
పూర్తిగా బ్యాన్ చేసిన సర్కారు
21 ఏళ్లు ఉంటేనే పొగాకు ఉత్పత్తుల విక్రయం
వీధుల్లో సేవిస్తే రూ.వెయ్యి జరిమానా
చట్టానికి నూతన సవరణలు
బనశంకరి: రాష్ట్రంలో హుక్కాబార్లను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంతో పాటు సిగరెట్, బీడీ వంటి పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చట్టబద్ధ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచింది. ఇటీవల కేంద్రం ఆమోదించిన చట్టానికి అనుగుణంగా శనివారం నాడు ఉత్తర్వులను జారీచేసింది.
హుక్కాబార్లపై వేటు
కొత్త చట్టంలో హుక్కా బార్ల నిర్వహణను పూర్తిగా నిషేధించారు. ఏ వ్యక్తి లేదా ఇతర వ్యక్తులు టిఫిన్ సెంటర్లు , పబ్, బార్ అండ్ రెస్టారెంట్ తో పాటు ఎలాంటి ప్రదేశాల్లో హుక్కాబార్ తెరవరాదు, హుక్కాలను సేవించరాదు. ధూమపానాన్ని దూరం చేయడమే ఈ చర్యల ఉద్దేశం. ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారికి ఏడాది నుంచి మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ జరిమానా విధించవచ్చు.
సందు సందుల్లో హుక్కాబార్లు
బెంగళూరులో విచ్చలవిడిగా హుక్కాబార్లు నడుస్తున్నాయి. తొమ్మిది, పదో తరగతి బాలలు కూడా వీటికి అలవాటు పడినట్లు సమాచారం. గతంలో అధికారుల దాడుల్లో బాలలు దొరికిపోయారు. ఎలాంటి అనుమతులు లేకుండా హుక్కా సెంటర్లను నడుపుతూ ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. పాలికె, పోలీసు అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించినా మళ్లీ మామూలుగానే దందా సాగుతోంది. ఈ చట్టంతోనైనా హుక్కాలు బంద్ అవుతాయని సామాజిక కార్యకర్తలు ఆశిస్తున్నారు.
కఠిన నిబంధనలు
⇒ ఇకపై రాష్ట్రంలో 21 ఏళ్లలోపువారికి సిగరెట్, పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదు. విద్యాసంస్థలకు 100 మీటర్ల చుట్టుపక్కల ప్రదేశాల్లో బీడీ, సిగరెట్లను అమ్మరాదు.
⇒ బహిరంగ స్థలాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించారు. అలా పట్టుబడితే రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. గతంలో ఈ జరిమానా రూ.200 ఉండేది.
⇒ 30 గదులు కలిగిన హోటల్ లేదా, 30 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు కలిగిన రెస్టారెంట్లలో ప్రత్యేక స్థలంలో ధూమపానం చేయవచ్చునని ఓ మినహాయింపునిచ్చారు.