
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ఇల్లు ‘యాంటీలియా’కు అధికారులు సోమవారం భద్రతను పెంచారు. తన కారు ఎక్కిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని, ఉర్దూ భాషలో మాట్లాడుతూ యాంటీలియా చిరునామా కోసం తనను అడిగారని, వారి వద్ద రెండు బ్యాగులు ఉన్నాయని ఓ ట్యాక్సీ డ్రైవర్ పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి చెప్పాడు.
వెంటనే అప్రమత్తమైన ఆజాద్ మైదాన్ పోలీసులు అతడి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. దక్షిణ ముంబైలో అల్టామౌట్ రోడ్డులోని ముఖేష్ నివాసం వద్ద భద్రతను పటిష్టం చేశారు. ఇక్కడ మరిన్ని బారీకేడ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. సీనియర్ అధికారి ఒకరు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
(చదవండి: ముఖేష్ అంబానీ కొత్త ఇల్లు..! ఎంతకు కొనుగోలు చేశారో తెలుసా..!)
ఈ ఏడాది ఫిబ్రవరిలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనం యాంటీలియా ఎదుట పార్కు చేసి ఉండడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన అప్పటి పోలీసు అధికారి సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment