
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ప్రతినిధులు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో మంగళవారం సమావేశమయ్యారు.
సజ్జల మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తామన్నారు. కాగా, ఉపాధ్యాయ బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని మంత్రి సురేష్, సజ్జలకు జాక్టో చైర్మన్ కె.జాలిరెడ్డి, వర్కింగ్ చైర్మన్ సీహెచ్.శ్రావణ్ కుమార్, సెక్రటరీ జనరల్ ఎం.శ్రీధర్రెడ్డిలు మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు.