
సాక్షి, చెన్నై: భారతీయ సైనిక బలగాల చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన వీర యోధుడిని హెలికాప్టర్ ప్రమాదం కబళించింది. దేశ తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) బిపిన్ రావత్ బుధవారం ఛాపర్ ప్రమాదంలో అసువులు బాశారు. గతంలో ఒకసారి ఇలాంటి ప్రమాదం నుంచే రావత్ తృటిలో బయటపడ్డారు. కానీ ఈసారి దురదృష్టం వెన్నాడింది. దేశ సైనిక బలగాలకు కొత్త రూపుతెచ్చిన రావత్ మరణంతో దేశం దిగ్భ్రాంతి చెందింది. పలువురు ప్రముఖులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. సూలూరు ఎయిర్ బేస్నుండి వెల్లింగ్టన్ వెళ్తూ ఛాపర్ ప్రమాదంలో రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11మంది సైనికాధికారులు సైతం దుర్మరణం చెందారు. ఒక్కరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
(చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ రావత్ దుర్మరణం)
మరణించినవారిలో ఏపీ లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్నాయక్ సాయితేజ కూడా ఉన్నారు. ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగడంతో బాధితులను రక్షించేందుకు స్థానికులు చేసిన యత్నాలు ఫలించలేదు. ఘటనా స్థలిలో దేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. దుర్ఘటనపై భారత వాయుసేన విచారణకు ఆదేశించింది. రావత్ మరణవార్త వినగానే సీసీఎస్(కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశమైంది. గురువారం ఉదయం వెల్లింగ్టన్లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి పార్థివ దేహాలను కోయంబత్తూర్ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకువెళ్తారు.
(చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్)
శుక్రవారం ఢిల్లీ కంటోన్మెంట్లో అధికారలాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతారు. 1978లో సెకండ్ లెఫ్టినెంట్గా చేరి 2019లో దేశ భద్రతాదళాల ఉమ్మడి అధిపతిగా ఎదిగే క్రమంలో ఆయన పలు పురస్కారాలు అందుకున్నారు. భారత్లో అత్యంత శక్తివంతమైన సైనికాధికారైన ఈ ఫోర్స్టార్ జనరల్ సేవలను, తెచ్చినన రక్షణ సంస్కరణలను త్రివిధ దళాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాయి. శుక్రవారం రాజ్నాధ్ సింగ్ పార్లమెంట్లో ప్రమాదంపై ప్రకటన చేశారు.
1.ఉదయం 9గంటలకు ఢిల్లీ నుంచి రావత్ బయలుదేరారు. ఉదయం 11.34 గంటలకు సూలూర్ ఎయిర్బేస్కు చేరారు.
2.11.45 గంటలకు రావత్ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్ సూలూర్ ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ అయింది.
3.మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో కూనూర్ వద్ద ప్రమాదం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment