![MP Pratap Simha Brother Arrested In Karnataka 126 Trees Worth Crores Felled - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2023/12/31/pratap-simha.jpg.webp?itok=TbYv-KrR)
బెంగళూరు: పార్లమెంట్ అలజడి విషయంలో వార్తల్లో నిలిచిన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ సోదరుడు విక్రమ్ సింహను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. కోట్ల విలువ చేసే 126 చోట్లను నరికివేసినట్లు అభియోగాలు ఉన్న ఓ కేసులో అతన్ని కర్ణాటకలోని హసన్ జిల్లా అటవీశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చెట్ల నరికివేత నేరానికి విక్రమ్ సింహ పాల్పడినట్లు అటవీ అధికారులు వద్ద ఆధారాలు ఉండటంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్నించారు. అయితే అప్పటికే విక్రమ్ సింహ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు, అటవీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో విక్రమ్ సింహ పట్టుబడ్డారు. అటవీ శాఖ పోలీసులు విక్రమ్ సింహను హసన్ జిల్లా తీసుకువచ్చి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికే పార్లమెంట్ అలజడి విషయంలో సతమతమవుతున్న బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహకు తన సోదరుడి అరెస్ట్.. మరో కొత్త చిక్కు తెచ్చిపెట్టినట్లు అయింది.
బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి పార్లమెంట్ సందర్శన పాసులు పొందిన ఆగంతకులు పార్లమెంట్లో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. కాగా.. పార్లమెంట్ భదత్ర వైఫల్యంపై ఎంపీ ప్రతాప్ సింహను సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టారు. అదేవిధంగా ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని ఆందోళనకు దిగిన 146 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్కు గురైన సంగతి తెలిసిందే.