
న్యూఢిల్లీ: డీఏపీ సహా ఫాస్పాటిక్ అండ్ పొటాలిక్ ఎరువులకు రూ.60,939 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. రైతులకు నాణ్యమైన ఎరువులు సరసమైన ధరలకు అందించాలన్న ఉద్దేశంతో ఫాస్ఫాటిక్ అండ్ పొటాసిక్ (పీ అండ్ కే) ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలన్న ప్రతిపాదనలను బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం అంటే ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ సబ్బిడీని కేటాయిస్తున్నట్టుగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని 2024 డిసెంబర్ వరకు విస్తరిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 4జీ సేవలు
వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 4జీ మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడున్న 2జీ మొబైల్ సేవలను 4జీకి అప్గ్రేడ్ చేసేందుకు ఉద్దేశించిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్(యూఎస్ఓఎఫ్) ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. యూఎస్ఓఎఫ్ ప్రాజెక్టు కింద 2,343 వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 2జీ నుండి 4జీ మొబైల్ సేవలను రూ.2,426 కోట్ల అంచనా వ్యయంతో (పన్నులు, సుంకాలు మినహాయించి) అప్గ్రేడ్ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఈ– గవర్నెన్స్, బ్యాంకింగ్, టెలి–మెడిసిన్ డెలివరీ, మొబైల్ బ్రాడ్బ్యాండ్ ద్వారా టెలి ఎడ్యుకేషన్ మొదలైన సేవలు సులువుగా అందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment