
రాంచీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. జార్ఖండ్లోని డియోఘర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తరువాత ఆ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో విమానాన్ని విమానాశ్రయంలోనే ఉంచారు. విమానంలో సమస్యను చక్కదిద్దేందుకు నిపుణులు పనిచేస్తున్నారు. ఈ లోపు మోదీ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని డియోఘర్కు పంపారు. దీంతో మోదీ ఢిల్లీ తిరుగు ప్రయాణం ఆలస్యం కానుంది.
జార్ఖండ్లో స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి (జనజాతీయ గౌరవ్ దివస్) కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం డియోఘర్ పట్టణానికి వచ్చారు. అదే విధంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ అక్కడ ప్రచారాన్ని కూడా నిర్వహించారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. కాగా నవంబర్ 20వ తేదీన జార్ఖండ్లో రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉంది.
మరోవైపు డియోఘర్కు 80 కిలోమీటర్ల దూరంలో గొడ్డాలో రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమంతి ఆలస్యమైంది. దీంతో క్లియరెన్స్ కోసం 45 నిమిషాలు గ్రౌండ్పైనే ఉండిపోయింది. అయితే ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నాయకుడి ప్రచార షెడ్యూల్కు అంతరాయం కలిగించారని కాంగ్రెస్ ఆరోపించింది.

Comments
Please login to add a commentAdd a comment