
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో బాలీవుడ్ సెలెబ్రిటీలపై విమర్శలు చేస్తూ, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వీడియో పోస్టు చేసిన కేసులో 22ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్టా పనోలిని (Sharmistha Panoli) ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమెను అరెస్టు చేసిన అనంతరం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. అదే సమయంలో ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
అయితే ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు ఆరోగ్యం బాగాలేదని, ఆమె ఉన్న మహిళా సెల్ కూడా శుభ్రంగా లేదని ఆమె తరఫు న్యాయవాది ఎండీ సమీముద్దీన్ సోమవారం మరోసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆమెకు ఉన్న హక్కులను కాపాడాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
‘ ఆమెకు ఆరోగ్యం బాలేదు. ప్రస్తుతం ఆమెకు కిడ్నీలు రాళ్లు ఉన్నాయి. కిడ్నీ సమస్యతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతోంది. ఆమెకు కేటాయించిన బార్లో పరిశుభ్రత లేదు. అంతేకాకుండా కనీసం న్యూస్ పేపర్ సౌకర్యం కూడా అక్కడ లేదు. ఆమె కనీస హక్కులు కూడా లభించడం లేదు’ అని న్యాయవాది సమీముద్దీన్ పిటిషన్లో పేర్కొన్నారు.
‘మేము ఆమెను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి యత్నిస్తున్నాం. జూన్ 13వ తేదీ లోపు ఆమెను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి యత్నిస్తున్నాం. ఆమె అరెస్టుకు కారణమైన అంశంపై కూర్చొని చర్చిస్తాం. ఒకటి రెండు రోజుల్లో ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది’ అని న్యాయవాది పేర్కొన్నారు.
శర్మిష్టా పనోలి పుణె న్యాయ విద్యార్థిని. పూణేకి చెందిన లా కాలేజీలో నాలుగో సంవత్సరం న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నారు. ఓ వైపు చదువుతూనే మరోవైపు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా శర్మిష్టా రాణిస్తున్నారు. ఇన్స్టాలో 94,000 మందికిపైగా ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నారు. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశంలో ఆమె చేసిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. అనంతరం వాటిని ఆమె డిలీట్ చేసినప్పటికీ కేసు నమోదు కావడం, అరెస్ట్ కావడం జరిగిపోయాయి.