మహిళలే త్యాగమూర్తులు.. అవయవ దానంపై ఆసక్తికర అధ్యయనం!  | Study On Organ Donation Says 4 Of 5 Living Organ Donors In India Are Women And 4 Of 5 Recipients Men - Sakshi
Sakshi News home page

Study On Organ Donation: మహిళలే త్యాగమూర్తులు.. అవయవ దానంపై ఆసక్తికర అధ్యయనం! 

Published Mon, Nov 13 2023 11:32 AM | Last Updated on Mon, Nov 13 2023 1:03 PM

Study on organ donation 4 of 5 living organ donors in India are women - Sakshi

అవయవదానం అనేది చాలా గొప్పది. శరీరంలో ఏదైనా అవయం పాడైపోయి చావుకు దగ్గరైనవారికి అవయవ మార్పిడితో తిరిగి ఊపిరిపోస్తున్నారు. అవయవ మార్పిడిలో అత్యాధునిక వైద్య విధానాలు రావడంతో అవయవ మార్పిడి చేయించుకునేవారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. అయితే స్త్రీ, పురుషుల్లో అవయవ మార్పిడి చేయించుకున్నవాళ్లు ఎంత మంది? అవయవ దానం చేసినవారు ఎంత మంది అనే దానికి సంబంధించి ఓ ఆసక్తికర అధ్యయనం వెలుగులోకి వచ్చింది.

ఐదుగురిలో నలుగురు మహిళలే..
దేశంలో అవయవదానం పొందిన ప్రతి ఐదుగురిలో నలుగురు పురుషులు ఉండగా మహిళలు కేవలం ఒక్కరే. ఇక అవయవ దానం చేసిన వారిలో  ప్రతి ఐగుగురిలో నలుగురు మహిళలు ఉండగా మగవారు ఒక్కరే ఉన్నారు. 1995 నుంచి 2021 వరకు ఉన్న డేటా ప్రకారం దేశంలో 36,640 అవయవ మార్పిడిలు జరిగాయి. వీటిలో 29,000 మార్పిడులు పురుషులకు, 6,945 మార్పిడులు మహిళలకు జరిగాయి. అంటే అవయవదానం పొందిన వారిలో ఐదింట నాలుగు వంతుల మంది మగవారే ఉన్నారు. ఆర్థిక ఆర్థిక బాధ్యతలు, సామాజిక ఒత్తిళ్లు, పాతుకుపోయిన ప్రాధాన్యతలే ఈ అసమానతలకు కారణాలని నిపుణులు చెబుతున్నారు.

చనిపోయిన తర్వాత అవయవ దానం చేసేవారిలో మగవారు ఎక్కువగా ఉండగా బతికుండగానే అవయవ దానంచేసిన వారిలో మహిళలే ఎక్కువ మంది ఉన్నారని నేషనల్‌ ఆర్గాన్‌ & టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌ (NOTTO) డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. దేశంలో మొత్తం అవయవ దానాల్లో బతికుండి అవయవదానం చేసినవారినవి 93 శాతం ఉండగా వీరిలో అత్యధికులు మహిళలేనని ఆయన పేర్కొన్నారు. 


గ్రహీతల్లో మగవారే..
2021లో ఎక్స్‌పెర్మెంటల్‌ అండ్‌ క్లినికల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయన పత్రం భారత దేశంలో అవయవ మార్పిడికి సంబంధించి భారీ లింగ అసమానతలను బయటపెట్టింది. 2019లో అవయవ మార్పిడి డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనం సజీవ అవయవ దాతలలో 80 శాతం మంది మహిళలేనని తేల్చింది. వీరిలోనూ ప్రధానంగా భార్య లేదా తల్లి దాతలుగా ఉంటున్నారు. ఇక అవయవ గ్రహీతల విషయానికి వస్తే 80 శాతం మంది మగవారు ఉన్నారు.

అవయవ దాతల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటానికి ప్రాథమిక కారణాలను ఈ అధ్యయనం వివరించింది. కుటుంబంలో సంరక్షకులుగా, త్యాగానికి ముందుండేలా మహిళలపై సామాజిక-ఆర్థిక ఒత్తిడి ఉందని, మగవారే కుటుంబ పోషకులుగా ఉండటంతో వారు శస్త్రచికిత్స చేయించుకోవడానికి వెనుకాడతారని విశ్లేషించింది.

పూణేలోని డీవై పాటిల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన అవయవ మార్పిడి కోఆర్డినేటర్ మయూరి బార్వే మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా తాను ఈ రంగంలో పనిచేస్తున్నానని, ఇన్నేళ్ల తన అనుభవంలో ఒక్కసారి మాత్రమే భర్త తన భార్యకు అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చాడని చెప్పారు.

చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు అవయవదానం చేసేందుకు ముందుంటారని, ఒకవేళ వారిద్దరూ అందుబాటులో లేనప్పుడు, భార్యలు అవయవ దానానికి ముందుకు వస్తున్నట్లు ఆమె చెపారు. తరచుగా కుమార్తె అవివాహిత అయితే ఆమె దాత అవుతోందని, కానీ భార్యకు అవయవం అవసరమైనప్పుడు మాత్రం దాతలు ముందుకు రాకపోవడంతో వెయిటింగ్ లిస్ట్‌లో ఉండాల్సి వస్తోందని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement