రాయగడ : పాయఖానాయే అతిడికి పడకగది అయింది. అందులోనే ఐదేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. ఆధార్కార్డు లేకపోవడంతో ప్రభుత్వం అందించే బిజు పక్కా ఇళ్లు పొందలేకపోతున్నాడు. కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. నిరుపయోగంగా పడి ఉన్న పాయఖానాను పడక గదిగా మార్చుకొని అందులోనే ఉంటున్నాడు. జిల్లాలోని బిసంకటక్ సమితి పనుగుడ గ్రామంలో త్రినాథ్ పాండు అనే అరవై ఏళ్ల వృద్ధుని గాధ ఇది.
సమితిలోని కుంభారిధాముని పంచాయతీ దుబాగుడ గ్రామానికి చెందిన పాండుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఐదేళ్ల క్రితం భార్య మృతి చెందింది. కొడుకులు తనను ఆదరించకపోవడంతో దిక్కు తోచని స్థితిలో పనుగుడకు చేరుకున్నాడు. అక్కడ నిరుపయోగంగా ఉన్న పాయఖానలో తలదాచుకుంటున్నాడు. అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్ముకుంటేనే ఆ పూట గడిచేది. ఇంతటి దీనావస్థలో జీవనాన్ని కొనసాగిస్తున్న పాండుకు ప్రభుత్వం తరుఫున ఎటువంటి సహాయం అందటం లేదు. అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ తన వద్ద ఎటువంటి ఆధర్ కార్డు, గర్తింపు పత్రాలు లేకపొవడంతో ప్రభుత్వ సహాయాన్ని పొందలేకపోతున్నాడు. ఈ విషయమై బిసంకటక్ బీడీవోను ప్రశ్నించగా అతనికి ప్రభుత్వ సహాయం అందేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment