
తిరువనంతపురం : కేరళలో విషాదం చోటు చేసుకుంది. పటాకుల శబ్ధానికి బెదిరిపోయిన ఏనుగులు భక్తుల్ని తొక్కి చంపినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 24 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలించారు.
పోలీసుల సమాచారం మేరకు.. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కోయిలాండి సమీపంలో కురవంగడ్లోని మనక్కులంగర భగవతి ఆలయ ప్రాంగణంలో వార్షిక ఉత్సవం జరిగింది. ఉత్సవం చివరి రోజున నిర్వాహకులు రెండు ఏనుగుల్ని తీసుకువచ్చారు.
ఉత్సవ సమయంలో నిర్వాహకులు బాణసంచా పేల్చారు. దీంతో ఆ రెండు ఏనుగులు బెదిరిపోయాయి. భక్తుల్ని తొక్కుకుంటూ, దాడులు చేస్తూ ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా.. 24 మంది గాయపడ్డారు.
‘ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది. ఏనుగులను సాయంత్రం ఊరేగింపు కోసం ప్రదర్శిస్తుండగా, పటాకుల శబ్దం విన్న తర్వాత అకస్మాత్తుగా వాటిలో ఒక ఏనుగు బెదిరిపోయింది. మరో ఏనుగుతో ఘర్షణకు దిగింది. ఆ సమయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఏనుగులు ఒకదానికొకటి తోసుకోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు ఉత్సవ కార్యాలయం కూడా కూలిపోయింది’ అని కౌన్సిలర్ చెప్పారు.
దేవాలయంలో దుర్ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రెండు ఏనుగుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్రాకర్ల శబ్దానికి ఏనుగులు బెదిరిపోవడం వల్లే విషాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా తేలింది.
కోయిలాండి ఎమ్మెల్యే కనాతిల్ జమీలా మీడియాతో మాట్లాడుతూ.. క్రాకర్ల శబ్ధానికి ఏనుగులు బెదిరిపోయాయి. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాయి. ఆ సమయంలో భక్తుల మధ్య తొక్కిసలాట, తోపులాట జరిగింది. గాయపడిన 24 మందిని ఆసుపత్రికి తరలించాము’ అని అన్నారు.