‘మహా’ సీఎంకు లైన్‌ క్లియర్‌.. మిగిలింది అధికారిక ప్రకటనే! | Shinde Dropped, This Mahayuti Leader Almost Confirm For CM Post | Sakshi
Sakshi News home page

‘మహా’ సీఎంకు లైన్‌ క్లియర్‌.. మిగిలింది అధికారిక ప్రకటనే!

Nov 27 2024 5:37 PM | Updated on Nov 27 2024 7:53 PM

Shinde Dropped, This Mahayuti Leader Almost Confirm For CM Post

ఢిల్లీ: మహాయుతి కూటమి నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి  ఎవరనే ఉత్కంఠ దాదాపు వీడిపోయింది. సీఎం పదవిపై తనకు ఎలాంటి ఆశలు లేవని.. బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్‌ షా చేతుల్లోనే తుది నిర్ణయం ఉందని ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. దీంతో తొలి నుంచి రేసులో ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్‌కు దాదాపు లైన్‌ క్లియర్‌ అయ్యింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇక మిగిలింది అధికార ప్రకటనే!. రేపు(గురువారం) ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది. దీనికి ఫడ్నవిస్‌, షిండే, అజిత్‌ పవార్‌లకు ఆహ్వానం అందింది. కుదిరితే ఈ భేటీ అనంతరం లేకుంటే సాయంత్రం  మహారాష్ట్ర సీఎంపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

ఇదీ చదవండి: మోదీ చెప్పాల్సింది చెప్పా.. నిర్ణయం ఆయనదే!

షిండే ఫిట్టింగ్‌తోనే..
నవంబర్‌ 23వ తేదీన వెలువడిన ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. 288 స్థానాలకుగానూ.. 237 సీట్లు గెల్చుకుంది. ఇందులో బీజేపీ 132, షిండే శివసేన 57, ఎన్సీపీ(అజిత్‌ పవార్‌) 41, ఇతరులు 7 సీట్లు  ఉన్నాయి. ఫలితాలు వెలువడిన టైంలో.. ఫడ్నవిస్‌ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపించింది. ఆ వెంటనే షిండే, అజిత్‌ పవార్‌లు తామూ రేసులో ఉన్నామంటూ ముందుకొచ్చారు. సంఖ్యా బలానికి, సీఎం పదవికి సంబంధం లేదని, ఎవరు సీఎం అవుతారనేది చర్చించాకే ప్రకటిస్తామని ఏక్‌నాథ్‌ షిండే సైతం అన్నారు. దీంతో అసెంబ్లీ గడువు ముగిసినా.. సస్పెన్స్‌ కొనసాగుతూ వచ్చింది. 

ఈలోపు ఢిల్లీ పెద్దలు మూడు పార్టీల నేలతో చర్చలు జరిపారు. డిప్యూటీ సీఎం పదవికి అజిత్‌ పవార్‌ అంగీకారం తెలిపి.. ఫడ్నవిస్‌కు మద్దతుగా నిలిచారు. అయితే షిండే మాత్రం ఈ విషయంలో అస్సలు తగ్గలేదు. ఫడ్నవిస్‌ను బీజేపీ సీఎంగా ఎంచుకోవడంపై అసంతృప్తితో రగిలిపోయారు. అందుకు తగ్గట్లే.. ఆయన వర్గీయులు కూడా షిండేనే సీఎంగా ప్రకటించాలంటూ పెద్ద ఎత్తున్న సోషల్‌ మీడియాలో క్యాంపెయిన్‌ నడిపించారు. ఈలోపే బీజేపీ అగ్రనేతల సంప్రదింపులతో షిండే మెత్తబడ్డారు. ఫలితంగానే.. బీజేపీ సీఎం పదవి తీసుకుంటే తనకేం అభ్యంతరం లేదని ఆయన చెప్పడంతో ఫడ్నవిస్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లైంది.

Advertisement
 
Advertisement
Advertisement