
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ఒక మారుమూల గ్రామంలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది స్వల్ప వ్యవధిలో మృత్యువాత పడటం సంచలనంగా మారింది. ఈ మరణాలకు గల కారణాలు ఇంతవరకూ వెల్లడికాలేదు. దీనిపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అధికారులు మెట్ల బావి సమీప ప్రాంతాన్ని సీల్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బావిలోని నీటిలో పురుగుమందుల ఆనవాళ్లు కనిపించాయి. ఈ నేపధ్యంలో మెట్ల బావి దగ్గర 24 గంటలూ భద్రతా సిబ్బందిని మోహరించారు.
రాజౌరి జిల్లాలోని బాధల్ గ్రామంలోని మెట్ల బావికి కంచె ఏర్పాటు చేయాలని, ముగ్గురు భద్రతా సిబ్బందిని 24 గంటలూ అక్కడ మోహరించాలని అదనపు డిప్యూటీ కమిషనర్ దిల్ మీర్ ఆదేశించారు. ఆయన ఒక ఉత్తర్వులో.. ‘బాధల్ గ్రామంలోని బావి నుండి సేకరించిన నీటి నమూనాలలో పురుగుమందుల ఉనికిని నిర్ధారించారు. దీంతో ఆ మెట్ల బావిని మూసివేయాలని నిర్ణయించాం. ఈ మెట్ల బావిలోని నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వినియోగించకూడదు’ అని పేర్కొన్నారు.
బాధల్ గ్రామంలో మరణాలకు గల కారణాన్ని తెలుసుకునేందుకు అంతర్-మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కాగా జమ్మూలోని ఎస్ఎంజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ అస్లాం కుమార్తె యాస్మిన్ కౌసర్ కూడా అంతుచిక్కని వ్యాధితో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 7-12 తేదీల మధ్య గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది మృతిచెందారు.
ఇటీవల జేకే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖతో పాటు ఇతర విభాగాలు ఈ మరణాలపై దర్యాప్తు చేస్తున్నాయని, అయితే ఈ మరణాలకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదన్నారు. బాధితులు తొలుత జ్వరం, తలనొప్పి, వికారం, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలతో ఆస్పత్రికి వచ్చారని, చికిత్స పొందుతూ కొద్ది రోజులకే మృతిచెందారని మనోజ్ సిన్హా వివరించారు.
ఇది కూడా చదవండి: Kumbh Mela: ప్రముఖుల రాక.. మరిన్ని మార్గదర్శకాలు జారీ
Comments
Please login to add a commentAdd a comment