
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. జనజీవనం అతలాకుతలమవుతోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో జనం తమ ప్రాణాలను పణంగా పెట్టి, నదులను దాటుకుంటూ ఆవలివైపునకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలోని వరద పరిస్థితులను తెలియజేస్తూ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు.
ArunachalPradesh receives heaviest Monsoon rains in the world. Got this video of a man crossing traditional hanging bridge in Anjaw district, Arunachal Pradesh near tri-junction of India, China & Myanmar border. Please remain careful & safe. Govt will provide necessary support. pic.twitter.com/GZ9ypeOzZj
— Kiren Rijiju (@KirenRijiju) June 1, 2025
దానిలో ఒక నది ఉవ్వెత్తున ఉప్పొంగుతుండగా, ఒక వ్యక్తి తాడు పట్టుకుని ఎంతో కష్టం మీద వంతెన దాటున్న దృశ్యం కనిపిస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఏర్పడుతున్న వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలలోని పరిస్థితులను ఈ వీడియో(Video) కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అక్కడ ఉంటున్నవారు ఎంత దుర్భర స్థితిలో ఉంటున్నారో తెలియజేస్తుంది. ఈ వీడియోను భారత్, చైనా, మయన్మార్ సరిహద్దుల్లోని ట్రై-జంక్షన్ సమీపంలోని అంజావ్ జిల్లాలో చిత్రీకరించారు.
ఈ వంతెనను వెదురు, చెక్కలు, తాళ్లతో నిర్మించినట్లు కనిపిస్తోంది. ఈ వంతెనలో అక్కడక్కడా కొంతభాగం భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయినట్లు లేదా మునిగిపోయినట్లు కనిపిస్తోంది. వీడియోలో వంతెనపై ఒకవైపు తాళ్లను పట్టుకున్న వెళుతున్న వ్యక్తి కనిపిసుండగా, కింద ఉప్పొంగి ప్రవహిస్తున్న నది ఏ క్షణంలోనైనా వంతెనను తుడిచిపెట్టేస్తుందనేలా ఉంది. గడచిన 48 గంటల్లో అరుణాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందారు. ముఖ్యమంత్రి పెమా ఖండు బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయనే అంచనాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనవసరమైన ప్రయాణాలను చేయవద్దని కోరారు.
ఇది కూడా చదవండి: బీహార్లో మరో దారుణం.. తొమ్మిదేళ్ల దళిత బాలిక విలవిల