ఆస్తులతో, 103 కాలేజీలు కేవలం స్టాఫ్ను ఇస్తామని తెలిపాయి. ► 1,988 స్కూళ్లకు గాను 1200 స్కూళ్ల యాజమాన్యాలు స్టాఫ్ను ప్రభుత్వానికి అప్పగిస్తామని రాత పూర్వకంగా తెలిపాయి. 88 స్కూళ్లు ఆస్తులతో పాటు స్టాఫ్ను ఇస్తున్నట్లు ఒప్పుకున్నాయి. ► విశాఖలో సెయింట్పీటర్స్, కాకినాడలో సెయింట్ యాన్స్ స్కూళ్ల యాజమాన్యాలు తాము స్కూళ్లు మూసి వేస్తున్నామని చెప్పాయి. కాబట్టి మీ పిల్లలను వేరే స్కూళ్లలో చేర్పించుకోండని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యం విల్లింగ్నెస్ ఇచ్చినప్పటికీ, తిరిగి విత్డ్రా చేసుకుంటామంటే వారి ఆప్షన్ను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చు. ► రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్ల దుస్థితికి గత టీడీపీ ప్రభుత్వమే కారణం. -
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు 75 శాతం
సాక్షి, అమరావతి: స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్సీ) రెన్యువల్ చేయించుకునే విషయంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరాసక్తంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో 75 శాతం స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. కరోనా పరిస్థితులతో దాదాపు ఏడాదిన్నర తరువాత పాఠశాలలను ఇటీవల పునఃప్రారంభించారు. గత ఏడాది కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడంతో స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించుకునే విషయంపై కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాగా, రెన్యువల్ గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగియనుంది. కానీ ఇప్పటికీ చాలా యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల రెన్యువల్పై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. కరోనా మూడో వేవ్ వస్తుందా, రాదా అనేదానిపై స్పష్టత వచ్చేవరకు ఈ విషయంలో వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. 6,444 బస్సులకు ఎఫ్సీలు రాష్ట్రంలో మొత్తం 25,236 స్కూల్ బస్సులు ఉన్నాయి. కాగా వాటిలో సెప్టెంబర్ 30 నాటికి కేవలం 6,444 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించారు. 18,792 బస్సులకు ఇంతవరకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయలేదు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన స్కూల్ బస్సుల వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. -
కార్పొరేట్ బడులెప్పుడు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గతనెల 16 నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చినా ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు వాటిని పట్టించుకోవడం లేదు. అక్కడక్కడా కొన్ని బడ్జెటరీ స్కూళ్లు, కాలేజీలు తప్ప కార్పొరేట్ సంస్థల్లో తరగతులను నిర్వహించడం లేదు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు పనిచేస్తున్నా ప్రైవేటు సంస్థలు మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం తమ విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు వినిపించి వాటినే తరగతులుగా చూపిస్తున్నాయి. కాలేజీలు, స్కూళ్లను తెరవకున్నా ఒక్కో విద్యార్థి వద్ద రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాయి. సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో 16 వేల వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలుండగా వాటిలో 29,61,689 మంది విద్యార్థులున్నారు. 2,500కు పైగా ఉన్న ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్, సెకండియర్ కలిపి 6 లక్షల మంది వరకు విద్యార్థులున్నారు. 90 శాతానికిపైగా సంస్థల్లో ఆన్లైన్ మంత్రాన్నే జపిస్తున్నారు. చాలా ప్రైవేటు యాజమాన్య పాఠశాలలను తెరవడం లేదు. కొన్నిచోట్ల తెరిచినా కొన్ని తరగతులకే పరిమితం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు ఆమేరకు కూడా స్కూళ్లు తెరవడం లేదు. ఆన్లైన్ పాఠాలంటూ విద్యార్థులనుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని సంస్థల్లో మాత్రం ఆన్లైన్ లైవ్ పాఠాలను ప్రారంభించారు. కొన్ని కాలేజీలు తమ సిబ్బందితో కొన్ని పాఠాలను ముందుగా రికార్డు చేయించి వాటినే విద్యార్థులకు వాట్సప్, ఇతర మార్గాల్లో పంపి చూసి చదువుకోండని చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర పరికరాలున్న వారు పాఠాలను వినగలుగుతున్నా.. శారీరక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది విద్యార్థులు తరగతులు లేక, ఆన్లైన్లో వినే అవకాశాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు చెల్లిస్తేనే టీసీలు కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలు కూడా లేకపోవడంతో పలువురు విద్యార్థులు ఆయా సంస్థల్లో మానేసి వేరే సంస్థల్లో చేరాలనుకున్నా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు ససేమిరా అంటున్నాయి. తమకు పూర్తి ఫీజు చెల్లిస్తేనే టీసీలు ఇస్తామని చెబుతున్నాయి. అసలు స్కూళ్లు లేక, పాఠాలు లేనప్పుడు ఫీజులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాయి. వేతనాలకు ఎగనామం.. ఉద్యోగాలు తీసివేత కరోనా సమయంలో కాలేజీల్లో తరగతుల నిర్వహణ ఆగిపోవడంతో పలు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా ఎగ్గొట్టాయి. వేతనాల గురించి ఒత్తిడి చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇప్పుడు ఆఫ్లైన్ తరగతుల నిర్వహణకు తగిన సిబ్బంది లేకపోవడంతో పలుసంస్థలు స్కూళ్లు తెరవకుండా కాలక్షేపం చేస్తున్నాయి. తొలగించిన సిబ్బందిని తిరిగి పిలిచినా వారు రావడానికి విముఖత చూపుతున్నారు. ఫలితంగా ఆయా సంస్థల్లో నిపుణులైన, అర్హతలు కలిగిన సిబ్బంది లేరు. దీంతో ఎలాంటి సామర్థ్యాలు లేనివారితోనే ఆయా సంస్థలు ఆన్లైన్ అంటూ నెట్టుకొస్తున్నాయి. ఆఫ్లైన్ తరగతులు నిర్వహిస్తే సిబ్బంది జీతభత్యాలతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి. ఆన్లైన్ అయితే పెద్దగా జీతాలు చెల్లించాల్సిన అవసరం, నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో ఎక్కువ సంస్థలు ప్రత్యక్ష తరగతులకు మొగ్గుచూపడం లేదు. ఫీజులు మాత్రం యథాతథంగానే వసూలు చేస్తున్నాయి. విద్యార్థులకు తమ పుస్తకాలు, ఇతర మెటీరియల్ను బలవంతంగా అంటగడుతున్నాయి. కరోనాలో అద్దెభవనాలు ఖాళీచేసిన సంస్థలు ప్రత్యక్ష తరగతులను నిర్వహించడానికి కోవిడ్ ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. తరగతికి 20 మందికి మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. పలు ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తమ విద్యాసంస్థలను అద్దె భవనాల్లో కొనసాగిస్తూ వస్తున్నాయి. కరోనా కారణంగా వాటికి అద్దెలు చెల్లించక ఖాళీ చేశాయి ఇప్పుడు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు మళ్లీ ఆయా భవనాలను తీసుకోవాల్సి ఉంది. గతంలో అద్దె భవనాల్లో లెక్కకు మించి విద్యార్థులు కూర్చోబెట్టేవి. ఇప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించాల్సి రావడంతో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు స్వస్తి చెబుతున్నాయి. ర్యాంకులకోసం పరిమిత సంఖ్యలో విద్యార్థులకు పాఠాలు కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ స్కూళ్లు, కాలేజీల్లో మెరిట్ విద్యార్థుల వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయి. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ర్యాంకుల కోసం మెరిట్ విద్యార్థులను పరిమిత సంఖ్యలో రప్పించి ప్రత్యేక సిబ్బందితో పాఠాలు చెప్పిస్తున్నాయి. కేవలం ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేసుకునే వ్యాపార దృక్పథంతోనే అవి వ్యవహరిస్తున్నాయి. -
ఆదేశాలు కరువు: తెలంగాణ ప్రైవేటు స్కూళ్లలో ఆన్లైనా.. ఆఫ్లైనా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం ప్రత్యక్ష బోధన చేపట్టాలని కచ్చితమైన ఆదేశాలిచ్చిన విద్యాశాఖ, ప్రైవేటు స్కూళ్ల విషయంలో ఈ సాహసం చేయలేకపోతోంది. సెప్టెంబర్ ఒకటి నుంచి అంతా ప్రత్యక్ష తరగతులే ఉంటాయని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించినా, మార్గదర్శకాలేవీ ఇప్పటివరకూ జారీ కాలేదని, అలాంటప్పుడు ప్రైవేటు స్కూళ్లను ఆఫ్లైన్ పెట్టాలని తామెలా కట్టడి చేయగలమని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష విద్యాబోధనపై విద్యామంత్రి సోమవారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కోవిడ్ నిబంధనల అమలుపై జరుగుతున్న కసరత్తు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే స్కూళ్లలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా క్లాసులు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. రోజు విడిచి రోజుగానీ, సెక్షన్లు పెంచిగానీ విద్యాబోధన చేయబోతున్నట్టు మంత్రి దృష్టికి తెచ్చారు. క్లాసురూంలో ఎక్కువమందికి కోవిడ్ నిర్ధారణ అయితే తాత్కాలికంగా స్కూల్ నిర్వహణ ఆపి, పూర్తిస్థాయి పరీక్షల తర్వాతే పునఃప్రారంభించాలని పేర్కొన్నట్టు తెలిసింది. ప్రైవేటు రూటే వేరు.. ప్రైవేటు స్కూళ్ల గురించిన పలు విషయాలను అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రైవేటు స్కూళ్లు ఇప్పటికే సగానికిపైగా సిలబస్ పూర్తిచేశాయని, కార్పొరేట్ స్కూళ్లు చాలావరకూ ఫీజులు వసూలు చేశాయని, దీంతో ప్రత్యక్ష బోధనతోపాటు ఆన్లైన్ విధానం కొనసాగుతుందని అవి చెబుతున్నాయని పేర్కొన్నారు. అయితే ప్రైవేట్లోనూ ఆఫ్లైన్ మాత్రమే ఉండాలన్న కచ్చిత నిబంధన పెడితే బాగుంటుందని అధికారులు మంత్రికి తెలిపినట్టు సమాచారం. దీనిపై మంత్రి స్పందించలేదని తెలిసింది. ఓ వారంపాటు ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్లో బోధన చేసినా పెద్దగా పట్టించుకోవద్దన్న అభిప్రా యం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ స్కూళ్లలో ఆఫ్లైన్ కచ్చితమని చెప్పి, ప్రైవేటు స్కూళ్లకు వెసులుబాటు ఇవ్వడంపై విద్యాశాఖ అధికారులే పెదవి విరుస్తున్నారు. కాలేజీ విద్యార్థులకు వ్యాక్సిన్ ధ్రువీకరణ ఇంటర్, ఆపై తరగతుల విద్యార్థులు టీకా వేయించుకున్నట్టు ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని నిర్ణ యించారు. హాస్టల్ విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేయించి ప్రవేశం కల్పించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే ఉన్నతవిద్యను అభ్యసించే విద్యార్థులకు ఆన్లైన్ బోధన కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. హాజరుశాతం తప్పనిసరి అనే నిబంధన ఉండబోదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి పేర్కొన్నారు. విద్యాసంస్థలు మొదలైన వారం తర్వాతే వాస్తవ పరిస్థితిని అంచనా వేయవచ్చని మంత్రి, విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు, క్లాసు రూంల శుభ్రతపై పారిశుధ్య కార్మికులు విముఖత వ్యక్తం చేస్తున్నారని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. కాగా, కోవిడ్ నిబంధనలకు లోబడి సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లను ప్రారంభించేలా జాగ్రత్తలు తీసుకునే బాధ్యత ప్రధానోపాధ్యాయులదే అని విద్యా శాఖ సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. జిల్లా అధికారులు రోజూ పర్యవేక్షిస్తూ నివేదికలు పంపాలని పేర్కొంది. సామాజిక దూ రం పాటించేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కోరింది. తల్లిదండ్రుల మనోభావాలకే ప్రాధాన్యం : సబిత విద్యాసంస్థల్లో తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సమావేశం వివరాలను ఆమె మీడియాకు వివరిస్తూ, రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనల అమలులో అలసత్వాన్ని ప్రభుత్వం సహించబోదన్నారు. పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్ పూర్తి చేసేందుకు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు విధిగా మాస్కులు ధరించేలా చూడాలన్నారు. విద్యార్థుల్లో ఎవరికైనా జ్వర సూచన ఉంటే ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపళ్లు వెంటనే సమీపంలోని పీహెచ్సీకి తీసుకువెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఒకవేళ కోవిడ్ నిర్ధారణ అయితే విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు సందీప్ సుల్తానియా, దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
వీధి వీధిలో విద్య..
ఆ ఊరి నుంచి ఒక్క విద్యార్థీ ప్రైవేట్ స్కూలుకు వెళ్లరు.. గ్రామంలోని వీధి వీధిలో విద్య అందుబాటులో ఉంటుంది.. వారికి నచ్చిన చోట కూర్చొని చదువుకోవచ్చు.. ఆంగ్లం పదాలు టకాటకా చెప్పగలరు.. గణితం కూడికలు, తీసి వేతలు, ఎక్కాలు చకచకా చదవగలరు.. ఇదీ నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం శిల్గాపురం ప్రత్యేకత. అక్కడి ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం సైదయ్య ఆలోచన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. తిరుమలగిరి (నాగార్జునసాగర్): కరోనా నేపథ్యంలో పాఠశాలలు బంద్ కావడంతో ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా.. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అవి వినే పరిస్థితి అంతంతే. ఆన్లైన్ పాఠాలకు సెల్ఫోన్లు, సిగ్నల్స్, డాటా అందుబాటులో లేక 50 శాతం మంది విద్యార్థుల చదువు సాగడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం శిల్గాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కట్టెబోయిన సైదయ్య ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని వీధుల్లో బ్లాక్బోర్డులు, ఫ్లెక్సీలు, చార్టులపై వర్ణమాల, సరళ పదాలు, ఏబీసీడీలు.., ఒత్తులు, పదాలు, ఎక్కాలు, జంతువులు, ఆంగ్లపదాల్లో జంతువులు, పండ్లు, పక్షుల చిత్రా లను ప్రతి వీధిలో ఏర్పాటు చేశారు. దీనికి పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామస్తుల సహకారం తీసుకున్నారు. ప్రతి వీధికి ఓ ఇన్చార్జ్ని నియమించి విద్యార్థులను చదివించే బాధ్యతను వారికి అప్పగించారు. ఇలా గ్రామంలో 65 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హాజరవుతూ విద్యార్థులు ఎలా చదువుతున్నారు.. ఇన్చార్జీలు వారిని ఎలా పోత్సహిస్తున్నారు అనే అంశాలను పర్యవేక్షిస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రైవేట్ స్కూల్ వాహనాలు బంద్.. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్కు పంపిస్తుండటంతో చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శిల్గాపురం పాఠశాలలో ఐదేళ్ల క్రితమే ఆంగ్ల మాధ్యమ బోధన ప్రారంభించారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఐదేళ్ల నుంచి ఒక్క విద్యారి్థని కూడా ప్రైవేట్ పాఠశాలకు ఆ ఊరి నుంచి పంపిన దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరం ఈ పాఠశాల నుంచే పది మంది విద్యార్థులు గురుకులాల్లో సీట్లు సాధిస్తుండటం విశేషం. -
స్కూళ్లు, కాలేజీల ఫీజుల ఖరారు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సంవత్సర ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ వివరాలతో మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఫీజులు 2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు లాభాపేక్ష లేకుండా సేవాదృక్పథంతో విద్యాసంస్థలను నడపాలని ప్రభుత్వ నిబంధనలున్నా ఫీజులపై స్పష్టమైన ఆదేశాలు లేవు. గతంలో ప్రైవేటు విద్యాసంస్థలపై జీవో నంబరు 1 విడుదల చేసినా దాన్ని పట్టించుకునేవారే లేరు. దీంతో రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల దోపిడీ ఇష్టానుసారం సాగింది. ముఖ్యంగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు భారీగా ఫీజు వసూలు చేశాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు మరింతగా దోపిడీకి దిగాయి. లక్షల్లో ఫీజు వసూలు చేస్తూ తల్లిదండ్రులను పీల్చిపిప్పిచేశాయి. ఈ పరిస్థితిని మార్చడంతోపాటు పాఠశాల విద్యారంగంలో ప్రమాణాలు పెంచేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే హైకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్గా పలువురు విద్యారంగ నిపుణులతో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ గత ఏడాదిలోనే ఫీజులపై నోటిఫికేషన్ జారీచేసినా న్యాయవివాదంతో అమలు కాలేదు. వాటిని పరిష్కరించుకుని ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వానికి కొద్దిరోజుల కిందట సిఫార్సులు అందించింది. వీటి ఆధారంగా ప్రభుత్వం మంగళవారం జీవో 53, 54లను విడుదల చేసింది. పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరాల వారీగా ఫీజులను నిర్ణయించింది. ట్యూషన్, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్సు, కంప్యూటర్ ల్యాబొరేటరీ, లైబ్రరీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, స్టూడెంట్ వెల్ఫేర్, స్టూడెంట్ హెల్త్ కేర్, స్టడీ టూర్ తదితర ఫీజులన్నీ ఇందులో కలిపి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని పేర్కొంది. విద్యార్థుల రవాణా కోసం బస్సులు ఏర్పాటు చేసి ఉంటే రవాణా చార్జీల కింద కిలోమీటరుకు రూ.1.20 చొప్పున వసూలు చేయాలని తెలిపింది. హాస్టళ్ల ఫీజు నిర్దేశించింది. కాలేజీల యజమానులు, తల్లిదండ్రుల హర్షం ఈ చరిత్రాత్మక జీవోలపట్ల ప్రైవేటు కాలేజీల యజమానులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు, ఇతర నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ కబంధహస్తాల్లో నలిగిపోతున్న తల్లిదండ్రులు ఈ జీవోలతో ఊపిరి పీల్చుకోగలుగుతారని, కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాల తరబడి ఇలాంటి ఫీజుల నిర్ణయం కోసం పోరాడుతున్నామని, ఇన్నాళ్లకు ఇది సాకారమైందని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు కనుమర్ల గుండారెడ్డి చెప్పారు. ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫీజులు ఖరారు చేయడం ఆనందదాయకమని రాష్ట్ర ఎయిడెడ్ ఇంటర్ కాలేజీల ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు త్రివిక్రమ్ పేర్కొన్నారు. -
సర్కారీ స్కూల్ 'ఫుల్'.. సీట్ల కోసం తల్లిదండ్రుల క్యూ
సాక్షి, అమరావతి: ‘తల్లిదండ్రులకు విన్నపం.. మా స్కూలులో సీట్లు లేవు. దయచేసి రికమెండేషన్లు చేయించకండి. మేము సామాన్యులం. సహకరించండి.’ ఇది ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఆంధప్రదేశ్లోని అనేక ప్రభుత్వ స్కూళ్లలో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు వెల్లువెత్తుతున్నాయనేందుకు ఇలాంటి ఉదాహరణలు ఎన్నెన్నో. రెండేళ్ల క్రితం వరకు ఉన్న పరిస్థితిని ఇప్పటి పాఠశాలల్లోని పరిస్థితిని గమనిస్తే ఏ అంశంలో చూసుకున్నా పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ చేపట్టిన కార్యక్రమాలు రెండేళ్లలోనే అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. ఒకప్పుడు రాష్టంలో చదువుల లోగిళ్లు కునారిల్లుతున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు ఆనందం వెల్లివిరుస్తోంది. చదువులు భారమై విద్యార్థులు స్కూళ్లకు దూరమైన స్థితి నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చదువుకోవాలన్న ఆరాటం కనిపిస్తోంది. అప్పట్లో డ్రాపవుట్లు.. ఇప్పుడు వెల్లువలా చేరికలు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను క్రమేణా నిర్వీర్యం చేసింది. పలు చోట్ల ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయి. ఉన్న స్కూళ్లలో సరైన వసతులు, సిబ్బంది లేక తల్లిదండ్రులు పిల్లలను ఆ బడులకు పంపడం మానేశారు. అదే సమయంలో స్తోమత ఉన్న వారు ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లలను చదివించుకోగా, ఇతరుల పిల్లలు బడులు మానేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు పరిశీలిస్తే ఈ అంశం స్పష్టంగా తెలుస్తోంది. సీట్లు లేవంటూ స్కూల్ ముందు ఏర్పాటు చేసిన బ్యానర్ పరిస్థితి తారుమారు రాష్ట్రంలో 2018–19లో ప్రభుత్వ స్కూళ్లు 72.11 శాతం ఉండగా, విద్యార్థుల శాతం 52.83 శాతంగా ఉంది. అదే ప్రైవేటు పాఠశాలలు 23.59 శాతమే ఉన్నా, విద్యార్థులు 43.79 శాతంగా ఉన్నారు. 2020–21 విద్యా సంవత్సరానికి విద్యార్థుల శాతం పరిస్థితి తారుమారయ్యింది. ప్రభుత్వ పరిధిలోని 72.28 శాతం స్కూళ్లలో 59.46 శాతం మంది విద్యార్థులుండగా, 23.73 శాతమున్న ప్రయివేటు పాఠశాలల్లో 37.77 శాతానికి చేరికలు పడిపోయాయి. రాష్టంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన 2014–15 విద్యా సంవత్సరంలో 72,32,771 మంది విద్యార్థులు ఉండగా, ఆ మరుసటి ఏడాది ఆ సంఖ్య 69,07,004కు తగ్గిపోయింది. అంటే 3,25,767 మంది విద్యార్థులు పూర్తిగా చదువులు మానేసి డ్రాపవుట్లుగా మారారు. ఆ తర్వాత 2018–19 నుంచి క్రమేణా పెరుగుదల ప్రారంభమై 2020–21 నాటికి రాష్ట్రంలో విద్యార్థుల చేరికలు 73,05,533కు పెరిగాయి. అంటే 2018–19 కన్నా 2,62,462 మంది అదనంగా చేరారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. చంద్రబాబునాయుడు హయాంలో రాష్ట్రం మొత్తమ్మీద విద్యార్థుల చేరికలు తగ్గిపోగా, ప్రభుత్వ స్కూళ్లలో ఆ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రభుత్వ స్కూళ్లను అప్పటి ప్రభుత్వం నిర్వీర్యం చేసి లక్షల్లో పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటులోకి వలస వెళ్లేలా చేసింది. 2014–15లో 41,83,441 మంది విద్యార్థులు ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లలో ఉండగా, 2018–19 నాటికి ఆ సంఖ్య 37,20,988కు పడిపోయింది. ఏకంగా 4.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి మానేశారు. వీరిలో అత్యధికం శాతం మంది ప్రైవేటు స్కూళ్లలో చేరగా, తక్కిన వారు పూర్తిగా చదువులకు దూరమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మళ్లీ మారింది. 2020–21 నాటికి 43,43,844కు పెరిగింది. ప్రభుత్వ స్కూళ్లలో చేరికలకు నాడు–నేడుతో పాటు జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి అనేక కార్యక్రమాలు కారణమయ్యాయి. 2020–21లో ఒక్కసారిగా ప్రయివేటు స్కూళ్లలో చేరికల శాతం 14.10 శాతానికి పడిపోగా, ప్రభుత్వ స్కూళ్లలో ఏకంగా ఈ రెండేళ్లలో 6,22,856 మంది అదనంగా చేరడం విశేషం. ప్రభుత్వ స్కూళ్లలో ఇలా చేరిన వారిలో 60 శాతం మంది నాడు–నేడు కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన స్కూళ్లలో చేరారంటే ప్రభుత్వం చేపడుతున్న విద్యాభివృద్ధి పథకాలు ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయో స్పష్టమవుతోంది. ప్రభుత్వ పథకాలతో సర్కారు బడి వైపు పరుగులు ప్రభుత్వం గత రెండేళ్లలో వివిధ విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పరుగులు పెడుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఛిన్నాభిన్నమవ్వడంతోపాటు ప్రైవేటు చదువులు భారంగా మారిన తరుణంలో వారంతా ప్రభుత్వ స్కూళ్లకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం కింద రూ.16 వేల కోట్లతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో 10 రకాల సదుపాయాలు సమకూరుస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి విడత రూ.3,669 కోట్లతో 15,715 స్కూళ్లను తీర్చిదిద్దారు. ఈ స్కూళ్లలో చేరికలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది మరింత మంది చేరడానికి వస్తుండడంతో వసతి చాలని స్థితి ఏర్పడుతోంది. మరోపక్క ప్రభుత్వం అన్ని స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం, జగనన్న విద్యాకానుక కింద 3 జతల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్కు బుక్కులు, షూ, సాక్సులు, బెల్టు, బ్యాగుతో పాటు ఇంగ్లిష్– తెలుగు నిఘంటువును అందిస్తున్న విషయం తెలిసిందే. జగనన్న గోరుముద్ద కింద రుచి కరమైన, శుభ్రమైన భోజనాన్ని కూడా అందిస్తున్నారు. -
ప్రైవేటుకు గుడ్బై.. సర్కారు బడికి జై
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలకు ప్రవేశాల తాకిడి పెరుగుతోంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో సర్కారు బడుల్లో చేరుతున్నారు. గతంలో పిల్లలు వివిధ కారణాలతో సర్కారు బడులను వదిలిపెట్టి ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు పొందేవారు. కానీ ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలకు గుడ్బై కొట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు సర్కారు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 2,39,449 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. 2021–22 విద్యాసంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రెండు నెలల వ్యవధిలోనే ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలు సర్కారు బడుల్లో చేరడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యాసంస్థలతో కలిపి అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో 27.5 లక్షల విద్యా ర్థుల నమోదు ఉండగా.. ఇప్పటికే దాదాపు 10% విద్యార్థులు అదనంగా అడ్మిషన్లు తీసుకోవడంపై విద్యాశాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా దెబ్బ .. ప్రైవేటు బాదుడు కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నరగా విద్యాసంస్థలు మూతబడి ఉన్నాయి. కొన్ని రోజులు పాక్షికంగా తెరిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులను ప్రభుత్వం అనుమతించలేదు. ఉపాధ్యాయులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఇప్పటివరకు బోధన ప్రక్రియంతా ఆన్లైన్ పద్ధతిలోనే కొనసాగుతోంది. ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇలాగే బోధన జరుగుతున్నా.. ఫీజుల కింద రూ.వేలు డిమాండ్ చేస్తున్నాయి. సకాలంలో చెల్లించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. బోధన కార్యక్రమాలు అంతంతగానే ఉండటం, కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యాసంస్థల వైపే మళ్లుతున్నారు. సర్కారు బడుల్లో సైతం అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండటంతో.. మరో ఆలోచన లేకుండా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఒకటో తరగతికి బాగా గిరాకీ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,39,449 కొత్త అడ్మిషన్లు నమోదు కాగా.. ఇందులో కేవలం ఒకటో తరగతిలోనే 1,25,034 అడ్మిషన్లు జరిగాయి. గత విద్యా సంవత్సరం 12 నెలల కాలంలో ఒకటో తరగతి అడ్మిషన్లు 1,50,071 కాగా.. ఆ సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది రెండు నెలల్లోనే 80 శాతానికి పైగా చేరికలు చోటు చేసుకున్నాయి. ఇక ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు 1,14,415 మంది ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. వీరంతా ఒకటి నుంచి 12వ తరగతి వరకు వివిధ క్లాసుల్లో అడ్మిషన్లు పొందారు. విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలతో పాటు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలలు (మోడల్ స్కూల్స్), పట్టణ ఆశ్రమ పాఠశాలలు (యూఆర్ఎస్)ల్లో కొత్త చేరికలు జరిగాయి. 2019–20 విద్యా సంవత్సరంలో ఒకటినుంచి 12వ తరగతి వరకు 68,813 కొత్త ప్రవేశాలు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు మూడున్నర రెట్లు అడ్మిషన్లు జరగడం గమనార్హం. బడులు పూర్తిగా తెరిస్తే రెట్టింపు ప్రవేశాలకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లపై ఆగస్టు 9న విచారణ
సాక్షి, అమరావతి: ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధనలు చెబుతున్నాయని, ఈ నిబంధనను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఆగస్టు 9న విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 25 శాతం ఉచిత సీట్ల నిబంధనను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిటిషనర్ యోగేష్ స్వయంగా వాదనలు వినిపిస్తూ, చట్ట నిబంధనలు ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు. పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఆగస్టు 9న ఈ వ్యాజ్యంపై విచారణ చేపడుతామని స్పష్టం చేసింది. -
మలాలాపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్
ఇస్లామాబాద్: నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్పై పాకిస్తాన్లోని ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్ విద్యార్థులకు విషం నూరిపోస్తోంది. ఇందుకోసం ఆ సంఘం ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం సోమవారం విద్యా కార్యకర్త మలాలా యూసఫ్జాయ్ను లక్ష్యంగా చేసుకుని యువతలో ఆమె పట్ల వ్యతిరేకత కలగడానికి ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. మతం, పెళ్లి, పశ్చిమ దేశాల అజెండా అమలు విషయంలో ఆమె తీరును దీనిలో ప్రస్తావించారు. కాగా, మలాలా సోమవారం 24వ పుట్టిన రోజు జరుపుకొన్నారు. ఇక సోమవారం పాకిస్థాన్లోని గుల్బెర్గ్లోని కార్యాలయంలో ఆల్ పాకిస్తాన్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. దీని అధ్యక్షుడు కసీఫ్ మిర్జా మాట్లాడుతూ ‘‘ ఐ యామ్ నాట్ మలాలా డాక్యుమెంటరీ చిత్రంలో.. ఆమెకు మతం, పెళ్లిపై ఉన్న వివాదాస్పద అభిప్రాయాలు, పశ్చిమ దేశాల అజెండా అమలు వంటి అంశాలను వెల్లడించారు. యువతలో ఆమె అసలు రూపాన్ని బహిర్గతం చేయడమే మా లక్ష్యం. మహిళల హక్కుల కోసం పోరాడుతుందనుకొని యువత ఆమె పట్ల ఆకర్షితులు కాకుండా చేయడమే మా ఉద్దేశం. మా దేశంలోని 2,00,000 ప్రైవేట్ పాఠశాలల్లోని 20 మిలియన్ల విద్యార్థులకు దీనిని చూపిస్తాం’’ అని పేర్కొన్నారు. మలాలా పెళ్లిని వ్యతిరేకిస్తోంది మలాలా పెళ్లిని వ్యతిరేకిస్తూ సహజీవనాన్ని సమర్థిస్తోందని కసీఫ్ మిర్జా ఆరోపించారు. దేశంలోని వివాహ వ్యవస్థపై ఆమె దాడి చేస్తోందని పేర్కొన్నారు. మలాలా రాసిన ‘ఐ యామ్ మలాలా’ పుస్తకంలోని పలు అంశాలను ఆయన తప్పుపట్టారు. పాక్ పాఠశాలల్లో మతపరమైన విద్యను బోధించడం, అలీ జిన్నా గురించి చెప్పడంపై ఆమె వ్యతిరేకత వ్యక్తం చేశారన్నారు. ఈ పుస్తకాన్ని పశ్చిమ దేశాల అజెండా అమలు కోసం రాసినట్లు ఉందన్నారు. ఇక "మలాలా తండ్రి జియావుద్దీన్ ఒక టీవీ కార్యక్రమంలో తన బ్లాగును బీబీసీ కరస్పాండెంట్ అబ్దుల్ హై కాకర్ రాశారని, 'ఐ యామ్ మలాలా' పుస్తకం క్రిస్టినా లాంబ్ రాసినట్లు ఒప్పుకున్నారు." అని ఆయన అన్నారు. -
అధిక ఫీజలు: ఆ స్కూళ్లపై చర్యలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: అధిక ఫీజలు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై విద్యాశాఖకు అధికారులు నివేదిక సమర్పించారు. జీవో 46కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కూళ్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. పాఠశాలల అనుమతులు రద్దు చేస్తే వచ్చే ఇబ్బందులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మణికొండలోని మౌంట్ లిటేరాజ్ స్కూల్, బంజారాహిల్స్లోని మెరీడియన్ స్కూల్, హిమాయత్నగర్లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, అమీర్పేట్లోని నీరజ్ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్, డీడీ కాలనీలోని నారాయణ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్స్పై అధికారులు నివేదిక ఇచ్చారు. -
తెలంగాణలో ఎన్ని ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రైవేట్ పాఠశాలలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) 2019–20 నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో దేశంలోనే అత్యధికంగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఏకంగా 93,750 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఆ తర్వాత రాజస్తాన్లో 36,056 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 2019–20 లెక్కల ప్రకారం తెలంగాణలో 42,575 పాఠశాలలున్నాయి. అందులో ప్రభుత్వ పాఠశాలలు 30,001 ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు 702 ఉన్నాయి. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ (ప్రభుత్వ గుర్తింపు పొందిన) పాఠశాలలు 11,688 ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో 3,05,597 ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో 1,52,298 మంది ఉండగా, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 4,006 మంది ఉన్నారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 1,48,814 మంది టీచర్లు ఉన్నారు. ఇవిగాక ఇతర స్కూళల్లో 479 మంది ఉన్నారు. కాగా, విద్యార్థులు 8వ తరగతి వరకు బాగానే చదువుతున్నారు. కానీ పేదరికం, ఇతరత్రా కారణాల వల్ల 9, 10 తరగతులు వచ్చే సరికి బడులు మానేస్తున్నారు. తెలంగాణలో ఆ తరగతులకు వచ్చే సరికి బడి మానేస్తున్నవారి రేటు 12.3 శాతం ఉందని నివేదిక తెలిపింది. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు.. ► రాష్ట్రంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 22.7 శాతం ► 42,575 స్కూళ్లకు విద్యుత్ సౌకర్యం ఉంది. ► 95.61 శాతం స్కూళ్లకు తాగునీటి వసతి ఉంది. ► 97.09 స్కూళ్లల్లో బాలికల మరుగుదొడ్లు ఉన్నాయి. ► 92.07 శాతం స్కూళ్లల్లో బాలురకు మరుగుదొడ్లు ఉన్నాయి. ► మొత్తంగా 98.06 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. ► 42,575 పాఠశాలల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ► అలాగే 42,575 స్కూళ్లల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. -
అద్దెల దరువు.. బిల్లుల బరువు
సాక్షి,సిటీబ్యూరో: కరోనా మహమ్మారి ప్రైవేటు పాఠశాలలను కోలుకోలేని దెబ్బతీసింది. యాజమాన్యాలతో పాటు అందులో పనిచేసే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్కువ ఫీజుతో పేద, దిగువ, మధ్య తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు పాఠశాలలను ఇప్పటికే కార్పొరేట్ విద్యా సంస్ధలు నడ్డి విరిచాయి. దీనికితోడు కరోనా పంజా విసరడంతో నష్టాల్లో కూరుకుపోయాయి. తాజాగా లాక్డౌన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. ఆయా పాఠశాలలు కోలుకునే పరిస్థితులు కనిపించడంలేదు. థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై సందిగ్థం నెలకొంది. పునఃప్రారంభంపై నీలినీడలు.. ప్రైవేటు విద్యాసంస్థలకు అద్దె భవనాలు భారంగా మారాయి. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నా.. అద్దె భవనాలను అట్టిపెట్టుకుని ఉండటంతో వాటి నిర్వహణ తడిసిమోòపెడైంది, అద్దెలు, కరెంట్ బిల్లులు, వాచ్మెన్లు, సెక్యూరిటీ సిబ్బంది జీతాలు గుదిబండగా మారాయి. విద్యార్ధుల ఫీజుల వసూళ్లపై నమ్మకం లేక నిర్వాహకులు పాఠశాలలు పునః ప్రారంభానికి సాహసించే పరిస్థితులు కనిపించడంలేదు. నిర్వహణ భారమే.. ప్రై వేటు పాఠశాలల్లో దాదాపు 95 శాతం పైగా అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో పాఠశాలను హైస్కూల్ వరకు నడిపించాలంటే నెలకు కనీసం రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు, ప్రాథమిక పాఠశాల నిర్వహణకు రూ.లక్ష నుంచి 2 లక్షలవరకు ఖర్చువుతుంది. ఇందులో భవనాల అద్దె, కరెంటు, నీటి బిల్లులతోపాటు బస్సుల కిస్తీలు, ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది వేతనాలుంటాయి. ఫీజుల వార్షిక రుసుము తక్కువగా ఉన్నా...ఆవి కూడా వసూలు కాక, అప్పులు, ఇతర ఖర్చులు పెరిగి బడ్జెట్ పాఠశాలలు దివాళా తీశాయి. ఇదీ లెక్క.... రాష్ట్రంలో 10,526 ప్రైవేటు పాఠశాలలుండగా వీటిలో 2,487 కార్పొరేట్, 150 సీబీఎస్సీ, ఐసీఎస్, కేంబ్రిడ్జి సిలబస్తో నడుస్తున్న అంతర్జాతీయ పాఠశాలలు ఉన్నాయి. మిగిలిన 7039 పైగా సాధారణ ప్రైవేటు బడ్జెట్ పాఠశాలలున్నాయి. మొత్తం పాఠశాలల్లో 40 శాతంపైగా పాఠశాలలు హైదరాబాద్ నగరంలోనే ఉండటం గమనార్హం. మూసివేత దిశలో.. బడ్జెట్ పాఠశాలలు మూసివేత దిశవైగా అడుగులు వేస్తున్నాయి. నిర్వహణ భారమై ఆర్థిక ఒత్తిడి భరించలేక కనీసం సగానికి పైగా పాఠశాలల యాజమాన్యాలు స్కూళ్లను మూసివేయాలని భావిస్తున్నారు. ఫీజు వసూళ్లపై దెబ్బ ప్రైవేట్ పాఠశాలకు ఫీజుల వసూళ్లపై దెబ్బపడింది. సాధారణంగా కార్పొరేట్ పాఠశాలల్లో ఒకే విడత, లేదా రెండు విడతల్లో ఫీజులు వసూలు చేస్తుంటారు. కరోన్ ఫస్ట్ వేవ్ వ్యాప్తితో 2019–20 విద్యా సంవత్సరం పాఠశాలల చివరి పనిదినాల్లో మూత పడటంతో 45 శాతంపైగా విద్యార్థుల నుంచి ఫీజు వసూలు కాలేదు. 2020–21 విద్యా సంవత్సరంలో ఆన్లైన్ తరగతులకు పరిమితం కావడంతో ఫీజు వసూళ్లు అంతంత మాత్రంగా తయారైంది. హాజరు తప్పనిసరి చేయాలి కరోనా కష్టకాలంలో ప్రత్యక్ష, పరోక్ష బోధనకైనా విద్యార్థులకు హాజరు తప్పని సరి చేయాలి. ఎకడమిక్ కేలండర్ విడుదల చేయాలి. విద్యార్ధుల ఫీజులపైనే స్కూల్స్ నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం కూడా బడ్జెట్ పాఠశాలలకు విద్యుత్ బిల్లులు తదితర బకాయిలను మాఫీ చేయాలి. –కే. ఉమామహేశ్వర రావు, అధ్యక్షులు, టస్మా,హైదరాబాద్ -
నో ఆన్లైన్.. ఓన్లీ ఆఫ్లైన్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనకు అనుమతిస్తున్నాం. స్కూళ్లకు వచ్చే వారికి ప్రత్యక్ష బోధన ఉంటుంది. బడికి రాని విద్యార్థులకు ఆన్లైన్/ డిజిటల్ పాఠాలు కొనసాగించాల్సిందే. హాజరు నిబంధన లేదు.. పిల్లలను స్కూళ్లకు పంపించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తేవొద్దు...’’అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన తెల్లవారే కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు ఆ నిబంధనలను తుంగలో తొక్కాయి. గురువారం నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తున్నామని, పిల్లలను స్కూళ్లకు పంపించాలని స్పష్టం చేశాయి. ఇక ఆన్లైన్ బోధన ఉండబోదని, పిల్లలను స్కూళ్లకు పంపించాల్సిందేనని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. కరోనా కేసులు పెరుగతున్నాయనే వార్తల నేపథ్యంలో విద్యార్థులంతా ప్రత్యక్ష బోధనకు హాజరు కావాల్సిందేనని కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు సమాచారం ఇవ్వడం పట్ల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లకు వచ్చే వారిలో ఎవరికైనా కరోనా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భౌతికదూరమే అసలు సమస్యైతే... ప్రస్తుతం రాష్ట్రంలో 10,500కు పైగా ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 2 వేల వరకున్న స్కూళ్లలోనే భౌతికదూరం పాటించడం సాధ్యం అయ్యే పరిస్థితి ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లోని మిగతా స్కూళ్లలో ఆరడుగుల భౌతికదూరం పాటించడంలో సమస్యలు తప్పవని అధికారులే పేర్కొంటున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లలో అయితే మరీ ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 9, 10 తరగతులను ప్రారంభించినప్పుడే కోవిడ్ నిబంధనలను తుంగలో తొక్కాయి. బెంచీకి ముగ్గురు, నలుగురు విద్యార్థులను కూర్చోబెట్టి మరీ ప్రత్యక్ష బోధనను చేపట్టాయి. ఆన్లైన్ బోధనను పూర్తిగా తొలగించాయి. ప్రభుత్వం మాత్రం ఆఫ్లైన్తోపాటు ఆన్లైన్ బోధనను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. స్కూళ్లకు పంపించకపోతే నష్టం మీ పిల్లలకేనంటూ తల్లిదండ్రులను భయపెట్టాయి. దీంతో తల్లిదండ్రులు కూడా ప్రత్యక్ష బోధనకు పంపించక తప్పలేదు. దీంతో దాదాపు 6 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు వచ్చారు. ఇపుడు 6, 7, 8 తరగతులకు చెందిన దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు వస్తారు. అంటే ప్రైవేటు స్కూళ్లలోనే బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య 16 లక్షలకు చేరనుంది. 9, 10 తరగతులకే భౌతికదూరం పాటించని ప్రైవేటు స్కూళ్లలో ఇప్పుడు వాటితోపాటు 6, 7, 8 తరగతుల పిల్లలు వస్తే భౌతికదూరం పాటించడం సాధ్యం కాదని అధికారులే ఒప్పుకొంటున్నారు. గదుల్లేక కాదు.. ఖర్చు తగ్గించుకునేందుకు, ఫీజుల వసూళ్లకు.. ప్రైవేటు పాఠశాలల్లో గదుల కొరత సమస్య కానేకాదని అధికారులే చెబుతున్నారు. మెజారిటీ స్కూళ్లలో ఎల్కేజీ మొదలుకొని పదో తరగతి వరకు బోధనను కొనసాగిస్తున్నారు. ఇపుడు స్కూళ్లకు వచ్చే 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులను గదికి 20 మంది చొప్పున విభజించి బోధించడం సమస్య కాదు. అలా విభజిస్తే పాఠాలు బోధించాల్సిన టీచర్లు మూడు రెట్లు అవసరం అవుతారు. ఇపుడు సబ్జెక్టుకు ఒకరు చొప్పున 6–7 మందితో బోధన కొనసాగిస్తున్న ప్రైవేటు యాజమన్యాలు కోవిడ్ నిబంధనల ప్రకారం బోధన చేపట్టాలంటే 21 మంది వరకు టీచర్లతో బోధన చేపట్టాల్సి వస్తుంది. షిఫ్ట్ పద్దతి అమలు చేసినా అదనపు టీచర్లను నియమించాల్సిందే. పైగా ఆన్లైన్ బోధనను కొనసాగిస్తే అదనంగా మరో ఆరేడు మంది టీచర్లను నియమించాల్సి వస్తుంది. అదే బెంచీకి ముగ్గురు, నలుగురు చొప్పున విద్యార్థులను గతంలో మాదిరిగానే కూర్చోబెట్టి బోధన కొనసాగిస్తే ఖర్చు తక్కువ అవుతుందని నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. విద్యార్థులు స్కూళ్లకు వస్తే సంవత్సరం ఫీజులు మొత్తం వసూలు చేసుకోవచ్చనే ఉద్దేశంతో యాజమాన్యాలు ఆన్లైన్ బోధనను కొనసాగించేందుకు ఇష్టపడటం లేదు. నిబంధనల అమలుపై ధ్యాసేదీ? ప్రైవేటు పాఠశాలల్లో భౌతికదూరం పాటించే విషయంలో విద్యాశాఖ ఇప్పటివరకు చేపట్టిన చర్యలు ఏమీ లేవు. కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించినపుడే స్కూళ్లలో గదికి 20 మంది విద్యార్థులకు మించకూడదని, ఒక్కో విద్యార్థి మధ్య కనీసం 6 అడుగుల భౌతికదూరం ఉండేలా చూడాలని, బెంచీకి ఒక్కరినే కూర్చోబెట్టాలని విద్యాశాఖ తమ మార్గదర్శకాల్లో పేర్కొంది. పరీక్షలకు హాజరు కూడా విద్యార్థుల ఇష్టమేనని పేర్కొంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు విద్యార్థులను ఫెయిల్ చేయడానికి వీల్లేదని, నో డిటెన్షన్ పాలసీ అమల్లో ఉందని స్పష్టం చేసింది. అయినా నిబంధనల అమలును మాత్రం పట్టించుకోవడం లేదు. -
'ఇలాంటిదెప్పుడైనా ఊహించారా.. దటీజ్ సీఎం జగన్'
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'పిల్లలు రావట్లేదని అప్పట్లో వందల స్కూళ్లను మూసేయించారు బాబు. మౌలిక వసతులు కల్పించకుండా గాలికొదిలేసి కార్పొరేట్ విద్యాసంస్థల విస్తరణకు చప్పట్లు కొట్టారు. 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారు. ఇలాంటిదెప్పుడైనా ఊహించారా. దటీజ్ సీఎం జగన్' అంటూ ట్వీట్ చేశారు. (చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత) -
ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి కృషి
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ప్రతినిధులు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో మంగళవారం సమావేశమయ్యారు. సజ్జల మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తామన్నారు. కాగా, ఉపాధ్యాయ బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని మంత్రి సురేష్, సజ్జలకు జాక్టో చైర్మన్ కె.జాలిరెడ్డి, వర్కింగ్ చైర్మన్ సీహెచ్.శ్రావణ్ కుమార్, సెక్రటరీ జనరల్ ఎం.శ్రీధర్రెడ్డిలు మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. -
ప్రైవేటు పాఠశాలలకు గట్టి షాక్..
విజయనగరం అర్బన్: ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సర్కారు బడుల్లో చేరాలంటే ఇక టీసీలతో పనిలేదు. సర్కారు ఇచ్చిన తాజా ఉత్తర్వుల మేరకు కేవలం తల్లిదండ్రుల అంగీకార పత్రంతో చేర్చుకునేందుకు మార్గం సుగమమైంది. ప్రైవేటు విద్యాసంస్థలవారు బడిమానేసిన పిల్లలకు టీసీలు ఇవ్వడానికి సుతరామూ అంగీకరించకపోవడంతో సర్కారు బడుల్లో చేరికకు అవరోధంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ సమస్య పరిష్కారమైంది. సర్కారు బడుల్లో కొత్త గా చేరే విద్యార్థులు టీసీలు ఇవ్వలేకపోతే వారి పేర్లు ప్రభుత్వ ఆన్లైన్ చైల్డ్ఇన్ఫోలో చేరే అవకాశం లేదు. ఆ విద్యార్థులు ఇంకా ప్రైవేటు స్కూల్లో ఉన్నట్టే లెక్క. తల్లిదండ్రుల అంగీకార పత్రం చైల్డ్ ఇన్ఫోలో నమోదుకు చెల్లుబాటయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైల్డ్ ఇన్ఫోలో నమోదుకు గడువు పెంపు రేషనలైజేషన్ మార్గదర్శకాలపై ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. 2020 ఫిబ్రవరి 29 నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలనే మార్గదర్శకాలను సవరించి తాజా విద్యా ర్థుల నమోదునే పరిగణించాలని ఉపాధ్యాయులు కోరారు. సమస్యను గుర్తించిన ప్రభుత్వం వచ్చే నెల 2వ తేదీ నాటికి చైల్డ్ ఇన్ఫోలో ఉన్న ప్రవేశాల ఆధారంగా చేయా లని ఆదేశించారు. అయితే ప్రభుత్వ పాఠశాలలపై ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. కానీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు టీసీలు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో వారి పే ర్లు నామమాత్రంగానే ఉన్నాయి. దీనివల్ల చైల్డ్ఇన్ఫో ఆన్లైన్ జాబితాలో ఇంకా ప్రైవే టు స్కూళ్లలో ఉన్నట్లే నమోదు ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తల్లిదండ్రుల అంగీకార పత్రంతో చేరినట్టు ఆన్లైన్ చైల్డ్ఇన్ఫోలో నమోదుకు అవకాశం కల్పిస్తూ వచ్చే నెల 2వ తేదీ వరకు నమోదు గడువు పెంచారు. ఇప్పటికే చేరిన 2.57 లక్షల మంది విద్యార్ధులు జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది పెరుగుతోంది. ఇప్పటికే 2,57,051 మంది ప్రైవేటు స్కూళ్ల నుంచి చేరారు. టీసీలు లేకుండా వచ్చిన వారు మరో 30 వేల మంది వరకు ఉన్నా రు. వారి సంఖ్య ఆన్లైన్లో నమోదు కాలేదు. ఇందులో 1, 6వ తరగతులకు పూర్తి స్థాయిలో కొత్త స్కూళ్ల నుంచి చేరాల్సి ఉంటుంది. మిగిలిన తరగతులకు ముందు తరగతుల నుంచి ప్రమోట్ అవుతారు. ప్రమోట్ అయిన వారే గాకుండా కొత్తగా ప్రైవేటు స్కూళ్ల నుంచి హాజరవుతున్న వారే అధికంగా ఉన్నారని చెబుతున్నారు. ఇంకా పాఠశాలలు తెరవక ముందే 2, 4, 5, 7వ తరగతి లలో గత ఏడాదికంటే సంఖ్య పెరిగింది. తెరిచాక కనీసం మరో 60 వేలకు పెరగవచ్చని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. అంగీకారపత్రం డ్రాప్బాక్స్లో నమోదు చేయాలి జిల్లాలోని ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చే విద్యార్థులను చేర్చుకోవడంలో వచ్చిన సమస్యల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. చైల్డ్ఇన్ఫో నమోదును వచ్చే నెల 2వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సమగ్ర వివరాలను ప్రధానోపాధ్యాయులు తక్షణమే అప్లోడ్ చేయాలి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు టీసీలు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకొని చైల్డ్ఇన్ఫోలోని డ్రాప్ బాక్స్లో ఎంఈఓలు వేయాలి. – జి.నాగమణి, డీఈఓ -
పాఠశాలలకు టీచర్ల హాజరు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరయ్యారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సోమవారం నుంచి 50 శాతం మంది చొప్పున టీచర్లు హాజరు కావచ్చని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కూడా కొన్ని సూచనలు జోడించిన సంగతి తెలిసిందే. ► ఆన్లైన్, దూరదర్శన్ ద్వారా బోధించే పాఠాలలోని సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం స్కూళ్లలోకి 9, 10 తరగతుల విద్యార్థులు, కాలేజీల్లోకి 11, 12 తరగతుల విద్యార్థులను మాత్రమే అనుమతించారు. ► తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకొన్నాకనే స్కూళ్లు, కాలేజీల్లోకి అనుమతించారు. ► ఇదిలా ఉండగా, రాష్ట్రంలో విద్యా వారధి, విద్యామృతం కార్యక్రమాల ద్వారా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా అవకాశం ఉన్న చోట్ల ఆన్లైన్లో బోధనా కార్యక్రమాలు ఇప్పటికే కొనసాగిస్తుండటం, సందేహాల నివృత్తి కోసం స్కూళ్లలో కొంత మంది టీచర్లను అందుబాటులో ఉంచడం తెలిసిందే. -
ప్రైవేట్ విద్యతో పేదలకు పిడుగుపాటే
‘‘సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఒకే ఒక గొప్ప సాధనం విద్య. సమ్మిళిత, సమభావనతో కూడిన విద్య సమసమాజం సాధించడంలో కీలక భూమిక పోషిస్తుంది. ప్రతి పౌరుడు సమాజంలో గౌరవస్థానం పొందడానికి కలలుకంటూ వాటిని సాధించుకోవడానికి నిరంతరం తపనపడుతుంటారు. భారతదేశంలోని ప్రతి బాలుడు, బాలిక తాము అభివృద్ధి చెంద డానికి అవకాశాలు ఉండాలి. వారి పుట్టుక, సామాజిక నేపథ్యం వల్ల వాళ్ళు నిరాదరణకు గురి కావద్దు’’ అని కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టబోతోన్న ‘జాతీయ విద్యా విధానం’ విధాన పత్రంలో పేర్కొన్నారు. కస్తూరి రంగన్ నాయకత్వంలో నియమించిన కమిటీ తన నివేదికను డిసెంబర్ 15, 2018న ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు ఒకటిన్నర ఏడాది తర్వాత 2020, జూలై 19వ తేదీన కేంద్ర మంత్రి మండలి ఈ నివేదికకు ఆమోదం తెలిపింది. దాదాపు 484 పేజీలతో కూడిన ఈ నివేదిక సారాన్ని 66 పేజీలకు కుదించి, కేంద్ర ప్రభుత్వం తన విధానంగా ప్రకటించుకున్నది. అందులో 27 అంశా లను పొందుపరిచారు. పైన పేర్కొన్న వాక్యాలు ఆరవభాగంలోనివి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన జాతీయ విద్యావిధానంపైన ఇప్పటికే చాలా మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కానీ అందరూ విస్మరించిన ఏకైక అంశం ఆరవ భాగం. ఈ మొత్తం విధానంలో ఇదే కీలకమైనదని భావిస్తున్నాను. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత లభిస్తుందా? చారిత్రకంగా విద్య సముపార్జనలో ప్రాతినిధ్యం లేని వర్గాలకు న్యాయం జరగాలని ఆ ఆరవభాగం సారాంశం. దీనికి అనుబంధంగా ఈ విధానంలో 14వ భాగాన్ని కూడా జోడించారు. ఈ వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బృందాలుగా పేర్కొన్నారు. ఇందులో మళ్ళీ కొన్ని విభజనలు చేశారు. ఇందులో లింగ వివక్షను ఎదుర్కొంటోన్న మహిళలు, ట్రాన్స్ జెండర్స్, సామాజికంగా, సాంస్కృతికంగా అణగారిన వర్గాలుగా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, భౌగోళికంగా వివక్షకు గురవుతోన్న గ్రామీణ, చిన్నపట్టణాల, వెనుకబడిన జిల్లాల విద్యార్థులు, దివ్యాంగులు, అంతిమంగా సామాజికంగా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటోన్న వలస కార్మికులు, స్వల్ప ఆదాయ వర్గాలు, ఇలా ఎన్నో వర్గాలను ఇందులో పేర్కొన్నారు. యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యు.డైస్) సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీలలో, దివ్యాంగుల్లో బడిమానేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నదని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు విద్యను ప్రత్యేకించి, నాణ్యమైన విద్యను అందుకోలేకపోతున్నారని కూడా నివేదిక స్వయంగా ప్రకటిం చుకున్నది. ఈ విషయాన్ని ఇంత వివరంగా చెప్పడానికి ఒక కారణం ఉన్నది. జాతీయ విద్యావిధాన పత్రంలో ఉన్న 27 భాగాల అంశాలు సాంకేతికపరమైనవి, పాలనాపరమైనవి, విధానపరమైనవి. అయితే ప్రభుత్వం నామకరణం చేసిన ఎస్.ఇ.డి.జి వర్గాలకు విద్య అందడా నికి ప్రభుత్వాలు నిర్దేశిస్తున్న విద్యను అందించడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలనే దానిపై సమగ్రమైన ప్రణాళిక లేదని స్పష్టమౌతోంది. ప్రత్యేక నిధుల కేటాయింపు అభినందనీయం ఈ విధానపత్రంలోని 14వ భాగంలో ఏవో కొన్ని సూచనలు చేశారు. అందులో ప్రభుత్వం ఎన్.ఇ.డి.జి వర్గాల ఉన్నత విద్యకు అవసరమైన నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని పేర్కొన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో చదివే ఈ వర్గాల విద్యార్థు లకు ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు అందించాలని సూచించారు. వీటితో పాటు మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. సంతోషమే. అటువంటి నిర్ణయం చేయడంలో శ్రద్ధ చూపించినందుకు అభినందించాలి. అయితే వాటిని ఎట్లా అమలు చేస్తారు? అందులో ప్రభుత్వం ఏమేరకు చిత్తశుద్ధితో పనిచేస్తుందనేదీ ప్రశ్నార్థకమే. అయితే ఇప్పటివరకు గత ఆరేళ్ళలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ వర్గాల పట్ల అనుసరిస్తున్న వైఖరికీ, ఇప్పుడు వీరి విద్యా భివృద్ధికి మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రతి సంవత్సరం ఇచ్చే పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు గణనీయంగా క్షీణించడం ఒక ఉదాహరణ మాత్రమే. అయితే ప్రభుత్వం గత అనుభవాలను సమీక్షించుకొని, తన విధానాలలో మార్పులు తీసుకువస్తే, మంచి పరిణామమే అవుతుంది. అణగారిన వర్గాల అభివృద్ధే ప్రగతికి కొలమానం భారతదేశంలో అణగారిన వర్గాల సంఖ్య విస్మరించదగినది కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న ఎస్.ఇ.డి.జి.లు దాదాపు 80 శాతం నుంచి 90 శాతం వరకు ఉంటారు. ఈ దేశంలోని ఏ అభివృద్ధినైనా కొలవాలంటే వీరి ప్రగతిపైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశం విద్యారంగంలో తలెత్తుకొని నిల బడాలంటే, ఈ వర్గాలు ఆత్మగౌరవంతో ఆర్థిక, సామాజిక రంగాల్లో ముందడుగు వేయాలి. అందుకుగాను విద్య ఎంతో ముఖ్యమైన అంశం అవుతుందని జాతీయ విద్యా విధాన పత్రమే స్పష్టం చేసింది. ఈ విషయంలో దక్షిణాదిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు మార్గదర్శకంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్టాలు ఇంకా కొంత నిర్దిష్ట విధానాలను అవలంబిస్తున్నాయి. జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న వర్గాల కోసం, ఈ రాష్ట్రాలు ఒక నమూనాగా నిలుస్తున్నా యనడంలో ఆశ్చర్యం లేదు. రెసిడెన్షియల్ స్కూల్ విధానం ప్రాణాధారం ఈ వర్గాల్లో విద్యావ్యాప్తి వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కనీసం చదువుకొనేందుకు సైతం వారి ఇండ్లు, పరిసరాలు అనువుగా ఉండవనేది ఒక సత్యం. అందుకుగాను ప్రత్యేక హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు కావాలనేది 1927లో బాబాసాహెబ్ అంబేడ్కర్ బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో రెసిడెన్షియల్ స్కూల్ విధానం ప్రారంభమైంది. 2012 సంవ త్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన సబ్ప్లాన్ చట్టం తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు 188, ఎస్టీ 190, బీసీ 104లకు కొత్తగా అనుమతి లభించగా, ఇప్పటికే 84 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణలో ఎస్సీలకు 268, ఎస్టీలకు 183, బీసీలకు 142, మైనారిటీలకు 204 రెసిడెన్షియల్ విద్యా లయాలున్నాయి. తెలంగాణలో డిగ్రీ విద్యార్థులకు 30 రెసిడెన్షియల్ కళాశా లలున్నాయి. కర్ణాటకలో కూడా ఎస్సీలకు 500, ఎస్టీలకు 153, బీసీలకు 165 రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. అయితే తెలంగాణలో మైనారిటీల కోసం నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలు దేశంలోనే తొలి ప్రయత్నం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం, పాఠశాల విద్య కోసం ఎన్నో వినూత్న ప్రయోగాలు మొదలుపెట్టింది. పాఠశాలలు, కళాశా లల్లో మౌలిక వసతుల కోసం పన్నెండు వేలకోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం 3,800 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేశారు. అది పెరిగే అవకాశం కూడా ఉంది. దీనితో పాటు బడికి వెళ్ళే పిల్లల కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 వేల చొప్పున దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని ఎంపిక చేసి ఇస్తున్నారు. దీన్నే అమ్మఒడి పథకంగా పిలుస్తున్నారు. జగనన్న విద్యాకానుక పేరుతో మూడు జతల యూనిఫాం, పుస్తకాలు, నోట్ బుక్స్, ఒక జత బూట్లు, బెల్ట్, బ్యాగ్తో సహా బడికెళ్ళిన రోజే అందిస్తున్నారు. 43 లక్షల మంది పిల్లలు దీని వల్ల లబ్ధిపొందుతున్నారు. 648 కోట్ల రూపాయలు దీనికి కేటా యించారు. గోరుముద్దతో పౌష్టికాహారానికి హామీ మధ్యాహ్న భోజన పథకానికి అదనపు బడ్జెట్ కేటాయించి, మంచి పౌష్టికాహారాన్ని జగనన్న గోరుముద్ద పేరుతో అందిస్తున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపుతుంది. వారికొక భరోసానిస్తుంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే, ప్రభుత్వ పాఠశాలలకు గౌరవం తెచ్చిపెట్టే ఇటు వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలుచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జాతీయ విద్యావిధాన పత్రంలో అత్యంత లోపభూయిష్టంగా ఉన్న విషయం, సమకాలీన, సామాజిక, ఆర్థిక పరిస్థితులను విస్మరించడం. ఈ రోజు డ్రాపౌట్స్ సంఖ్య విపరీతంగా పెరగడానికీ, నైపుణ్యత కలిగిన విద్యను అందుకోలేకపోవడానికి పేదరికమే ప్రధాన కారణం. దేశంలోని ఎస్.ఇ.డి.జి. వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకు రాకుండా ఎటువంటి సంస్కరణలైనా తాత్కాలికమే అన్న విషయం ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా విద్య ప్రైవేటీకరణ విషయంలో సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. దానికి ఫిలాంత్రఫీ అనే ఒక పదాన్ని పదే పదే వాడారు. ప్రైవేట్ విద్యకు ఫిలాంత్రఫిస్టులు (ధర్మదాతలు) చేత ప్రోత్సహించాలని రాసు కున్నారు. ఇప్పటికీ జరుగుతున్నదదే. ప్రైవేట్ విద్యతో సమాజ సేవ బూటకం ప్రతి ప్రైవేట్ పాఠశాల, కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతలందరూ తాము వ్యాపారం కోసం మాత్రమే కాక, సమాజ సేవకోసం విద్యా సంస్థలు నడుపుతున్నామనే చెప్పుకుంటారు. కానీ అసలు నిజం అందరికీ తెలుసు. ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడమంటేనే, ఈ దేశం లోని 90 శాతం మంది ప్రజలను, విద్యార్థులను చీకట్లోకి నెట్టివేయ డమే తప్ప మరొకటి కాదు. లక్షల రూపాయల ఫీజులు కట్టి, చదివే విద్యార్థులతో చెట్లకింద చదివే విద్యార్థులు పోటీపడటం అసాధ్యం. అందుకే ప్రభుత్వాలు మాట్లాడే మాటలను ఆచరణతో పోల్చి చూసు కుంటే నిజా నిజాలు తేటతెల్లం అవుతాయి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ఫీజు వసూలుపై ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ఇష్టారాజ్యం
దిల్సుఖ్నగర్కు చెందిన మాలతి సమీపంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండటంతో ఇంటి వద్ద నుంచే బోధన సాగిస్తోంది. కానీ జూలై 27వ తేదీ వచ్చినా ఈనెల వేతనం తన ఖాతాలో జమ కాలేదు. అంతేకాదు, జూన్ నెలలో ఇవ్వా ల్సిన వేతనం కూడా ఇప్పటికీ అందలేదు. కారణం స్కూల్ యాజమాన్యం తనకు నిర్దేశించిన ఫీజు వసూలు లక్ష్యాన్ని సాధించకపోవడమే. దీంతో రెండు నెలలుగా జీతమే లేదు. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా టీచర్లకుండే లక్ష్యాలు అత్యుత్తమ బోధన, మెరుగైన ఫలితాలు. కానీ ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లలో ఉపాధ్యాయుల లక్ష్యాలు మారిపోయాయి. ఆన్లైన్లో ఎలాగోలా బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీచర్లకు విద్యార్థుల నుంచి నెలవారీ ఫీజు డబ్బులను వసూలు చేయడాన్ని యాజమాన్యాలు లక్ష్యాలుగా నిర్దేశించాయి. దీంతో ఫీజులు వసూలు చేసిన టీచర్లకు సగం వేతనాలు ఇస్తుండగా... వసూలు చేయని వారికి మొండిచేతులు చూపిస్తున్నారు. దాదాపు అన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. రాష్ట్రంలో 20 వేలకు పైగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలున్నాయి. ఇందులో 65 శాతంపైగా స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. రోజుకు రెండు లేదా మూడు సబ్జెక్టుల చొప్పున మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో బోధనా సిబ్బందికి ప్రతిరోజూ తరగతులకు హాజరు కావాల్సిన అవసరం లేదు. వారంలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఆన్లైన్ తరగతుల ద్వారా బోధనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరికి సగం వేతనం చొప్పున ఇవ్వనున్నట్లు యాజమాన్యాలు తొలుత ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఆ మేరకు సైతం చెల్లింపులు చేయడం లేదు. ప్రతి క్లాస్ టీచర్కు ఆ తరగతిలోని విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజును వసూలు చేయాలని నిబంధన పెట్టారు. దీంతో ఆన్లైన్ తరగతి పూర్తయిన తర్వాత ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లాక్డౌన్ అనంతర పరిణామాలతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వ్యాపార రంగం సైతం క్షీణించడంతో ఆదాయం పతనమైంది. ఈ క్రమంలో ఫీజులు చెల్లించలేమని తల్లిదండ్రులు చెబుతున్నప్పటికీ టీచర్లు వారికి ఫోన్లు చేసి కొంత మొత్తమైనా చెల్లించాలని ప్రాధేయపడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు గొడవలకు సైతం దారితీస్తుండడం గమనార్హం. వేతన వెతలు... ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది వేతనాల కోసం అల్లాడుతున్నారు. మార్చి నెల నుంచి లాక్డౌన్ మొదలైంది. దీంతో అప్పట్నుంచి వేతన చెల్లింపులు గందరగోళంగా మారిపోయాయి. ఫీజులు వసూలు కావడం లేదనే సాకుతో యాజమాన్యాలు చేతులెత్తేశాయి. కొన్ని సంస్థలు మాత్రం ఏప్రిల్ నెలలో సగం వేతనంతో సరిపెట్టగా మెజార్టీ విద్యా సంస్థలు బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదు. మే నెలలో 90 శాతం సంస్థలు జీతాలకు మంగళం పాడేశాయి. జూన్, జూలై నుంచి ఆన్లైన్ తరగతులు బోధిస్తున్నప్పటికీ వేతనాలు ఇచ్చేందుకు సంస్థలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ఫీజు వసూళ్ల బాధ్యతలు టీచర్లపైకి నెట్టేశాయి. నిర్దేశించిన లక్ష్యాలు సాధిస్తేనే వేతనాలిస్తామని చెప్పడంతో వేలాది మంది ఉద్యోగులు వేతనాలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
టార్గెట్లు ఎక్కువ.. జీతాలు తక్కువ
అప్పటిదాకా జీతాలు తక్కువైనా వారి జీవితాలు సాఫీగానే సాగేవి. అతికొద్ది జీతంతోనే సరిపెట్టుకొని పొదుపుగా జీవిస్తూ జీవనయానం కొనసాగించేవారు. సంవత్సరమంతా పనిచేసినా వీరికి జీతాలు వచ్చేది కేవలం పది నెలలు మాత్రమే. ఎండాకాలం రెండు నెలలు ఫీజులు వసూలు చేయమనే సాకుతో యాజమాన్యాలు వీరికి విధిస్తున్న కోత ఇది. ఇక అడ్మిషన్లు జరిగే సమయాల్లో వీరి పరిస్థితి వర్ణనాతీతం. వీరే ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేసే అధ్యాపకులు. ఈ ఉపాధ్యాయులకు బిజినెస్ ఏజంట్ల మాదిరిగా టార్గెట్లు ఇస్తారు. ఈ లక్ష్యాలను చేరులేకపోతే జీతం కట్. టూకీగా ఇదీ మనకు ఓనమాలు దిద్దించిన ఉపాధ్యాయుల పరిస్థితి. కుప్పకూలుతున్న జీవితాలు ఇదంతా ఒకఎత్తైతే కరోనా మహామ్మారితో వీరి నెత్తిన మరో పిడుగు పడినట్లైంది. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్న విద్యాసంస్థల యాజమాన్యాలు ఒక్కసారిగా తమ లెక్కలు తిరగబడటంతో మానవత్వాన్ని మరిచారు. మార్చి23న లాక్డౌన్ విధిస్తే ఆ నెలలోనూ ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతం చెల్లించలేదు. కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు సైతం ఇదే విధానాన్ని అవలంభించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా గత నాలుగు నెలలుగా జీతాలు లేక ఇంటి అద్దెలు కట్టలేక ఆపసోపాలు పడుతున్నారు. ఓ ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేస్తున్న అధ్యాపకుడు అరటిపండ్ల తోపుడు బండి పెట్టుకొని జీవనయానం చేస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చూసి కొందరు పూర్వ విద్యార్థులు చలించిపోయారు. తమకు పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయుని గడ్డు పరిస్థితిని తెలుసుకొని విద్యార్థులే డబ్బు సహాయం చేశారు. -
ఆన్లైన్ ‘దందా’
పాఠశాలలు తెరుచుకోలేదు.. తరగతులు నిర్వహించడం లేదు.. కరోనా మహమ్మారి కారణంగా విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా స్పష్టత లేదు. కానీ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యవహరిస్తున్న తీరు కలవెరపెడుతోంది. కరోనా కష్టకాలంలో ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను పీక్కుతింటున్నారు. ఫీజులు చెల్లిస్తేనే ఆన్లైన్ క్లాసులకు లింక్ ఇస్తామని ఊదరగొడుతున్నారు. పొనీలే అని ఫీజులు చెల్లించగానే పుస్తకాలను అంటగడుతున్నారు. వీటితోపాటు ట్యూషన్, యూనిఫాం ఇలా ఇతరత్ర వాటికి కూడా డబ్బులు చెల్లించాలంటున్నారు. విద్యా సంవత్సరంమే ప్రారంభంకాని నేపథ్యంలో ఈ అదనపు వసూళ్లపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 'సాక్షి, కడప ఎడ్యుకేషన్: సాధారణంగా ప్రతి ఏటా విద్యా సంవత్సరం జూన్ నుంచి ప్రారంభం కావాలి. అయితే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల వారు నవంబర్ నుంచే అడ్మిషన్లు ప్రారంభించి ఫిబ్రవరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసుకుంటారు. అదే విధంగా ఈ ఏడాది కూడా చాలా స్కూళ్లలో ఫిబ్రవరికి ముందే అడ్మిషన్లు జరిగిపోయాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 25 శాతంకు పైగా ఫీజులు పెంచారు. ఇంకా మోడల్, ఇంటర్నేషనల్, ఒలంపియడ్ ఇలా పలు రకాల పేర్లతో అదనపు ఫీజులను వసూలు చేస్తున్నారు. వీటితోపాటు బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, పుస్తకాలు, యూనిఫాం ఇలా వివిధ పేర్లతో ఒక జాబితాను తయారు చేసి విద్యార్థుల తల్లితండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ తరగతులకు కూడా అవే ఫీజులు ప్రస్తుతం కరోనా కారణంగా విద్యా సంవతసరం ప్రారంభంకాలేదు. ఎప్పటి నుంచి తరగతులు ప్రారంభవుతాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో కొన్ని పాఠశాలలు ఆన్లైన్, జూమ్ యాప్ ద్వారా తరగతులను నిర్వహిçస్తున్నారు. ఇందుకోసం కూడా ఏటా తీసుకునే విధంగా పీజులతో పాటు బిల్డింగ్ ఫీజు, ట్యూషన్ పీజులను వసూళ్లు చేస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది కేవలం ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలని చెబుతున్నా ఇవేవి మాకు పట్టవన్నట్లు వారు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా.. జిల్లాలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల నిర్వాహకులు ఒకవైపు ఫీజుల దోపిడీ, మరోవైపు పుస్తకాలు దందా సాగిస్తున్నారు. ఫీజుల విషయాన్ని పక్కనపెడితే ప్రభుత్వ సిలబస్ను ప్రామాణికంగా తీసుకోవాలన్ని నిబంధనలను కూడా తుంగలో తొక్కుతున్నారు. ఆయా పాఠశాలలకు సంబంధించిన సొంత సిలబస్ పిల్లలపై దిద్దుతున్నారు. ఫీజుల కోసం తరచూ ఫోన్లు కరోనా ముమ్మరంగా ఉండి బయటకు రాలేని పరిíస్థితుల్లో కూడా మా పాఠశాల యాజమాన్యం ఫీజులు చెల్లించాలని నిత్యం ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు. దీంతోపాటు ఒకొక్కరికి రూ.3 వేలు చెల్లిస్తే మీ పిల్లలను పై తరగతులకు ప్రమోట్ చేయడంతోపాటు ఆన్లైన్ తరగతులకు లింగ్ ఇస్తామన్నారు. డబ్బులు చెల్లించిన తరువాత లింగ్ ఇచ్చి పుస్తకాలు తీసుకెళ్లాలని లింక్ పెట్టారు. చేసేదేమి లేక 7వ తరగతి వాడికి రూ. 7,250, 9వ తరగతి వారికి రూ. 8,650 చెల్లించి పుస్తకాలను తెచ్చుకున్నాం. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. – ప్రసాద్రెడ్డి, పేరెంట్, కడప -
బడుగులకు సర్కారు బడే అండ
సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు చెందిన అత్యధిక శాతం మంది పిల్లలకు ప్రభుత్వ బడులే అండగా నిలుస్తున్నాయి. వీరిలో అత్యధిక శాతం మందివి నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలే కావడంతో తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలోని ఫీజులు చెల్లించే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇప్పటివరకు ఆంగ్ల మాధ్యమం ప్రభుత్వ స్కూళ్లలో లేకపోవడంతో స్థోమత ఉన్న కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. వీరిలో అత్యధికం ఓసీలే. వారితో పాటు కొంతమంది సామాన్యులు కూడా అప్పోసప్పో చేసి తమ పిల్లలనూ ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. అగ్రవర్ణాల్లోని నిరుపేదలూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకే పంపిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019–20లో రాష్ట్రంలోని మొత్తం స్కూలు విద్యార్థుల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లల్లో 56 శాతం, ప్రైవేట్ స్కూళ్లల్లో 44 శాతం మంది చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు దళారులను నియమించి ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా తమ స్కూళ్లలో చేర్పించుకుంటున్నారు. 2020–21 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండడంతో పాటు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక వంటి కార్యక్రమాలు, టీచర్లకు ఆంగ్ల మాధ్యమ బోధనలో శిక్షణనివ్వడం వంటి చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరంలో చేరికలు మరింత పెరుగుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రైవేట్’లో కమీషన్లు..అడ్మిషన్లు ► ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలను, వారి తల్లిదండ్రులను ఆకర్షించడానికి అనేక రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ► కొన్ని స్కూళ్లు దళారీలను నియమించుకుని కమీషన్లు ముట్టచెబుతున్నాయి. ► అంతేకాక.. తమ సంస్థల్లో పనిచేసే బోధనా సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ విద్యార్థులను చేర్పిస్తున్నాయి. ► టార్గెట్లు పూర్తిచేయకపోతే ఉద్యోగం ఉండదని హెచ్చరిస్తున్నాయి. మాకు అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నారు నేను 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూలులో ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. చాలా పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాకు ప్రభుత్వ పాఠశాలే అన్ని విధాలుగా ఆదుకుంటోంది. అమ్మఒడి కింద డబ్బులు అందించడంతో పాటు స్కూలులో పుస్తకాలు, ఇతర పరికరాలు అందిస్తూ మంచిగా చదువులు చెప్పిస్తున్నారు. – రూపేంద్ర నాయక్, 9వ తరగతి, మిట్టపల్లి జడ్పీ హైస్కూల్, ఓడీ చెరువు మండలం ఇ.గొల్లపల్లి గ్రామం, అనంతపురం జిల్లా ఆంగ్లంలోనే మాకు పాఠాలు నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ మాకు ఇంగ్లీషు మీడియంలోనే పాఠాలు చెబుతున్నారు. ప్రైవేటు స్కూలు కన్నా మంచిగా, సులభంగా అర్ధం చేసుకునేలా పాఠాలు చెబుతున్నారు. అమ్మఒడి పథకంతో పాటు పుస్తకాలు, ఇతర వస్తువులు కూడా స్కూలులో ఇస్తున్నారు. చదువు ఒక్కటే కాకుండా ఆటలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి. – సత్యగంగాధర్,కేఏఎన్ మున్సిపల్ హైస్కూల్,సాలూరు, విజయనగరం జిల్లా -
బడిపంతుళ్ల బతుకుపోరు!
కరోనా మహమ్మారితో ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో వారు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. పొట్ట కూటి కోసం కొందరు కులవృత్తి చేస్తుంటే.. మరికొందరు అప్పడాలు తయారీ చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. – ఎలేటి శైలేందర్రెడ్డి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, జగిత్యాల అప్పడాలే ఆసరాగా.. అప్పడాలు చేస్తున్న వీరంతా జగిత్యాలలోని ప్రైవేటు స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయినులు. వీరంతా కలసి అప్పడాల వ్యాపారం మొదలు పెట్టారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తాము, తమ జీవితాన్ని చక్కబెట్టుకునేందుకు ఇలా అప్పడాల వ్యాపారం మొదలుపెట్టినట్లు ప్రైవేట్ టీచర్ శ్వేత తెలిపారు. ఎంబీఏ చదివి కార్పెంటర్గా.. జగిత్యాల జిల్లా కేం ద్రం శివారు అనంతారం గ్రామానికి చెందిన భరత్ ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్. ఎంబీఏ వరకు చదివిన ఆయన పదోతరగతి వరకు సోషల్ సబ్జెక్టు బోధిస్తారు. లాక్డౌన్తో బడులు మూత పడటంతో తనకు తెలిసిన కార్పెంటర్ పనిని నమ్ముకున్నాడు. ఫర్నిచర్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. టైలరింగ్ చేస్తూ.. బీఈడీ చదివిన మంజుల జగిత్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పని చేస్తోంది. కరోనా ప్రభావంతో విద్యాసంస్థలు మూత పడటంతో కుటుంబానికి బాసటగా నిలిచేందుకు టైలరింగ్ పనులు చేస్తుంది. -
ప్రైవేటు పాఠశాలకు కరోనా
సాక్షి, బెంగుళూరు: పాఠశాలల పునరారంభంపై అనుకూల, ప్రతీకూల చర్చ జరుగుతున్న నేపథ్యలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 8మంది ఉపాధ్యాయులకు కరోనా సోకడం కలకలం రేకెత్తిస్తోంది. ధ్వారాడలోని కిల్లా సమీపంలోని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో తరగతులు పునః ప్రారంభంపై ఈనెల 6న సన్నద్ధత సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొత్తం 24 మంది పాల్గొన్నారు. (కొనసాగుతున్న కరోనా విభృంభణ) వీరిలో యాలక్కి శెట్టర్ కాలనీ నివాసీ అయిన ఉపాధ్యాయురాలికి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. సమావేశంలో పాల్గొన్న బోధన, బోధనేతర సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించుకోగా వారిలో ఆరుగురు ఉపాధ్యాయునిలు, ఒక ఉపాధ్యాయుడికి తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇంకా మిగతా వారినివేదిక అందాల్సి ఉందని అధికారులు తెలిపారు. అప్పటి వరకు అందరినీ హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. -
స్కూళ్ల ‘ఆన్లైన్’ మాయ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ ప్రైవేటు, కార్పొరేటు, అంతర్జాతీయ పాఠశాలలు కరోనా కల్లోల సమయంలోనూ ఫీజుల దందాను ఆపట్లేదు. ఉద్యోగాలు పోయి కొందరు, జీతాల కోతలతో మరికొందరు సామాన్యులు లబోదిబోమంటున్నా స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం వసూళ్లకు వెనకడుగు వేయట్లేదు. పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాకముందే ఆన్లైన్ బోధన పేరిట భారీ మొత్తంలో ఫీజులు గుంజేందుకు సిద్ధమయ్యాయి. కరోనా లాక్డౌన్తో గత విద్యా సంవత్సరం పూర్తికాకుండానే స్కూళ్లు మూతపడగా అప్పటి ఫీజు బకాయిలతోపాటు కొత్త ఫీజులపై దృష్టి పెట్టాయి. కొన్ని స్కూళ్లు నేరుగా ఫీజులను పెంచగా, మరికొన్ని స్కూళ్లు ట్యూషన్ ఫీజులో ఇతరత్రా ఫీజులను కలిపేసి ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. స్కూళ్లే ప్రారంభం కాకముందు ఫీజులను ఎలా చెల్లించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు పెంచొద్దన్నా.. రాష్ట్రంలోని 10,547 ప్రైవేటు పాఠశాలల్లో పేరున్న, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు 2,500 వరకు ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లలో చదివే 31 లక్షల మంది విద్యార్థుల్లో ఇలాంటి స్కూళ్లలోనే 40 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. కరోనా వల్ల ప్రజలకు ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో స్కూలు ఫీజులు పెంచడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. పైగా ట్యూషన్ ఫీజును మాత్రమే తీసుకోవాలని, అదీ నెలవారీగానే తీసుకోవాలని తేల్చిచెప్పింది. అందుకు అనుగుణంగా విద్యాశాఖ గత నెలలో జీవో 46ను జారీ చేసింది. అయినా కొన్ని స్కూళ్లు 10 శాతం నుంచి 20 శాతం వరకు ఫీజులను పెంచగా మరికొన్ని స్కూళ్లు దొడ్డిదారిన అధిక ఫీజుల వసూళ్లకు చర్యలు చేపట్టాయి. లైబ్రరీ, ల్యాబ్, స్పోర్ట్స్, కంప్యూటర్ ల్యాబ్, ఐక్యూ జీనియస్, ఫీల్డ్ ట్రిప్ ఫీజులను ట్యూషన్ ఫీజులోనే కలిపేసి ఆ మొత్తాన్ని చెల్లించాలని తల్లిదండ్రులకు హుకుం జారీ చేశాయి. దీనికితోడు పిల్లలకు ఆన్లైన్ తరగతుల కోసం ట్యాబ్, ల్యాప్టాప్లను కొనుగోలు చేసుకోవాలని చెబుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం... ఆన్లైన్ పాఠాలంటూ కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు చేస్తున్న మాయాజాలం తమ పిల్లలకు పెద్దగా ఉపయోగపడట్లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. వారు చెప్పేది అర్థంకాక, అప్పటికప్పుడు ప్రశ్నలు అడిగే పరిస్థితి లేక ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందంటున్నారు. గంటల తరబడి ట్యాబ్లు, ల్యాప్టాప్ల వాడకం వల్ల పిల్లల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉందని, అధిక రేడియేషన్ మెదడు నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆన్లైన్ తరగతులు పిల్లల మానసిక స్థితిపైనా ప్రభావం చూపుతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ పేర్కొంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఎల్కేజీ నుంచి ఐదో తరగతి వరకు ఆన్లైన్ పాఠాలను నిషేధించింది. కానీ రాష్ట్రంలో ఆ దిశగా చర్యల్లేవు. టీచర్లకు జీతాలు ఎగనామం... కార్పొరేట్, ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు భారీగా ఫీజులు గుంజుతున్నా టీచర్ల పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే దాదాపు లక్షన్నర మంది టీచర్లలో దాదాపు 70 వేల మంది ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నారు. వారికి ఏప్రిల్, మే వేతనాలను ఇవ్వని యాజమాన్యాలు ఇప్పుడు పాత, కొత్త ఫీజులు వసూలు చేయాలని వారికి టార్గెట్లు పెట్టాయి. తల్లిదండ్రులు ఫీజులు చెల్లించేలా ఒప్పించే వారికి సగం వేతనాలను ఇస్తామని చెబుతున్నాయి. దీంతో టీచర్లు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ఫీజులు చెల్లించాలంటూ బతిమిలాడుకుంటున్నారు. సాధారణ స్కూళ్లపై ప్రభావం.. కార్పొరేట్ స్కూళ్ల ఆన్లైన్ మాయాజాలం ప్రభావం సాధారణ ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లపై తీవ్రంగా పడే ప్రమాదం నెలకొంది. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, ఆన్లైన్ తరగతులంటూ ముందుకొచ్చిన కార్పొరేట్ స్కూళ్లవైపు తల్లిదండ్రులు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల సాధారణ ప్రైవేటు స్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లకు నష్టం జరగొచ్చు. అందుకే వాటిని కట్టడి చేయాలి. – యాదగిరి శేఖర్రావు, తెలంగాణ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు -
ముఖ్యమంత్రి సారూ.. స్పందించరూ..
లక్డీకాపూల్: తమను ఆదుకోవాలని కోరుతూ ప్రైవేట్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆకలి దీక్ష తలపెట్టారు. ప్రైవేటు యాజమాన్యాలు జీతాలు చెల్లించలేకపోతున్న కరోనా కష్ట కాలంలో ప్రభుత్వమే ఆదుకోవాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం డిమాండ్ చేస్తున్నది. ఫోరం పిలుపు మేరకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ తమ ప్రాంతాల్లోనే ఆదివారం ఆకలి దీక్షలో పాల్గొన్నట్టు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి పి.పట్టాభిరెడ్డి తెలిపారు. మూడు మాసాలుగా లెక్చరర్లకు జీతాలు లేవు, వచ్చే ఆగస్టు వరకు కూడా జీతాలు చెల్లించడం కుదరదని యాజమాన్యాలు తెగేసి చెపుతున్నాయని ఆవేదన చెందారు. తమ శ్రమ, నిబద్ధతతో వందల, వేల కోట్లు కూడబెట్టుకున్న ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తమ ధీనావస్థను గుర్తించడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఊసే ఎత్తడం లేదన్నారు. ఈ దయనీయ స్థితిని పాలకుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ ఆకలి దీక్షను తలపెట్టామన్నారు. ఇకనైనా తమ ఆవేదనను పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా స్పందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. -
లాక్డౌన్లో ఆన్లైన్ బోధన!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో వచ్చే జూన్లో పాఠశాలలు ప్రారంభించడం అసాధ్యమని, అలాగని విద్యార్థులను ఖాళీగా ఉంచడం సరికాదని రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాలు పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యే ఉత్తమమైన ప్రత్యామ్నాయ మార్గమని అంటున్నాయి. అందుకే కొత్త విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్లైన్ విద్యను తప్పనిసరి చేయాలని, తద్వారా జూన్లో అకడమిక్ ఇయర్ను ప్రారంభించవచ్చని వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) మంత్రి రమేశ్ పోఖ్రియాల్కు ఓ నివేదికను అందజేశాయి. మరోవైపు లాక్డౌన్ తర్వాత భౌతిక దూరం పాటించేలా షిఫ్ట్ పద్ధతిలో పాఠశాలలను నిర్వహించడం మేలని కేంద్ర మంత్రి వివరించినట్లు ఓ ప్రైవేటు విద్యా సంస్థ చైర్మన్ వెల్లడించారు. ఆ నివేదికలోని ప్రధానాంశాలు.. (చదవండి: వైరస్పై యుద్ధం.. ఇలా చేద్దాం) ఆన్లైన్ విద్యా బోధనతో ప్రయోజనాలు.. సాంకేతిక పరిజ్ఞానంపై కొంత అవగాహన కలిగిన వారు దీనిని అనుసరించడం సులభం. వినే అలవాటు ఎక్కువగా ఉన్న వారికి దీంతో ఉపయోగకరమే. టెక్నాలజీ ఫీచర్స్, యూట్యూబ్, పీపీటీ, ఆన్లైన్ బోధన, డిజిటల్ పాఠాలు, రికార్డ్ చేసిన టెలివిజన్, రేడియో పాఠాలను అందించవచ్చు. ఆన్లైన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు అడగటం, సందేహాలను నివృత్తి చేయడం, పాఠ్యాంశాన్ని వివరించవచ్చు. అభ్యాసం, వర్క్షీట్లు, ప్రాజెక్ట్స్, హోంవర్క్ ఇవ్వొచ్చు. టెక్నాలజీ ద్వారా మొత్తం ప్రక్రియను వర్చువల్ క్లాస్రూమ్గా మార్చవచ్చు. ప్రతికూలతలేంటంటే.. టీచర్, విద్యార్థి మధ్య భావోద్వేగ, వ్యక్తిగత అనుసంధానం పోతుంది. అభ్యసన ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ సమస్యలు, ఇంటర్నెట్ సమస్యలు ఇబ్బందికరంగా మారవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించినా ఇంటరాక్షన్ కొంత ఇబ్బందికరం కావచ్చు. అయినా అనుమతించాలి. ఆన్లైన్ విద్యలో కొన్ని ప్రతికూలతలున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ బోధనకు సిద్ధంగా ఉన్న పాఠశాలలను జూన్ నుంచి తరగతులను నిర్వహించేందుకు అనుమతించాలి. ఇప్పటికే జాతీయ ఉపాధ్యాయ విద్యా శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ), రాష్ట్ర ఉపాధ్యాయ విద్యా శిక్షణ మండలి (ఎస్జీఈఆర్టీ) ఆన్లైన్ కంటెంట్ను, డిజిటల్ పాఠాలను రూపొందించాయి. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు స్కూళ్లు వీటిని ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఇందుకు ప్రభుత్వం రంగంలో డీడీ జ్ఞాన్, డీడీ నేషనల్, డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి, టీ–శాట్ వంటి టెలివిజన్ చానెళ్లు ఉన్నాయి. అయితే టీచర్లు ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాదు స్వచ్ఛందంగానే బోధించడం, నేర్చుకోవడం ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే టీవీ చానెల్స్, లోకల్ కేబుల్ టీవీ చానెల్స్, మొబైల్స్, టాబ్స్ ద్వారా బోధన అందించవచ్చు. అలాగే పట్టణ ప్రాంతాల్లో మొబైల్స్, ట్యాబ్స్తోపాటు వర్చువల్ క్లాస్రూమ్స్, గూగుల్ మీట్, క్లాస్రూమ్, మైక్రోసాఫ్ట్ టీం, స్కైప్ వంటి యాప్ల ద్వారా, కంప్యూటర్, డెస్క్టాప్ ద్వారా కూడా బోధన నిర్వహించవచ్చు. ఆన్లైన్ బోధన కోసం ప్రత్యేక కార్యాచరణ అవసరం.. సాంకేతిక వినియోగం, ఆన్లైన్లో పాఠాల బోధనపై టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. ఆన్లైన్లో బోధనకు అవసరమైన పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేయాలి. డెమో సెషన్స్ నిర్వహించాలి. ఆన్లైన్ పాఠాలు, డిజిటల్ పాఠాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. వర్క్షీట్స్, అసెస్మెంట్ టూల్స్ సిద్ధం చేయాలి. ఆన్లైన్లో హోంవర్క్ ఇవ్వడం, వాటిని ఆన్లైన్లో పరిశీలించాలి. టీచర్లు, పిల్లలు, తల్లిదండ్రుల నుంచి రోజువారీగా అభిప్రాయాన్ని తీసుకోవాలి. వీటిన్నింటిపై కనీసంగా జూలై 31వ వరకు సిద్ధం కావాలి. లాక్డౌన్ ఎత్తేశాక 50 శాతం పిల్లలతోనే.. లాక్డౌన్ ఎత్తేశాక భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. 50 శాతం పిల్లలతోనే పాఠశాలలను కొనసాగించాలి. అధ్యాపకులను కూడా అలాగే విభజించాలి. కరోనా విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్లు ధరించడం, శానిటైజర్తో తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు చేపట్టాలి. 50 ఎస్ఎఫ్టీ కలిగిన ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా చూడాలి. విద్యార్థులను రెండు సెక్షన్లుగా విభజించాలి. తరగతుల విభజన చేసి రెండు షిప్ట్లలో పాఠశాలను కొనసాగించాలి. ఈ క్రమంలో కొన్ని సమస్యలున్నా క్రమంగా వాటిని అధిగమించవచ్చు. లేదంటే మూడ్రోజులు తరగతి గదిలో బోధన, మూడ్రోజులు ఆన్లైన్ బోధన చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. చేపట్టాల్సిన భద్రతా చర్యలు.. పాఠశాలల్లో, రవాణా సమయంలో భౌతిక దూరం పాటించేలా చూడాలి. ప్రతి రెండు గంటలకోసారి పాఠశాల తరగతి గదులు, వాష్రూమ్లు, కారిడార్లు, ల్యాబ్లు, లైబ్రరీ, తలుపులు, కిటికీలను కెమికల్స్తో శానిటైజ్ చేయాలి. మాస్క్లు ధరించడం, చేతులకు గ్లౌజులు వేసుకోవడం, హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. మొబైల్ వైద్య సేవలను అందించాలి. తీవ్రమైన దగ్గు, తుమ్ములు లేదా జ్వరం వచ్చినప్పుడు తక్షణ పరీక్షల కోసం ఏర్పాట్లు చేయాలి. విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం అందించాలి. పాఠశాలల్లో కోవిడ్ సూపర్వైజర్ను నియమించాలి. సర్టిఫైడ్ కౌన్సెలర్లను నియమించాలి. (చదవండి: స్వల్ప లక్షణాలుంటే హోం ఐసోలేషన్) -
లాక్డౌన్లో ఫీ‘జులుం’!
సాక్షి, హైదరాబాద్ : ఓవైపు లాక్డౌన్.. మరోవైపు పనుల్లేక ఖాళీ.. ఇంట్లో నిత్యావసర సరుకుల కొనుగోలుకే కష్టకాలం. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. పైసా అప్పు పుట్టని ఈ పరిస్థితుల్లోనూ ఫీజులు అడుగుతుండటంతో పాఠశాలల యాజమాన్యాలపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆన్లైన్లో ఫీజులను చెల్లించాలంటూ పట్టణ ప్రాంతాల్లోని యాజమాన్యాలు మెసేజ్లు పంపిస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా అసలే ఇబ్బందులు పడుతుంటే స్కూల్ యాజమాన్యాల తీరు ఆగ్రహం తెప్పిస్తోందని అంటున్నారు. ఫీజు వసూలే టార్గెట్ రాష్ట్రంలో 10,546 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అందులో కార్పొరేట్ స్కూళ్లు 800 వరకు ఉండగా మిగతా వాటిలో మరో 3వేల వరకు కాస్త పేరున్నవి. మిగతావి సాధారణ పాఠశాలలు. లాక్డౌన్ నేపథ్యంలో ఒకటి నుంచి 9వ తరగతి వరకు మార్కులతో నిమిత్తం లేకుండా విద్యార్థుల్ని పై తరగతులకు ప్రమోట్చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే పూర్తయినట్టే. అయితే, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫీజులు మామూలుగా వార్షిక పరీక్షల సమయంలో చెల్లిస్తుంటారని, సరిగ్గా పరీక్షలకు ముందే లాక్డౌన్ ప్రకటించడంతో అవి వసూలుకాక ఇబ్బంది పడుతున్నామని ప్రైవేట్ విద్యాసంస్థలు అంటున్నాయి. ఫీజుల వసూలుతో నిమిత్తం లేకుండా టీచర్లకు వేతనాలిస్తున్నామని, ఇప్పుడు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని ఓ స్కూల్ కరస్పాండెంట్ చెప్పారు. కాగా, ఆయా తరగతులకు చెందిన క్లాస్ టీచర్లతో తల్లిదండ్రులకు స్కూలు యాజమాన్యాలు ఫోన్లు చేయిస్తూ, ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి తండ్రికి టీచర్ ఫోన్ చేయించడంతో అసలే పనుల్లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఫీజులు అడుగుతారా? అని ఆయన కొంత ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాగా, తరగతుల వారీగా ఫీజు పూర్తిగా చెల్లించని విద్యార్థులు వివరాలను టీచర్లకు అప్పగించి యాజమాన్యాలు టార్గెట్లను విధిస్తున్నాయి. ఫీజులు చెల్లించేలా చూస్తేనే పూర్తి వేతనం చెల్లిస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో టీచర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొన్ని యాజమాన్యాలైతే ఆన్లైన్లో ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులకు మెస్సేజ్లు పంపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం ప్రైవేట్ పాఠశాలలు- 10,546 కార్పొరేట్, కాస్త పేరున్న స్కూళ్లు- 3,800 లాక్డౌన్లో అడ్మిషన్ల ప్రచార గోల అత్యవసర సేవలు తప్ప అన్ని రంగాలను ప్రభుత్వం మూసివేసినా కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయంటూ ప్రచారానికి దిగాయి. తమ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని, తమ వద్ద చదివితే ర్యాంకులు వస్తాయని ప్రచారం చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు, ప్రచార వ్యవహారాలపై తల్లిదండ్రుల సంఘాలు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం చివరి టర్మ్ ఫీజు చెల్లింపును రద్దు చేసిందని, రాష్ట్రంలోనూ అటువంటి చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్చంద్రన్కు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ప్రమాదకర యాప్లతో ఆన్లైన్ పాఠాలు ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లతోపాటు కాస్త పేరున్న స్కూళ్లు ఇప్పుడు ఆన్లైన్ తరగతులు కొనసాగిస్తున్నాయి. ఇంట్లో సరదాగా గడుపుతున్న 5వ తరగతి విద్యార్థులను కూడా ఆన్లైన్ పాఠాల పేరుతో కూర్చోబెడుతున్నాయి. ఇంట్లో ఉండి పాఠం విన్నా స్కూల్ యూనిఫాం ధరించాలని, విద్యార్థులు చదువుకునేటప్పుడు వీడియోతీసి పంపించాలని మెున్నటివరకు నిబంధనలు విధించాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆన్లైన్ పాఠాల నెపంతో ఫీజుల వసూలుపై పడ్డాయి. అవసరం లేకున్నా ఆన్లైన్ పాఠాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సెక్యూరిటీపరంగా శ్రేయస్కరం కాని జూమ్ వంటి యాప్లను వినియోగించవద్దని కేంద్రం చెబుతున్నా అలాంటి యాప్లతో తరగతులను కొనసాగిస్తున్నాయి. వాట్సాప్లలో వర్క్షీట్స్ పంపించడం, ప్రశ్నలు ఇవ్వడం వంటి చర్యలతో తరగతులను కొనసాగిస్తున్న పాఠశాలలు జూమ్ ద్వారా తరగతుల వారీగా గ్రూప్లను ఏర్పాటుచేసి పాఠాలను బోధిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలవే ఫీజు ఆగడాలు ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజా శ్రేయస్సును పక్కనపెట్టి కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలే వ్యాపారాభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాయి. ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. అలాంటి వ్యాపార సంస్థలను, వారి ఆగడాలను ఖండించాల్సిందే.–ప్రైవేటు యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు -
ప్రైవేటు టీచర్ల మెడపై అడ్మిషన్ల కత్తి
ఫెర్టిలైజర్సిటీ (రామగుండం): పెద్దపెల్లి జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. 2020–2021 విద్యా సంవత్సరానికి ప్రవేశాల టార్గెట్ విధిస్తున్నాయి. పిల్లలను చేర్పిస్తేనే కొలువు ఉంటుందని లేకుంటే భద్రత భరోసా ఇవ్వమని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. దీంతో తమ కొలువులు ఉంటాయో, ఊడుతాయో తెలియని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి అడ్మిషన్లకోసం తల్లిదండ్రులను ప్రాధేయపడుతున్నారు. బోధనతోపాటు అదనపు తరగతులు, శనివారం, ఆదివారం సెలవు వచ్చిందంటే పాఠశాల అడ్మిషన్లుకోసం యాజమాన్యాలు వేధించడంతో కొందరు మానసికంగా శారీరకంగా తమ జీవితం నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా ఇంటింటికి తిరుగుతూ అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 1950 మంది ప్రైవేటు టీచర్లు జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో సుమారు 190 ఉన్నాయి. వీటిలో దాదాపు 1950 మంది డిగ్రీ , బీఎడ్, డీఎడ్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు రాక గత్యంతరం లేక కుటుంబ పోషణకోసం ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్నారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు రెండునెలల ముందుగానే పాఠశాలకు పిలిపించి అడ్మిషన్ల టార్గెట్ విధించారు. వేసవిసెలవుల్లో కూడా అడ్మిషన్లు చేస్తేనే వచ్చే విద్యా సంవత్సరం పని చేస్తారని లేదంటే వేరే పని చూసుకోవచ్చని స్పష్టం చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతున్నారు. తమ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను వేడుకుంటున్నారు ఇప్పటికే సంవత్సరంలో పదినెలల జీతం మాత్రమే చెల్లిస్తున్న యాజమాన్యాలు పని మాత్రం 12 నెలలు చేయించుకుంటున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల టీచర్ల తెల్లారేసరికి క్యాంపెయినింగ్ పేరుతో రోడ్డు ఎక్కుతున్నారు. పాఠశాలలోని సౌకర్యాలు, మీ పిల్లలను చేర్పిస్తే ఉజ్వల భవిష్యత్ అందిస్తామంటూ తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడ్మిషన్లు చేయకపోతే కాస్తోకూస్తో వచ్చే జీతం ఈ ఉద్యోగం ఊడిపోతుందని భయంతో ఉపాధ్యాయులు మార్కెటింగ్ ఏజెంట్ అవతారమెత్తి కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చాలీచాలని జీతాలు ప్రైవేట్ పాఠశాలలో పని చేసే టీచర్లకి యాజమాన్యాలు ఇచ్చే వేతనం అరకొర మాత్రమే. ప్రాథమికస్థాయి విద్యాబోధనకు 3వేల నుంచి 5 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. హైస్కూల్ అనుభవం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు 5 వేల నుంచి 10 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. ప్రభుత్వం జీవో ప్రకారం విద్యార్థుల ఫీజు నుంచి వసూలు చేసిన వాటిలో 59శాతం టీచర్ల వేతనాలకు ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఎక్కడా అమలు చేయడం లేదు. జీవో విడుదల చేసిన ఫలితం లేకుండా పోయింది. కష్టపడి పాఠాలు బోధించి విద్యార్థులకు ర్యాంకులు సాధించే పాఠశాలకు మంచి పేరు తెచ్చిపెడుతున్న టీచర్లకు సరైన వేతనాలు ఇవ్వకుండా వారి కష్టాన్ని దోచుకొని యాజమాన్యాలు తమ జేబులు నింపుకుంటున్నాయనే అనే ఆరోపణలు ఉన్నాయి. టార్గెట్ పూర్తి అయితేనే ఉద్యోగం ఇచ్చిన అడ్మిషన్ పూర్తి చేస్తేనే రెండు నెలల వేసవి సెలవుల్లో జీతం ఇస్తామని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు విధిస్తున్నాయి. ఒక ఉపాధ్యాయుడు 10 నుంచి పదిహేను మంది పిల్లలను ఖచ్చితంగా పాఠశాలలో చేర్చాలని నిబంధనలు విధించారు. -
అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల్లో తనిఖీలు
-
ఏపీ : ప్రైవేట్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా 130 పాఠశాలలను అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకున్నారు. ఈ తనిఖీల్లో పాఠశాలల్లో వసూలు చేసే ఫీజుల వివరాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, బోధించే వారి అర్హతలు, పాఠశాల భవనాలు తదితరాలను పరిశీలించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 24 పాఠశాలలలో తనిఖీలు చేపట్టి.. మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతపురం జిల్లాలోని ఏపీ పాఠశాల విద్య కమిషన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పలు ప్రైవేట్, కొర్పొరేట్ పాఠశాలలకు వెళ్లి మౌలిక సదుపాయాలు, ఫీజు వివరాలపై అధికారులు ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ పాఠశాల విద్యా కమిషన్ సభ్యులు ఆలూరు సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా 130 పాఠశాలలలో తనిఖీలు చేపట్టామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటిసారి నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామని, పదేపదే చేస్తే లైసెన్స్లను రద్దు చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిబంధనలను మరింత పకడ్బంధీగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో వెట్టి చాకిరి సహించేది లేదని స్పష్టం చేశారు. తిరుపతి, ప్రకాశం, ఒంగోలు, టంగుటూరు, దర్శి, చీరాలలోని పలు ప్రైవేట్ పాఠశాలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. -
టెన్త్ విద్యార్థులకు వయసు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులకు తెలియకో, టీచర్ల అలసత్వమో.. నిర్ధేశిత వయసు రాకముందే బడిలో చేర్పించే ఆతృత వల్లనో... వెరసి పదో తరగతి పరీక్షల సమయం వచ్చేసరికి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పడం లేదు. టెన్త్ పరీక్షలకు హాజరయ్యేందుకు అవసరమైన నిర్ధేశిత వయసు లేకపోవడంతో వారిని పరీక్షలకు అనుమతించలేని పరిస్థితి వస్తోంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ప్రధానోపాధ్యాయులు, డీఈవో కార్యాలయాలు, ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్సెస్సీ బోర్డు) చుట్టూ తిరిగి అనుమతులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఏటా ఇలాంటి వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. ఈసారి మాత్రం ఆ సంఖ్య 1,394 ఉన్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. వారందరికి అనుమతులు లభించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వేయి మందికిపైగా 6రోజులు తక్కువున్న వారే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2019 ఆగస్టు 30వ తేదీ నాటికి 14 ఏళ్లు పూర్తయితేనే ఆ విద్యార్థి 2020 మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు అర్హులు. ఆ నిబంధనల ప్రకారం వయసు తక్కువ ఉన్న పిల్లలు రాష్ట్రంలో 1,394 మంది ఉన్నారు. వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏడాదిన్నర వరకు ప్రధానోపాధ్యాయుడు, రెండేళ్లు తక్కువగా ఉంటే ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అనుమతి పొందాల్సి ఉంటుంది. అదే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఏడాదిన్నర తక్కువగా ఉంటే డీఈవో, రెండేళ్లు తక్కువగా ఉంటే ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ నుంచి అనుమతి పొందాలి. రెండేళ్లకంటే ఎక్కువ మినహాయింపు పొందాలంటే విద్యాశాఖ కార్యదర్శి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఇలా ప్రత్యేక అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికంగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. అందులోనూ గరిష్టంగా 24 రోజులు మాత్రమే తక్కువ ఉన్న వారు ఉన్నారు. అందులో 1 నుంచి 6 రోజులు తక్కువ ఉన్న వారు 1000 మందికిపైగా ఉండగా, మిగతా వారు 7 నుంచి 27 రోజులు తక్కువ ఉన్నవారు ఉన్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం లెక్కలు వేసింది. వారందరిని కూడా పరీక్షలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. -
అధిక ఫీజులపై కట్టడి
సాక్షి, అమరావతి: ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేయకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యాశాఖ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో పరిస్థితులపై చర్చ జరిగింది. ప్రైవేట్ విద్యాసంస్థలు చాలా చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదన్నారు. బహుళ అంతస్థుల భవనాల్లో గాలి వెలుతురు కూడా లేని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నాయని, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తితే రక్షించేందుకు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి విద్యా సంస్థలపై ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి వలసలు మొదలు.. తల్లిదండ్రుల భాగస్వామ్యం ద్వారానే ప్రభుత్వ పాఠశాలల్లో పెనుమార్పులు సాధ్యమని, ఆ దిశగా ఇటీవల పలు నిర్ణయాలు తీసుకున్నామని సీఎం జగన్ చెప్పారు. మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం ద్వారా స్కూళ్ల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న తల్లిదండ్రుల పేర్లను స్కూళ్లలో నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. విరాళాలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ప్రభుత్వం పిలుపునిచ్చిన రూ.1,000 కంటే ఎక్కువగా ఇస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల వలస ప్రారంభమైందన్నారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ అమల్లోకి తెచ్చాక విద్యార్థులు ఆహార పదార్ధాలను చాలా ఇష్టంగా తింటున్నారని చెప్పారు. ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యాన్ని దశలవారీగా అందుబాటులోకి తెస్తున్నందున మధ్యాహ్న భోజనం మరింత నాణ్యంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాణ్యతగా నాడు–నేడు ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను సమూలంగా మార్చే ‘మనబడి నాడు–నేడు’ అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. నాడు–నేడు పనుల్లో ఎక్కడా నాణ్యత తగ్గరాదని స్పష్టం చేశారు. తొలి విడత నాడు–నేడు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రెండు, మూడు విడతల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు మే నెల మధ్యలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, అనంతరం పనులు ప్రారంభిస్తామని అధికారులు వివరించారు. సీఎం సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల చైర్మన్లు జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ కాంతారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాడు–నేడు తొలివిడత పనులు ఇలా... పాఠశాలల సంఖ్య 15,715 - (8,853 ప్రైమరీ స్కూళ్లు, 3,068 అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 2,457 హైస్కూళ్లు, 1,337 రెసిడెన్షియల్ స్కూళ్లలో తొలివిడత పనులు ఆరంభం) - రూ. 3,373 కోట్లతో ప్రతిపాదనలు పూర్తి - 14,843 స్కూళ్లకు పరిపాలనా అనుమతులు - 14,591 స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీలతో అవగాహనా ఒప్పందం - 12,647 స్కూళ్లలో పనులకు భూమి పూజ - బ్యాంకు ఖాతాలు తెరిచిన విద్యా కమిటీలు 14,851 రెండో విడత నాడు–నేడు 9,476 ప్రాథమిక పాఠశాలలు - అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 822 - హైస్కూల్స్ 2,771 స్కూళ్లు - ప్రభుత్వ హాస్టళ్లు 1,407 - సంక్షేమ శాఖల జూనియర్ కళాశాలలు 458 మూడో విడత నాడు–నేడు 15,405 ప్రైమరీ స్కూళ్లు - అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 216 - హైస్కూళ్లు 41 - రెసిడెన్షియల్ స్కూళ్లు 63 - గవర్నమెంటు హాస్టళ్లు 248 - జూనియర్ కళాశాలలు 18 -
కేటగిరీలుగా స్కూళ్లు, కాలేజీల ఫీజులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఫీజులను నిర్ణయించేందుకు ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలను కేటగిరీల వారీగా విభజిస్తామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు తెలిపారు. సిటీ, టౌన్, మున్సిపాలిటీ, పంచాయతీ, అర్బన్, రూరల్ ఇలా పలు విభాగాలుగా విభజించి ఆయా సంస్థల్లోని టీచర్లు, సదుపాయాల ప్రమాణాలు అన్నింటినీ బేరీజు వేసుకుని ఫీజులను ఖరారు చేస్తామన్నారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని కమిషన్ కార్యాలయంలో వైస్ చైర్మన్ డాక్టర్ అరిమంద విజయశారదారెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చైర్మన్ పేర్కొన్న అంశాలు ఆయన మాటల్లోనే.. ఈనెల 28న జరిగిన సర్వసభ్య సమావేశంలో కమిషన్ పలు అంశాలపై చర్చించింది. ప్రస్తుతం కమిషన్ సభ్యులు మాత్రమే ఆయా స్కూళ్లను తనిఖీలు చేస్తున్నారు. ఇకపై జిల్లాకు 20 మంది సిబ్బందితో తనిఖీలు చేపడతాం. అన్ని స్కూళ్లను ఒకేసారి తనిఖీలు చేయడం సాధ్యం కానందున ఒక పోర్టల్ను ఏర్పాటుచేసి ఆయా స్కూళ్లు తమ సమాచారాన్ని అప్లోడ్ చేయాలని సూచించనున్నాం. వాటిని పరిశీలించి ఆ ప్రకారం ఏర్పాట్లు ఉన్నాయో లేదో చూసి ఫీజులు నిర్ణయిస్తాం. పాఠ్యాంశాల్లో నైతికత, లైంగిక విద్య ఇటీవలి కాలంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న తరుణంలో విద్యార్థి దశ నుంచే పిల్లల్లో మహిళలపట్ల గౌరవం పెరిగేలా సంబంధిత పాఠ్యాంశాలను ప్రవేశపెట్టించనున్నాం. నైతికత, లైంగిక విద్య వంటి అంశాలను కరికులమ్లో జతచేయాలని సూచిస్తున్నాం. అలాగే, జూనియర్ కాలేజీల్లోనూ త్వరలో తనఖీలు చేపడతాం. ఈ కాలేజీల్లో ఫీజులు, బోధనా సిబ్బంది నియామకం, ఇతర ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ప్రస్తుతం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇవి ఎలా జరుగుతున్నాయో కొన్ని కేంద్రాలకు వెళ్లి పరిశీలిస్తాం. మూడు దశల్లో అనుమతుల ప్రక్రియ : వైస్ చైర్మన్ విజయశారదారెడ్డి పాఠశాలలకు అనుమతుల మంజూరు విషయంలో ప్రస్తుతం ఒక గడువంటూ లేదు. ఈసారి ఓ నిర్దిష్ట విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. మూడు దశల్లో ఇది ఉంటుంది. ముందు దరఖాస్తు, తదుపరి లెటర్ ఆఫ్ ఇంటెంట్, ఆపై అనుమతులుగా ఇది ఉంటుంది. పాఠశాలలు, కాలేజీలకు అనుమతులు, అడ్మిషన్లు, ఫీజుల చెల్లింపును కూడా ఆన్లైన్లోనే నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తాం. అలాగే, ఇటీవల కొన్ని స్కూళ్లలో తరగతి గదులు ఇరుకుగా ఉండడంతో పాటు ఆట స్థలాలు ఎక్కడో దూరంగా ఉన్నట్లు చూపించారు. చిన్న పిల్లలకు అయిదో అంతస్తులో తరగతులు నిర్వహిస్తున్నారు. టెర్రస్పై ఆటలాడిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ విషయంలో ప్రతినెలా డీఈఓ 4 హైస్కూళ్లు, డిప్యూటీ డీఈఓ 8 హైస్కూళ్లు, ఎంఈఓ 12 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆర్ఐఓలు 4 జూనియర్ కాలేజీలు, డీఐఓలు 10 జూనియర్ కాలేజీలు తనిఖీ చేసేలా షెడ్యూల్ పెడుతున్నాం. ఈ విద్యా సంస్థలు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా ప్రజలు ఫిర్యాదు చేయడానికి కమిషన్ టోల్ఫ్రీ నెంబర్ను, గ్రీవెన్సు సెల్ను ఏర్పాటుచేస్తుంది. -
తడ బడి.. మూతపడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ప్రైవేటు పాఠశాలల్లో టీచర్ల సంఖ్య పెద్దగా తగ్గకపోయినా విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. పాఠశాల విద్యాశాఖ తేల్చిన లెక్కల ప్రకారం విద్యా వాలంటీర్లు కలుపుకొని 2017–18 విద్యా సంవత్సరంతో పోల్చితే 2018–19లో 3,834 మంది టీచర్లు తగ్గిపోయారు. అదే ప్రైవేటు స్కూళ్లలో 280 మందే తగ్గారు. విద్యార్థుల విషయానికొస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 39,107 మంది తగ్గగా, ప్రైవేటు పాఠశాలల్లో 77,447 మంది పెరిగారు. స్కూళ్ల పరంగా చూస్తే ప్రైవేటు స్కూళ్లే అత్యధికంగా మూత పడ్డాయి. అయినా వాటిల్లో విద్యా ర్థుల సంఖ్య పెరగటం గమనార్హం. 2017–18 విద్యా సంవత్సరంతో పోల్చితే 2018–19 విద్యా సంవత్సరంలో ప్రైవేటులో 410 స్కూళ్లు మూత పడినా ఆ ప్రభావం విద్యార్థుల సంఖ్యపైనా పడలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇక 2019–20 విద్యా సంవత్సరం లెక్కల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల సంఖ్య మరింతగా తగ్గుతుందని విద్యాశాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. రూ.వేలకోట్లు వెచ్చిస్తున్నా.. రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద వివిధ విద్యా పథకాలకు ఆమో దం తెలిపేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇటీవల కేంద్రానికి ఈ లెక్కలను అందజేసింది.అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లే మూత పడినట్లు పేర్కొంది. పట్ట ణాల్లో 453 పాఠశాలలు మూత పడగా, గ్రామీణ ప్రాంతాల్లో 26 మూతపడ్డాయి. విద్యా పథకాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ.వేల కోట్లను వెచ్చిస్తున్నా ఫలితాలు ఆశించిన మేర రావడం లేదు. సమగ్ర శిక్షా అభియాన్ కిందే ఏటా వెచ్చిస్తున్న రూ. 2 వేల కోట్లు కలుపుకొని ఏటా పాఠశాల విద్యకు రూ. 11 వేల కోట్లు కేటా యించినా ప్రభుత్వ బడులు విద్యార్థులను ఆకట్టులేకపోతున్నాయి. ప్రభుత్వ టీచర్లు సరిగ్గా చెప్ప రన్న అపవాదు, ప్రైవేటు పాఠశాలల ఆకర్షణీయ విధానాలతో తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే. కేంద్రానికి ఇచ్చిన లెక్కల్లో మరికొన్ని అంశాలు.. ►రాష్ట్రంలో 2017–18 విద్యా సంవత్సరంలో మొత్తం స్కూళ్లు 42,834 ఉండగా, 2018–19లో వాటి సంఖ్య 42,355కు తగ్గిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 479 స్కూళ్లు మూత పడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో 453, గ్రామీణ ప్రాంతాల్లో 26 మూత పడ్డాయి. ►మూత పడిన వాటిలో ప్రైవేటువే అత్యధికంగా ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు 410 మూత పడగా, మిగతావి ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ►రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో (ఇంటర్మీడియట్ కలుపుకొని) 2017–18 విద్యా సంవత్సరంలో 65,29,072 మంది విద్యార్థులు ఉండగా 2018–19 విద్యా సంవత్సరం వచ్చే సరికి వారి సంఖ్య 65,56,701 మందికి చేరుకుంది. అంటే పాఠశాలల్లో 27,629 మంది విద్యార్థులు పెరిగారు. ►2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా వలంటీర్లు కలుపుకొని 2,61,904 మంది టీచర్లు ఉండగా, వారి సంఖ్య 2018–19 విద్యా సంవత్సరంలో 2,57,367 మందికి తగ్గిపోయింది. అంటే పాఠశాలల్లోనే 4,537 మంది టీచర్లు తగ్గిపోయారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్య«ధికంగా 3,834 మంది టీచర్లు తగ్గిపోవడం గమనార్హం. -
'పాఠశాల తీరుని బట్టి గ్రేడింగ్ ఇస్తాం'
సాక్షి, విజయవాడ : ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఫీజులు నియంత్రిస్తామని ప్రాథమిక విద్యా కమిషన్ కార్యదర్శి ఆలూరి సాంబ శివారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే అన్ని జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ పాఠశాలల్లో తనికీలు నిర్వహిస్తామని తెలిపారు. పాఠశాల తీరుని బట్టి గ్రేడింగ్ నిర్ణయిస్తామని, మెరుగయిన సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తామని తెలిపారు. ఫీజుల నియంత్రణ కోసం శాస్త్రీయ విధానం రూపొందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలపై కమిషన్లో ప్రత్యేక గ్రీవెన్సు సెల్ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. -
‘ఇంగ్లిష్’తో బాలలకు బంగారు భవిత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంతో సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధన దిశగా ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసిందని పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ రెడ్డి కాంతారావు పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల బాలల బంగారు భవితకు ప్రభుత్వం బాటలు వేసిందన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా వ్యవస్థను హైజాక్ చేశాయని కుండబద్దలు కొట్టారు. ఈ పరిస్థితిని మార్చి విద్యా వ్యవస్థను పరిరక్షించడానికి ప్రభుత్వ చర్య దోహదపడుతుందన్నారు. ఇంగ్లిష్ మీడియంతో తెలుగు భాష ఉనికికి, ప్రాభవానికి ఎలాంటి ముప్పూ లేదని తేల్చిచెప్పారు. తెలుగు ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందన్నారు. విద్యార్థులు ఇతర సబ్జెక్టులను మాత్రమే ఇంగ్లిష్లో నేర్చుకుంటారన్నారు. వివిధ అంశాల గురించి ఇంకా ఆయన ఏమన్నారంటే.. పోటీ ప్రపంచంలో మెరుగైన అవకాశాలు.. ఇంగ్లిష్ మీడియం కోసమే మధ్యతరగతి వర్గాలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాల్లో చేరుస్తూ తలకు మించిన ఆర్థికభారాన్ని భరిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు నైపుణ్యాల సాధనలో వెనుకంజలో ఉంటున్నారు. ఇంగ్లిష్ మీడియం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరితే వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గిపోతుంది. అంతేకాకుండా పోటీ ప్రపంచంలో పేద, మధ్యతరగతి విద్యార్థులు కూడా బాగా> రాణించి మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. దాంతో రాష్ట్రంలో సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుంది. విద్యావేత్తలు, నిపుణులతో చర్చించే నిర్ణయం ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని విద్యావేత్తలు, నిపుణులు, సామాజికవేత్తలతో చర్చించాకే తీసుకుంది. వాస్తవానికి.. ఇంజనీరింగ్, మెడికల్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల విద్యాభ్యాసం అంతా ఇంగ్లిష్లోనే ఉంటోంది. పాఠశాల విద్యాభ్యాసం తెలుగులో చేసినా ఉన్నత విద్య ఇంగ్లిష్లో చదవాల్సి రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే పాఠశాల విద్య నుంచే ఇంగ్లిష్ మీడియంలో చదివితే సమస్యలు ఉండవు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ నిర్ణయాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నారు. అంతిమంగా తల్లిదండ్రుల అభిప్రాయాన్నే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం సాధ్యమా అని సందేహించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు పూర్తి అర్హత, తగిన శిక్షణ ఉంది. ఇంగ్లిష్ మీడియంలో బోధన కోసం అదనపు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రైవేటు పాఠశాలల్లో నైపుణ్యం ఉన్న అధ్యాపకులు ఎక్కడున్నారు? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గిపోతుండటంతో పాఠశాలలు మూసేయాల్సి వస్తోంది. ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరుగుతాయి. తద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమవుతుంది. -
చూసుకో.. రాసుకో..
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్ కోసం ఫిట్–జీ ప్రైవేట్ విద్యాసంస్థ ఆదివారం నిర్వహించిన పరీక్ష చర్చనీయాంశమైంది. స్థానిక పీఆర్ ప్రభుత్వ కళాశాల కేంద్రంలో ఈ పరీక్షకు దాదాపు వెయ్యిమంది వరకూ హాజరయ్యారు. ఆరు నుంచి పదో తరగతి వరకూ ప్రవేశాలకు ఆ విద్యాసంస్థ ప్రవేశపరీక్ష నిర్వహించింది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా ఫీజులో రాయితీ ఉంటుందని ప్రకటించడంతో పరీక్ష నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పందం కుదుర్చుకుని తమ సొంత కార్లలో, ప్రైవేట్ రూమ్లలో ఇష్టానుసారంగా పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్లు లేకపోవడం, పూర్తిగా ప్రైవేట్ విద్యాసంస్థ కావడంతో దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ పరీక్ష సాగుతున్న తీరును గమనించిన కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ‘ప్రైవేటు’ పద్ధతుల్లో పరీక్ష రాస్తున్న తల్లిదండ్రులను సెల్ఫోన్లతో ఫొటోలు తీయగా ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం చివరికి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. విజయవాడలో ఇదే పరీక్ష నిర్వహిస్తుండగా డీఈఓ పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష నిలిపివేసి, స్కూల్ యాజమాన్యంపై చర్యలకు సిద్ధమయ్యారు. పత్రికల్లో భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చి ప్రతిభ చూపినవారికి ఉపకార వేతనాలతో పాటు ఫీజులు రాయితీ ఇస్తామని చెప్పి పరీక్ష ఇలా బహిరంగంగా నిర్వహించడం ఎంత వరకూ సమంజసనమని కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఆర్జేడీ నరసింహరావును వివరణ కోరగా కృష్ణా జిల్లాలో పరీక్ష రద్దుచేయాలని అదేశాలు జారీ చేశామని, పదో తరగతిలోపు విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం చట్ట విరుద్ధమన్నారు. పూర్తి వివరాలు తెలసుకుని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
విద్యా శాఖతో ఆటలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఉన్నవి ప్రభుత్వ పాఠశాలలే. వాటికి ఎక్కువ మొత్తంలో ఆట స్థలాలు ఉన్నాయి. ఇక ప్రైవేటు పాఠశాలలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లోనే ప్రైవేటు స్కూళ్లు ఎక్కువగా ఉన్నట్లు విద్యా శాఖ క్షేత్ర స్థాయి అధికారులే చెబుతారు. అలాంటి వాటికి ఆట స్థలాలు లేనేలేవు. కనీసం పాఠశాల భవనాల చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగే స్థలమే లేదని అగ్నిమాపక శాఖ ఫైర్ ఎన్వోసీలే ఇవ్వలేదు. దీంతో దాదాపు గత మూడేళ్ల నుంచి 1,500 వరకు ఉన్నత పాఠశాలలకు అను మతి లేదని ఆయా పాఠశాలల విద్యార్థులను పదో పరీక్షలకు షరతులతో విద్యా శాఖ అనుమతించింది. ఫైర్ ఇంజన్ తిరిగేందుకే స్థలం లేనప్పుడు.. ఆట స్థలాలు ఎలా ఉంటాయని విద్యా శాఖ అధికారులే ప్రశ్నిస్తున్నారు. ఇవికాకుండా మరో 9 వేలకు పైగా ఉన్న ప్రైవేటు స్కూళ్లలో ఆట స్థలాలు లేనివే అత్యధికంగా ఉన్నాయి. అయినా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2482 పాఠశాలలకు మాత్రమే ఆట స్థలాలు లేవని యాజమాన్యాలు చెబుతున్నాయి. అన్నీ ఉన్నాయట.. ప్రభుత్వానికి ఇచ్చే లెక్కల్లో మాత్రం తమ పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు పక్కాగా ఉన్న ట్లు ప్రైవేటు యాజమాన్యాలు చూపిస్తున్నాయి. పెద్దగా సదుపాయాలు లేకపోయినా ఉన్నాయంటూ రాష్ట్రంలో చాలా వరకు ప్రైవేటు పాఠశాలలు తప్పుడు లెక్కలే ఇస్తున్నా విద్యా శాఖ ఏం చేయలేకపోతోంది. విచిత్రంగా కొన్ని పాఠశాలలు మాత్రం విద్యుత్ సదుపాయం, తాగునీటి సదుపాయం లేవని లెక్కలు ఇవ్వడం గమనార్హం. పాఠశాల విద్యా డైరెక్టరేట్ నుంచి పాఠశాలల సమగ్ర వివరాలను సేకరించే సమయంలో క్షేత్ర స్థాయిలోని పాఠశాలలు ఇచ్చే లెక్కలను మాత్రమే తీసుకుంటున్నందున నిజంగా ఆ సదుపాయాలు ఆయా పాఠశాలల్లో ఉన్నాయా.. లేదా.. అని తనిఖీ చేసే పరిస్థితి లేకపోవడంతో విద్యా శాఖ ఏమీ చేయలేకపోతోంది. దీంతో యాజమాన్యాలు ఇచ్చిన తప్పుడు లెక్కలనే నమోదు చేసుకోవాల్సి వస్తోంది. ఆటల్లో ముందుండాలి కదా..! ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇస్తున్న లెక్కల ప్రకారం రాష్ట్రంలోని అత్యధిక ప్రైవేటు పాఠశాలల్లో ఆట స్థలాలు ఉన్నపుడు స్కూల్ గేమ్స్ పోటీల్లో ప్రైవేటు స్కూల్ విద్యార్థులు ఎక్కువ మంది ముందుండాలి. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రైవేటు పాఠశాలల నుంచి పోటీల్లో పాల్గొనే విద్యార్థుల సంఖ్య స్వల్పంగానే ఉంటోందని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులే చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రైవే టు పాఠశాలల విద్యార్థులంతా ఆటలు ఎక్కడ అడుతున్నారో.. శారీరక వ్యాయామం ఎక్కడ జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వారంలో ఆరు పీరియడ్ల అమలేదీ? విద్యా శాఖ అకడమిక్ కేలండర్ ప్రకారం ప్రతి పాఠశాలలో అన్ని తరగతి విద్యార్థులకు వారంలో ఆరు పీరియడ్లు ఆటల కోసమే కేటాయించాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి రామిరెడ్డి పేర్కొన్నారు. అందులో రెండు పీరియడ్లు ఆటలు ఆడుకునేందుకు, మరో 2 పీరియడ్లు ఆయా ఆటలు, వాటి నియమ నిబంధనల గురించి నేర్చుకోవడం, మరొకటి మాస్ పీరియడ్గా యోగా, జంపింగ్, రన్నింగ్ వంటిని నేర్పించాలి. ఇంకొక పీరియడ్ మాత్రం ప్లే ఆల్. అంటే ఆయా పాఠశాలల్లోని విద్యార్థులంతా ఆ పీరియడ్లో ఆటలు ఆడుకోవాల్సిందే. కానీ ఇవేవీ పెద్దగా అమలుకు నోచుకోవట్లేదని విద్యా శాఖ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేలా చర్యలు చేపడుతున్నా ప్రైవేటు స్కూళ్లలో సాధ్యం కావట్లేదని అధికారులే వాపోతున్నారు. మార్కుల వేటలో.. ప్రైవేటు స్కూళ్లు అంటే బాగా చదివిస్తారనే అపోహ తల్లిదండ్రుల్లో ఉంది. యాజమాన్యాలు కూడా అదే బాటన కొనసాగుతున్నాయి. విద్యార్థులతో పాఠాలు బట్టీ పట్టించడం, మార్కులు తెప్పించడం, నాలుగు ఇంగ్లిష్ మాటలు మాట్లాడేలా చేయ డం తప్ప మరేమీ లేదన్నది అనేక సర్వేల్లో తేలింది. చదువడం, రాయడం రాని వారు కూడా అధికంగానే ఉన్నట్లు నేషనల్ అచీవ్మెంట్ సర్వే వెల్లడించింది. అయినా తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ప్రైవేటు స్కూళ్లకే పిల్లలను పంపిస్తూ బట్టీ చదువులకు అలవాటు చేస్తున్నారు. కొంత మంది తల్లిదండ్రులు మాత్రం తమ వ్యక్తిగత శ్రద్ధతో ప్రైవేటు కోచ్ల వద్ద పిల్లలకు క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ వంటి శిక్షణ ఇప్పిస్తున్నారు. వారు మాత్రమే పోటీలకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
సీఎం స్ఫూర్తికి ప్రై‘వేటు’
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘నో...స్కూల్ బ్యాగ్ డే’ పాటించాలని మూడు నెలల ముందే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా బే ఖాతరంటూ ప్రయివేటు పాఠశాలలు తమ పాత దారిలోనే నడుస్తున్నాయి. యథేచ్ఛగా ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బండెడు పుస్తకాల బరువుతో చిన్నారులు పడుతున్న కష్టాలను ప్రజాసంకల్ప యాత్రలో చూసి చలించిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ‘నో బ్యాగ్ డే’ అమలుకు శ్రీకారం చుట్టారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ఉన్న విద్యార్థులకు నెలలో మొదటి, మూడో శనివారం దీనిని కచ్చితంగా అమలు చేయాలని జూలై నెలలో ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటా అమలుకు ఆదేశాలు వచ్చాయి. కేవలం పుస్తకాలకే పరిమితమైపోతున్న విద్యార్థులలో మానసిక ఒత్తిడిని దూరం చేసి సృజనాత్మకతను వెలికితీయాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల నిర్వాకంతో అటకెక్కుతోంది. ‘సాక్షి’ బృందం శనివారం జిల్లాలోని ప్రైవేటు యాజమాన్యాల్లో నడుస్తున్న పాఠశాలలపై నిఘా పెట్టగా డొల్లతనం బట్టబయలైంది. విద్యా డివిజన్లు ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులు అమలాపురం 85 15,999 కాకినాడ 124 23,566 పిఠాపురం 80 17,903 రామచంద్రాపురం 80 16,672 రాజమహేంద్రవరం 102 21,135 మొత్తం 471 94,275 ఆ రోజు ఏమి చేయాలి...? ‘నో బ్యాగ్ డే’ పేరుతో ఆనంద పాఠాలు బోధించేలా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఉదయం నాలుగు తరగతుల్లో నీతి కథల బోధన, చిత్రలేఖనం, నైతిక విలువలు, సేవా కార్యక్రమాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. అనంతరం క్రీడలు, యోగాసనాలపై శిక్షణ ఇవ్వాలి. కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, పొడుపు కథలు, పజిల్స్, సరదాగా ఆటలు ఆడించాలి. అలాగే పాఠశాలలో సాగు చేస్తున్న బడితోటలో పాదులు వేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు వేయడం వంటి వాటిని అలవాటు చేయాలి. గ్రంథాలయాల్లో పుస్తకాలను ఎంపిక చేసుకుని చదవడం, వాటిపై చర్చించే అంశాలు నేర్పించాలి. ఆరోగ్య కార్యకర్తలు, మున్సిపల్, వ్యవసాయదారులు, తదితర పెద్దలను పిలిచి పిల్లలతో మాట్లాడించాలి. 1, 2 తరగతుల విద్యార్థులకు ఇంటి పని (హోంవర్క్) ఇవ్వకూడదు. జాతీయ విద్యా పరిశోధన మండలి సూచనల ప్రకారం 1, 2 తరగతులకు భాష, గణితం, 3, 4 తరగతులకు సామాన్య శాస్త్రం, గణితం తప్ప ఇతర సబ్జెక్ట్ పుస్తకాలు ఉండకూడదు. అదనపు పుస్తకాలు తీసుకు రావాలని యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదు. అదనపు మెటీరియల్ ఇచ్చినా అవన్నీ కలిపి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సూచించిన పుస్తకాల బరువును మించకూడదు. వీటిని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాటించడం లేదు. అన్ని పాఠశాలలూ పాటించాలి.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ ‘నో బ్యాగ్ డే’ అమలు చేయాలి. ఈ మేరకు అన్ని మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వ పాఠశాలలు నూరు శాతం అమలు చేస్తున్నాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పక్కాగానే వీటిని అమలు చేస్తున్నారు. అమలు చేయని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. -డి.అబ్రహం, జిల్లా విద్యాశాఖాధికారి -
పాఠశాలల్లోనే విద్యార్థులకు ఆధార్
సాక్షి, అమరావతి బ్యూరో: విద్యార్థులకు ఆధార్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లో 15 ఏళ్ల లోపు పిల్లలకు ఆధార్ నమోదు, అప్డేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సెప్టెంబర్ 1 నుంచి గుంటూరు జిల్లాలోని పాఠశాలల్లో ఆధార్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ముందుగా మండలానికి ఇద్దరు టీచర్ల చొప్పున ఈ నెల 27న శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించి విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డులో తల్లిదండ్రుల పేర్లకు ఈకేవైసీ అవుతున్నా పిల్లలకు కావడం లేదు. పిల్లల వేలిముద్రలను ఆధార్లో అప్డేట్ చేస్తేనే ఈకేవైసీకి అవకాశం ఉంటోంది. దీంతో చిన్నతనంలో ఆధార్ పొందినవారికి వేలిముద్రల అవసరం పడుతోంది. దీంతో ఆధార్ అప్డేషన్ కోసం వచ్చేవారితో పోస్టాఫీసులు, బ్యాంకులు, మీసేవా కేంద్రాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. విద్యార్థులను స్కూల్ మానిపించి మరీ తల్లిదండ్రులు ఆధార్ అప్డేషన్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలల్లోనే ఆధార్ అప్డేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గుంటూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఉపాధ్యాయులకు 27న శిక్షణ : గంగాభవాని, డీఈఓ, గుంటూరు ఈ నెల 27న ఆధార్ సేవలపైన మండలానికి ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున గుంటూరు జిల్లాలో 114 మందికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందినవారు ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇచ్చి, ఆ పాఠశాలలోని విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేస్తారు. -
‘ప్రైవేట్’కు పట్టని ‘నో బ్యాగ్ డే’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయించే కార్యక్రమాల అమలులో ప్రైవేటు పాఠశాలలు బేఖాతరుగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడిలేని చదువులు కొనసాగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో తప్పనిసరిగా నెలలో రెండు శనివారాలు ఆనంద వేదిక పేరుతో ‘నో స్కూల్ బ్యాగ్ డే’ను చేపట్టాలని నిర్దేశించింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించి ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో అకడమిక్ వ్యవహారాలకు సంబంధించి ఏ యాజమాన్య పాఠశాల అయినా ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. ఎస్సీఈఆర్టీ రూపొందించే పాఠ్య ప్రణాళికలు, ఇతర అంశాలను ప్రైవేటు పాఠశాలలు సైతం అమలుచేయాల్సిందే. కానీ, ప్రభుత్వం ప్రకటించిన ‘నో స్కూల్ బ్యాగ్ డే’ను ప్రైవేటు పాఠశాలలు అమలుచేయడంలేదు. దీనిపై పాఠశాల విద్యా శాఖ కూడా పెద్దగా దృష్టి సారించడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమ్మ ఒడి వంటి పథకాలను తమకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేసిన ప్రైవేటు పాఠశాలలు ఆనంద వేదికను అమలుచేయకపోవడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ సిలబస్ కూడా బేఖాతర్ ఇదిలాఉంటే.. ప్రభుత్వం రూపొందించిన సిలబస్లోని పుస్తకాలను కాకుండా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను ప్రైవేట్ స్కూళ్లు పిల్లలతో చదివిస్తున్నాయి. ఆటపాటలు, ఇతర కృత్యాలు ఇక్కడ లేనేలేవు. ఎస్సీఈఆర్టీ కూడా ప్రస్తుతానికి ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలకే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేసింది. హైస్కూలు విద్యార్థులకు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన బోధనకు ఆటంకం ఏర్పడుతుందేమోనన్న భావనతో వారికి ప్రస్తుతానికి ఈ ఆనందవేదిక కార్యక్రమాలను అమలుచేయడంలేదు. సమగ్ర నిరంతర మూల్యాంకనం కింద నిర్వహించే కృత్యాలనే కొనసాగిస్తోంది. ప్రాథమిక పాఠశాలలకే ఆనంద వేదిక కింద ‘సృజన’, ‘శనివారం సందడి’ కార్యక్రమాలను పరిమితం చేసినా ప్రైవేటు పాఠశాలలు వాటిని కూడా పాటించకపోవడం గమనార్హం. కాగా, రాష్ట్రంలోని దాదాపు 61 వేల పాఠశాలల్లో 70 లక్షల మంది వరకు విద్యార్థులు చదువుతుండగా అందులో 42 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లోనే ఉన్నారు. ఒకటి, రెండు వారికి ఆనంద వేదిక ఇలా.. ఒకటి, రెండు తరగతులకు సంబంధించిన విద్యార్థులతో ఒకటి, మూడు శనివారాల్లో పాఠ్యపుస్తకాలు లేకుండా అభినందన గేయాలు, దేశభక్తి గీతాలు, జానపద గేయాలు, పద్యాలు, శ్లోకాలు పాడించడం, కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బంకమట్టితో బొమ్మలు చేయడం వంటి కార్యక్రమాలు అమలుచేయాలి. 3, 4, 5 తరగతుల్లో ఇలా.. - బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బొమ్మలు చేయడం, అలంకరణ వస్తువుల తయారీ, ఏకపాత్రాభినయం, నాట్యం చేయడం వంటివి చేపట్టాలి. - పాఠశాలల్లో తోటల పెంపకం, పాదులు చేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువుల వాడకంపై అవగాహన కల్పించాలి. - పాఠశాలను, తరగతి గదులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా నేర్పాలి. - పుస్తకాల పఠనం, కథలు రాయడం, చెప్పడం వంటివి చేపట్టించాలి. - అలాగే గ్రామంలోని ముఖ్యమైన అధికారులు, ఇతర ముఖ్యులను పిలిచి వారితో మాట్లాడించాలి. - కానీ, ఇవేవీ ప్రైవేటు పాఠశాలల్లో అమలుచేయడంలేదు. ఇవే కాకుండా ఎస్సీఈఆర్టీ ఇచ్చే ఇతర ఆదేశాలను కూడా అవి పట్టించుకోవడంలేదు. -
విద్యార్థుల వసతులను పక్కనపెట్టి కాసుల వేట
-
శ్రీ చైతన్య.. కాదది.. తేజ
‘‘ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో ఉన్నది ఓ స్కూల్ బిల్డింగ్. ఈ ఫొటోల్లో ఒకటి ఉదయం తీసినదయితే... రెండోది మధ్యాహ్నం తీసిన ఫొటో. జాగ్రత్తగా గమనిస్తే ఆ భవనానికి తగిలించిన బోర్డులు మారినట్లు తెలుస్తోంది. ఉదయం తీసిన ఫొటోలో ‘శ్రీ చైతన్య స్కూల్ ’ అనే బోర్డు ఉండగా... రెండో ఫొటోలో ఆ బోర్డు మాయమై... స్కూల్ గేటుకు ‘తేజ ఇంగ్లిష్ మీడియం స్కూల్’ అనే బ్యానర్ కట్టారు. అనుమతి లేకపోయినా శ్రీచైతన్య స్కూల్ పేరుతో పాఠశాలలను నడుపుతున్నారని విద్యార్థి సంఘాలు చేసిన ఆందోళనతో కార్పొరేట్ బోర్డులను తొలగించి పాత స్కూల్ పేరుతో గల బ్యానర్ను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అదీ ఈ ఫొటోల వెనుకున్న కథ... సాక్షి, కరీంనగర్ : మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు కళ్లు మూసుకోగా... పక్క రాష్ట్రపు కార్పొరేట్ విద్యాసంస్థలు ఎలాంటి అనుమతులు రాకపోయినా... యథేచ్ఛగా కరీంనగర్లోకి చొచ్చుకు వస్తున్నాయనడానికి ఇదో నిదర్శ నం. తీగలగుట్టపల్లి అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్న తేజ ఇంగ్లిష్ మీడియం స్కూల్ను కొనుగోలు చేసిన శ్రీ చైతన్య గ్రూప్ ‘శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరిక్యులం’ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు తీసుకొంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని బినామీగా చూపుతూ కార్పొరేట్ విద్యాసంస్థ ఈ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఇదొక్కటే కాకుండా కరీంనగర్ సిటీలోనే వావిలాలపల్లిలో, అల్గునూరు, కమాన్ ప్రాంతాల్లో కూడా ఈ పాఠశాలలు ఏర్పాటై అడ్మిషన్లు కూడా ముగించారు. అయితే వీటికి దేనికీ విద్యాశాఖ నుంచి అనుమతులు లేకపోవడం గమనార్హం. వావిలాలపల్లిలో గతంలో అనుమతి లేకుండా శ్రీ చైతన్య పేరుతో నడుపుతున్నారని సీజ్ చేసిన పాఠశాల తిరిగి యధాతథంగా నడవడమే గాక, కొత్త విద్యాసంవత్సరం అడ్మిషన్లు కూడా పూర్తి చేసుకొంది. బుధవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆందోళనల నేపథ్యంలో మరోసారి సీజ్ చేసేందుకు ప్రయత్నించగా, పాఠశాల యాజమాన్యం పాత స్కూల్ పేరుతో బ్యానర్లు కట్టింది. కళ్లు మూసుకున్న విద్యాశాఖ గత ఫిబ్రవరి నెలలో అనుమతి లేకుండా శ్రీ చైతన్య పాఠశాల పేరుతో నాలుగు బ్రాంచీలు నడుపుతుండడంపై ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆందోళన చేసింది. దాంతో ఆ స్కూల్ను సీజ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖ మీడియాకు తెలిపింది. మళ్లీ ఏం అనుమతులు వచ్చాయని స్కూల్ యధాతథంగా నడిచిందో జిల్లా విద్యాశాఖాధికారికే తెలియాలి. సిక్ అయిన స్కూళ్లను కొనుగోలు చేసిన సదరు కార్పొరేట్ సంస్థ వరంగల్లోని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎలాంటి అనుమతి రాకపోయినా, దర్జాగా బోర్డులు ఏర్పాటు చేసి పాఠశాలల పేరుతో ‘దుకాణాలు’ తెరిచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ‘వ్యాపారం’ సాగిస్తోంది. స్కూళ్లలోనే నోట్బుక్స్, టెక్టŠస్ బుక్స్, స్టడీ మెటీరియల్, యూనిఫారాలు, పెన్నులు, పెన్సిళ్లు కూడా విక్రయిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాలుగు చోట్ల వందలాది మంది విద్యార్థులతో పాఠశాలల వ్యాపారం నడుస్తుంటే విద్యాశాఖ డీఈవోకు గానీ, మండలాల్లో ఉండే ఎంఈవోలకు గానీ తెలియకపోవడం. ఈ విషయంలో అధికారుల నటనా కౌశల్యానికి పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి. దీనిపై డీఈవో వెంకటేశ్వర్లును సంప్రదించగా... ‘ఒకే బోర్డుతో నాలుగు పాఠశాలలు నడపడం నిబంధనలకు విరుద్ధం. వెంటనే ఎంఈవోను పంపించి సీజ్ చేయిస్తాం. వరంగల్ ఆర్జేడీ వద్ద ఆయా స్కూళ్ల అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. అయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించం’ అనే అరిగిపోయిన రికార్డునే తిరిగి వినిపించడం జరుగుతోంది. విద్యాశాఖ, కార్పొరేట్ విద్యాసంస్థలు కుమ్మక్కై కరీంనగర్లో విద్యావ్యాపారం సాగిస్తున్న విషయం ఉన్నతాధికారులకు తెలిసినా, పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వంలోని కొన్ని పెద్ద తలకాయల అండతో కార్పొరేట్ విద్యాసంస్థ కరీంనగర్తో పాటు తెలంగాణ జిల్లాలో వేళ్లూనుకొంటోంది. ఉమ్మడి జిల్లానే టార్గెట్గా... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీ చైతన్య విద్యాసంస్థ పలు చోట్ల బ్రాంచీలు తెరిచింది. ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి పేరిట ఈ స్కూళ్లన్నింటికీ అనుమతులు పొందే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే గోదావరిఖని, జగిత్యాల, కోరుట్లలో ఈ విద్యాసంస్థ బ్రాంచీలు తెరిచింది. విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకొని టెక్నో, ఐఐటీ, ఫౌండేషన్ తదితర తోక పేర్లతో పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో నారాయణ. శ్రీ చైతన్యతోపాటు నారాయణ విద్యాసంస్థ కూడా పాఠశాలల గేట్లు తెరిచేందుకు కరీంనగర్ను ఎంచుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఫైళ్లు సచివాలయం స్థాయిలో కదులుతుండగా, కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల తదితర ప్రాంతాల్లో సిక్ స్కూళ్ల అన్వేషణలో ఏజెంట్లు బిజీగా ఉన్నారు. భాష్యం కార్పొరేట్ సంస్థ కూడా కరీంనగర్లో బ్రాంచీలు తెరిచే ఆలోచనలో ఉంది. తెలంగాణ వచ్చాక ఎక్కువైంది.. తెలంగాణ రాష్ట్రంలో పరాయి పెత్తనం పెరిగింది. కరీంనగర్తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 60 పాఠశాలలు తెరిచేందుకు శ్రీచైతన్య ఏర్పాట్లు చేసుకొంది. త్వరలో నారాయణ కూడా రాబోతుంది. తెలంగాణ వచ్చాక అందరికీ తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య దక్కుతుందని భావించిన జనానికి ఇది ఆశనిపాతం. విద్యతోపాటు సంస్కారాన్ని బోధించే స్థానిక ప్రైవేటు పాఠశాలలపై ఉక్కుపాదం మోపే కుట్ర జరుగుతోంది. ఒక వ్యక్తి పేరిట వందలాది పాఠశాలలకు అనుమతి ఎలా ఇస్తారు? ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలి. కరీంనగర్లో అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలలను ఏ పేరుతో కూడా నడవకుండా సీజ్ చేయాలి. – ట్రెస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్రావు -
ఫీజుల పేరిట జలగలు రక్తం పీల్చినట్టు
-
జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు
సాక్షి, అమరావతి: స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి విద్యావ్యవస్థ పడిలేస్తోందని, ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థలో ఉన్నత ప్రమాణాలను తీసుకురావాల్సిన అవసరముందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ చర్చలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ ప్రస్థానం సరైనమార్గంలో సాగలేదని, విద్యావ్యవస్థను కొందరు అభివృద్ధిపథంలో నడిపితే.. మరికొందరు నిర్వీర్యం చేశారని అన్నారు. గత చంద్రబాబు హయాంలో నాలుగువేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లకు విచ్చలవిడిగా అనుమతులిచ్చిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఫీజుల పేరిట జలగలు రక్తం పీల్చినట్టు.. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు డబ్బులు పిండుకుంటున్నాయని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. భూ యజమాన్య హక్కుల బిల్లుకు ఆమోదం భూ యజమాన్య హక్కుల బిల్లును ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. డిప్యూటీ సీఎం, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూవివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చేందుకు ఈ బిల్లు తెచ్చినట్టు తెలిపారు. భూములకు సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేస్తామని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరగనివ్వమని అన్నారు. పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల వసూ లు, ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు వీలుగా పాఠశాల విద్య, ఉన్నత విద్యలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం శాసనసభలో బిల్లులను ప్రవేశపెట్టారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు చైర్మన్లుగా ఉండే ఈ కమిషన్లలో ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనున్నారు. రెండు కమిషన్లకు సివిల్ కోర్టు అధికారాలుంటాయి. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడం, విద్యా సంస్థల్లో చేరికలు పెంచడం, డ్రాపవుట్లు తగ్గించడం, సుస్థిర విద్యాభివృద్ధి సాధన, లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులకు అవకాశాలు కల్పించడం ఈ బిల్లుల ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. -
హైటెక్లో ‘లోక్లాస్’..
సాక్షి, నెల్లూరు: కార్పొరేట్ స్కూల్స్ బ్రాండ్ పేరుతో మోసం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు చదువుల విషయంలో అటు విద్యార్థులను, ఇటు తల్లిదండ్రులను దారుణంగా వంచిస్తున్నాయి. కనీస అర్హత లేని వారితో పాఠాలు చెప్పిస్తూ మాయ చేస్తున్నాయి. బ్రాండ్ మోజులో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఇంటర్, డిగ్రీలు చదివి టీచింగ్ అనుభవం లేని వారికి తక్కువ జీతాలిస్తూ చదువులు చెప్పిస్తున్నారు. ఇదంతా తెలిసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అక్రమాలకు అడ్డాగా మారిన ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్కుమార్యాదవ్ ఆదేశాలిచ్చినా జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలో 1,054 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 1,64,724 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలు ప్రతి తరగతిలో ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో టీచర్ను నియామకం చేస్తున్నాయి. 90 శాతం ప్రైవేట్ పాఠశాలల్లో అర్హత లేని ఉపాధ్యాయులతోనే పాఠాలు చెప్పిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉన్న వారినే నియామకం చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కేవలం ఇంగ్లిష్ పరిజ్ఞానాన్నే ప్రాధాన్యంగా తీసుకుని టీచింగ్ అనుభవం లేని వారిని నియామకం చేసుకుంటున్నట్లు ఇటీవల జరిగిన సర్వేలో తేలింది. టీచింగ్ అనుభవం లేని వారు తక్కువ జీతానికే పనిచేసేందుకు ముందుకు వస్తుండడంతో ప్రైవేట్ యాజమాన్యాలు వారినే నియమించుకుంటున్నట్లు తెలిసింది. నిబంధనలిలా.. ప్రైవేట్ పాఠశాలల ఏర్పాటు సమయంలో అనుమతి పొందిన ఏడాది తర్వాత గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఆ సమయంలో దరఖాస్తులో అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియామకం చేసుకుంటున్నట్లు వారి వివరాలు, జీతభత్యాల వివరాలు కూడా పొందుపరుస్తారు. ప్రాథమిక పాఠశాలలో టీటీసీ పూర్తి చేసిన వారిని నియమించుకోవాలి. హైస్కూల్కు మాత్రం తప్పనిసరిగా బీఈడీ అసిస్టెంట్ (బీఈడీ పూర్తి చేసిన వారు)ని నియామకం చేసుకోవాలి. స్కూల్ గుర్తింపు సమయంలోనే అర్హత ఉన్న టీచర్ల పేర్లు, వారి సర్టిఫికెట్లు చూపించే యాజమాన్యాలు పాఠశాలల్లో మాత్రం టీచింగ్ అనుభవం లేని వారినే కొనసాగిస్తున్నారు. పుస్తకాల పేరుతో రూ.120 కోట్ల దోపిడీ నిబంధనల ప్రకారం కార్పొరేట్ స్కూళ్లలో పాఠ్యపుస్తకాలు విక్రయించకూడదు. కానీ జిల్లాలో ప్రతి కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్లో నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు బహిరంగంగానే విక్రయిస్తున్నారు. 6వ తరగతి విద్యార్థికి పుస్తకాల పేరుతో రూ.6,300, 8వ తరగతి విద్యార్థి నుంచి రూ.7,200 వంతున వసూలు చేస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఏడాదికి పుస్తకాల విక్రయం పేరుతో సగటున రూ.120 కోట్ల వ్యాపారం సాగిస్తున్నారు. అలాగే నారాయణæ ఒలింపియాడ్ పేరుతో నిర్వహించే స్కూల్లో ఒక్కో విద్యార్థి నుంచి యూనిఫాం(రెండు జతలకు) పేరుతో రూ.5,500 యథేచ్ఛగా వసూలు చేస్తున్నారు. మౌనంగా.. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని టీచర్లతో క్లాసులు నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారుల నుంచి స్పందన ఆశించిన స్థాయిలో లేదు. అలాగే ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తున్నా అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్ అక్రమ దందాకు చెక్ పెట్టాలని జిల్లాకు చెందిన ఇరిగేషన్శాఖ మంత్రి అనిల్కుమార్యాదవ్ ఆదేశాలు ఇచ్చినా విద్యాశాఖ అధికారులు మంత్రి ఆదేశాలు పెడచెవిన పెడుతున్నారు. ఒకటి, రెండు స్కూళ్లలో తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రతి ఏటా జిల్లా విద్యాశాఖ అధికారులకు మామూళ్లు ఇస్తుండడంతో కార్పొరేట్ అక్రమదందాను నిలువరించలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
విద్య సేవేగానీ.. వ్యాపారం కాకూడదు
సాక్షి, అమరావతి: విద్య అన్నది సేవే కానీ.. వ్యాపారం కాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై సమీక్షిస్తూ.. తనకు అత్యంత ప్రాధాన్య రంగాల్లో విద్యాశాఖ కూడా ఒకటన్నారు. దేశంలోని చట్టాల ప్రకారం విద్య అనేది సేవాకార్యక్రమమేగానీ.. వ్యాపారాంశం కాదన్నారు. కొందరు విద్యను వ్యాపారంగా మార్చారని, ఇకపై ఈ విధానాలు చెల్లవని చెప్పారు. విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో నూరు శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్ మొత్తం సీట్లలో 25 శాతం సీట్లను పేదలకు ఉచితంగా కేటాయించాల్సి ఉందన్నారు. ఇక నుంచి అలా కేటాయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు రెండు ప్రత్యేక చట్టాలు తీసుకు రానున్నట్టు ఆయన చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ ఒకటి, ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు మరొక చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. ప్రతి ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ కాలేజీలో ఎంతమంది విద్యార్థులకు ఎంత మంది టీచర్లు ఉండాలనే విషయాలను దృష్టిలో ఉంచుకుని వాటికి అనుమతి ఇవ్వాలని సూచించారు. అవసరమైతే అనుమతి ఇచ్చే అధికారాన్ని డీఈవోల నుంచి జిల్లా కలెక్టర్కు బదిలీ చేస్తామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 26 శాతం నిరక్ష్యరాస్యత ఉంటే.. మన రాష్ట్రంలో 33 శాతం ఉందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రంలో ప్రతి చిన్నారికి చదువు అందించాలనే లక్ష్యంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల అన్న తేడా లేకుండా పేదలు తమ పిల్లలను ఏ బడికి పంపినా జనవరి 26న వారి తల్లులకు రూ.15 వేల చొప్పున అందజేస్తామన్నారు. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పరిధిలోని ప్రతి స్కూల్నూ ఇంగ్లిష్ మీడియం స్కూల్గా మారుస్తామని, తెలుగు సబ్జెక్ట్ను తప్పనిసరి చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పుడున్న స్థితిలో స్కూళ్ల ఫొటో తీయాలని.. రెండేళ్లలో వాటికి మౌలిక వసతులన్నీ సమకూర్చి తర్వాత మరోసారి ఫొటోలు తీసి ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరిచే నాటికే పిల్లలకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అందేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. ఈ ఏడాది యూనిఫామ్ అందజేయడానికి ఆగస్టు వరకు సమయం పట్టవచ్చని అధికారులు సీఎంకు చెప్పగా.. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా పాఠశాలలు తెరిచే రోజుకే వాటిని సమకూర్చాలని ఆదేశించారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు స్కూల్ యానిఫామ్తోపాటు కొత్తగా బూట్లను కూడా పంపిణీ చేయాలనే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. గత ఐదేళ్లలో స్కూల్ యూనిఫామ్ పంపిణీలోనూ భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని.. కనీసం పిల్లలకు సరైన సైజులో దుస్తుల్ని కూడా అందజేసే వారు కాదన్నారు. ఇకపై ఏ పిల్లవాడికీ ప్రైవేట్ స్కూల్కు పోవాలన్న ఆలోచన రాకూడదనేది లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యూనిఫామ్ పంపిణీలో అవినీతిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని స్పష్టం చేశారు. -
పేద తల్లులు... పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి
సాక్షి, అమరావతి: ప్రతి పేద తల్లి పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి కొద్ది రోజులుగా భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటన్నింటికీ తెరదించుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఈ ప్రకటన చేసింది. ‘అమ్మ ఒడి’ విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావులేదని పేర్కొంది. ఈ పథకం అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంగా, ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా వివరించారని తెలిపింది. బడిబాట, అక్షరాభ్యాసం కార్యక్రమాల సందర్భంగా, ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్లోనూ స్పష్టీకరించారని వివరించింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా అందరికీ అమ్మ ఒడి వర్తిస్తుందని వైఎస్ జగన్ తన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో తెలిపారని, ఈ దృష్ట్యా పేద పిల్లలు చదివేది ప్రభుత్వ లేదా ప్రవేట్ పాఠశాల అయినా అమ్మ ఒడి వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. పేదల పిల్లలందరూ చదువుకోవాలి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటి స్థితిగతుల్ని, రూపురేఖల్ని మారుస్తామని ముఖ్యమంత్రి ఇంతకు ముందే ప్రకటించారని, ప్రభుత్వ బడుల్ని మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలూ త్వరలో ప్రారంభం కాబోతున్నాయని సీఎం కార్యాలయం వివరించింది. ‘దేశంలో నిరక్షరాస్యుల సగటు 26 శాతం ఉంటే ఏపీలో 33 శాతం ఉంది. అంటే మన రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 33 మంది చదువుకోని వారే. అక్షరాస్యత విషయంలో మన రాష్ట్రం దేశంలో అట్టడుగున ఉంది. ఈ పరిస్థితిని మార్చి, పేదల పిల్లల్లో ప్రతి ఒక్కరూ బడికి వెళ్లి చదువుకోవాలన్న ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావు లేదు’ అని స్పష్టం చేసింది. ఎన్నికల హామీల మేరకు మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో సంవత్సరానికి రూ.15 వేలు అందిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. -
ప్రైవేట్ చదువులు!
సాక్షి,కనిగిరి: ప్రైవేట్ పాఠశాలల చదువులపై మోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరవడంతో తమ పిల్లల చదువులు బడ్జెట్ చూసుకొని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ ఫీజు, యూనిఫాం, బూట్లు, బ్యాగులు, నోట్ పుస్తకాలు పాఠశాల సరంజామా ధరలు ఆకాశాన్నంటాయి. నెల సంపాదనంతా వెచ్చించినా ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాంకు సరిపోని పరిస్థితి. తాము పస్తులున్నా చదువుకుని తమ పిల్ల భవిష్యత్ను బాగు చేయాలనకుంటున్నారు. పిల్లల విద్యోన్నతికి కలలు కనే తల్లిదండ్రులు, తమకు ఉన్నా లేకున్నా చదువులు బడ్జెట్ భారమైనా అప్పోసొప్పో చేసి మోస్తున్నారు. పాఠశాలలు తెరచి పది రోజులు దాటింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వసతులున్నా.. గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో వాటిపై అనాశక్తితో చూపుతూ కొందరు ప్రైవేటు పాఠశాల వైపు మోజు మొగ్గు చూపుతన్నారు. ఫలితంగా పెరిగిన ధరలతో చదువుల కొనుగోళ్లు భారంగా మారి తల్లడిల్లుతున్నారు. అంతేగాక పిల్లలు ఎక్కడ చేర్చారంటే గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారని గొప్పగా చెప్పు కోవడం తల్లిదండ్రులకు గర్వంగా మారింది. మధ్య తరగతి, సామాన్య ప్రజలు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుర్తింపు పొందిన పాఠశాలల్లో పిల్లలను చేర్చాలంటే భారీగా బడ్జెట్ సిద్ధం చేసుకోవాల్సిందే. ఈ ఏడాది ఒక్కో నోటు పుస్తకంపై రూ.5 నుంచి రూ.10 వరకు పెంచారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని రకాల పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో రాకపోవడంతో బయట మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారుగా 110 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉండగా అందులో 26 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు అంచనా. కొనసాగుతున్న ప్రైవేట్ దోపిడీ ఏటా పెరుగుతున్న ఈ ఏడాది చదువులు బడ్జెట్ భారీగా పెరిగింది. నర్సరీ, ఎల్కేజీల నుంచి ఫీజులు మోత ప్రారంభమవుతుంది. ఇద్దరు..ముగ్గురు పిల్లలు చదువులకు వస్తే మరింత భారంగా మారుతుంది. పాఠశాలలు తెరవడంతో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, రాత పుస్తకాల ధరలు ఆకాశాన్ని అంటాయి. యూనిఫాం ధరలు భారీగా పెరిగాయి. ఇక స్కూల్ ఫీజులు తడిసి మోపెడవుతున్నాయి. ఫీజులు ఒక్కో పాఠశాల స్థాయిని బట్టి ఉంటున్నాయి. బ్రాండెడ్ పేరు ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో భారీగా ఉండగా మిగిలిన వాటిలో కొంత తక్కువగా ఉన్నాయి. గతేడాది కంటే ఫీజులు క్లాసుకు వెయ్యి నుంచి రూ.500 వరకూ పెంచారు. పాఠశాలల స్థాయిని బట్టి ఎల్కేజీ ఫీజు రూ.9 వేల నుంచి రూ.12 వేల వరకూ ఉన్నాయి. ఇకపై ప్రతి క్లాసుకు రూ.500 చొప్పున పెరుగుతూ వస్తూ పదో తరగతిలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో రూ.18,500 వరకు ఫీజు ఉంది. మిగిలిన పాఠశాలల్లో రూ.17 వేల నుంచి రూ.18 వేల వరకు ఫీజులు ఉన్నాయి. క్లాసును బట్టి అడ్మిషన్ ఫీజు రూ. వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక యూనిఫాం నుంచి మోసినన్ని పుస్తకాలు, బూట్లు, వ్యాన్ ఫీజులు చెల్లించాలి. ప్రతి విద్యార్థికి ఫీజులు మినహా రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చు అవుతోంది. ఏడాదికి పుస్తకాల ధరలు 10 శాతం పెరుగుతున్నాయి. స్కూల్ బ్యాగులు, కంపార్ట్బాక్స్ల ధరలు భారీగా పెరిగాయి. ప్రైవేటు స్కూల్స్లో చదువులు చదివించాలనుకొనే తల్లిదండ్రులు డీలా పడుతున్నారు. నెలసరి బడ్జెట్ సరిపోకా పిల్లల కొనుగోళ్లకు అప్పులు చేస్తున్నారు. అయినా పేరు గొప్ప కోసం ప్రైవేటు దోపిడీ గురవుతున్నారంటే అతిశయోక్తి కాదు. -
విద్యపై జీఎస్టీ భారం..
సాక్షి, ఇల్లెందుఅర్బన్ : ప్రైవేట్ విద్య రాను రాను మరింత ఖరీదవుతోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు విద్యాభారం మోయలేకపోతున్నాయి. తాము కష్టపడి సంపాదించిదంతా పిల్ల చదువులకే ఖర్చవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 2018–19 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు కావాల్సిన నోట్ పుస్తకాలు ,యూనిఫాంలపై జీఎస్టీ భారం పడింది. దీంతో గతేడాది కన్నా ఈ ఏడాది నోట్ పుస్తకాలు, దుస్తుల ధరలు భారీగా పెరిగాయి. ఇదే అదునుగా యాజమాన్యాలు జీఎస్టీ పేరుతో సరికొత్త విద్యా వ్యాపారానికి తెరలేపాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెన్సిల్ మొదలుకొని యూనిఫాం,దుస్తుల వరకు ప్రయివేట్ పాఠశాలలు చెప్పిన చోటనే కొనుగోలు చేయాలనే నిబంధనలు విధిస్తుండడంతో తల్లిదండ్రులపై పెద్ద ఎత్తున భారం పడుతుంది. నోట్ పుస్తకాలపై 12శాతం జీఎస్టీ విధించడంతో ఈసారి ఒక్కో నోటు పుస్తకంపై రూ.10 నుంచి రూ.15 వరకు ధరలను పెంచి విక్రయిస్తున్నారు. గతేడాది ఒకటో తరగతి విద్యార్థికి నోటు పుస్తకాలు ,పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేస్తే రూ.1200 వరకు ఖర్చయ్యేది. ప్రస్తుతం ఒక్కసారిగా రూ 1500 నుంచి 2వేల లోపు ఖర్చవుతోంది. యూనిఫాం పై ప్రభుత్వం ఐదు శాతం జీఎస్టీ విధించడంతో దుకాణదారులు ఏకంగా దాన్ని 8 నుంచి 10శాతంకు పైగా పెంచి విక్రయిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెప్పిన చోటనే పాఠ్య, నోట్ పుస్తకాలు కొనుగోలు చేయాలి. ఇలా యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు పాఠశాలల యాజమాన్యాలు చెప్పిన బుక్స్టాల్స్లోనే విక్రయించడంతో వచ్చిన కమిషన్లను పాఠశాల యాజమాన్యాలు పంచుకుంటున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, టిఫిన్ బాక్సులు ,స్కూలు బ్యాగ్లు, వాటర్ బాటీల్స్ తదితర పిల్లలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అయితే గతేడాది కంటే ఈ ఏడాది ప్రతి వస్తువుపై ధర రెండింతలు పెరిగింది. ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు పాఠశాల ఫీజులతో కలిపి సుమారు రూ 70వేలకు పైగా ఖర్చు వచ్చే పరిస్థితి నెలకొంది. జీఎస్టీ కారణంతో కొందరు బుక్స్టాల్స్యాజమాన్యాలు అధిక ధరలు వేసి బిల్లు లేకుండానే విక్రయించడంతో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలకు దిగుతున్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి జీఎస్టీ కంటే అదనంగా పుస్తకాలను విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
విద్యా‘వ్యాపారం’..!
సాక్షి, వత్సవాయి : విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తామని ప్రకటనలు గుప్పించి విద్యార్థులకు వల వేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో అంతా వ్యాపారమే సాగుతుంది. పుస్తకాల దగ్గర నుంచి విద్యార్థులకు కావాల్సిన అన్ని వస్తువులను పాఠశాలల్లోనే ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు. టెస్టు, నోట్ పుస్తకాల ధరలతో విద్యార్థుల తల్లిదండ్రులు బెంబేతెత్తుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ సంబంధిత పాఠశాలల్లోనే పుస్తకాలు కొనాలని షరతులు పెట్టడంతో ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల వ్యాపారం జోరుగా సాగుతుంది. పాఠశాలల్లో చదివే విద్యార్థులు బహిరంగ మార్కెట్లో పుస్తకాలు కొనుగోలు చేయరాదని పాఠశాల యాజమాన్యం ఆదేశాలు జారీచేస్తున్నారని తల్లితండ్రులు చెబుతున్నారు. చేసిదిలేక రెట్టింపు రేట్లకే పాఠశాలల్లో పుస్తకాలు కొనుగోలు చేయవల్సివస్తుంది. పాఠ్య పుస్తకాల విక్రయాలకు పాఠశాలలు అడ్డాగా మారాయి. బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న టెస్టు, నోట్ పుస్తకాలకు పాఠశాలల్లో విక్రయిస్తున్న వాటికి పొంతన ఉండడం లేదు. ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ శాతానికి పాఠశాలల్లో విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. నోట్ పుస్తకాలపై సంబంధిత పాఠశాల పేరు ఉంటుందని బహిరంగ మార్కెట్లో లభించే నోట్ పుస్తకాలను వినియోగించరాదని ఆంక్షలు విధిస్తున్నారు. అన్ని పాఠశాలల్లోనే.. విద్యార్థులు వేసుకునే యూనిఫాం నుంచి టైలు, బెల్టులు, ఐడెండిటీ కార్డులు, టెస్టు, నోట్ పుస్తకాలు అన్ని పాఠశాలలోనే కొనాలని షరతులు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కొన్న యూనిఫాంను, పుస్తకాలను అనుమతించేదిలేదని పాఠశాల యాజమాన్యం తల్లితండ్రులకు చెబుతున్నారు. మరికొన్ని పాఠశాలల నిర్వాహకులు మార్కెట్లో తమకు అనుకూలంగా ఉన్న షాపులను సిఫారసు చేస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు నోట్, టెస్టు పుస్తకాలు 2 వేల నుంచి 5 వేల వరకు ఖర్చువుతున్నాయి. ఇక ఫీజులు, యూనిఫాం, తదితరలు ఖర్చులు కళ్లు బైర్లు కమ్మేటట్లు ఉన్నాయి. పట్టించుకోని అధికారులు ప్రైవేటు పాఠశాలల్లో వసతులు లేకపోయినా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడంలేదు. పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులతోపాటు గాలి వెలుతురు సక్రమంగా వచ్చేటట్లు ఉండాలి. ప్యాన్లు, లైట్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఆహాద్లకరమైన క్రీడాప్రాంగణం వంటి వసతులు ఉండాలి. కానీ ఇటువంటి వసతులు ఎక్కడా కనపడడంలేదు. ఇరుకుగదులు, రేకులషెడ్లు, చిన్నపాటి భవనాల్లో నడుస్తున్నాయి. ఇక క్రీడాప్రాంగణం ఎక్కడ ఉంటుందో కూడా విద్యార్థులకు తెలియదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరుకుగదుల్లోనే ఉంటున్నారు. కానీ ఫీజులు విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడరు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకే సంవత్సరానికి రూ. 15 వేల వరకు ఖర్చు చేయవల్సివస్తుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలోను పేద విద్యార్థులకు 25 శాతం మేర సీట్లు కేటాయించాల్సి ఉండగా అది ఏ పాఠశాలలలోను కనపడడంలేదు. విద్యాశాఖాధికారులు సమగ్రం గా తనిఖీలు నిర్వహిస్తే చాలా పాఠశాలలలు మూ సివేయాల్సి వస్తుందనడంలో సందేహం లేదు.