
కేరళ అందాలు(కర్టెసీ: కేరళ టూరిజం)
బెంగళూరు: సుపరిపాలన సాగిస్తున్న రాష్ట్రాల్లో కేరళ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తర్వాతి స్థానాలు ఆక్రమించాయి. ఇక అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ జాబితాలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఇస్రో మాజీ చైర్మన్ కె.కస్తూరిరంగన్ నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థ ‘‘ది పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2020’’ పేరిట శుక్రవారం ర్యాంకులు ప్రకటించింది. సుస్థిరాభివృద్ధి ఆధారంగా ఈ జాబితా విడుదల చేసినట్లు పేర్కొంది. సమానత్వం, అభివృద్ధి సూచిలో పెరుగుదల, సుస్థిరత అనే మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. (చదవండి: రోడ్డు మీద వరి పండించాడు )
ఇందులో దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉండగా, యూపీ, ఒడిశా, బిహార్ నెగటివ్ పాయింట్లతో అట్టడగున నిలిచినట్లు తెలిపింది. ఇక చిన్న రాష్ట్రాల కేటగిరీలో గోవా 1.745 పాయింట్లతో అగ్రస్థానం ఆక్రమించగా, మేఘాలయ(0.797), హిమాచల్ ప్రదేశ్(0.725) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా మణిపూర్(-0.363), ఢిల్లీ(-0.289), ఉత్తరాఖండ్ (-0.277) అత్యంత ఘోరమైన ప్రదర్శనతో వెనుకబడినట్లు పీఏసీ నివేదిక వెల్లడించింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్(1.05) మొదటి స్థానంలో నిలవగా, పుదుచ్చేరి(0.52), లక్షద్వీప్(0.003), దాదర్ అండ్ నగర్ హవేలీ(-0.69), అండమాన్, జమ్మూకశ్మీర్(-0.50), నికోబార్ (-0.30)తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment