ప్రీ ఫైనల్‌కు ఓఎంఆర్‌.. | - | Sakshi
Sakshi News home page

ప్రీ ఫైనల్‌కు ఓఎంఆర్‌..

Published Wed, Feb 19 2025 1:44 AM | Last Updated on Wed, Feb 19 2025 1:39 AM

ప్రీ ఫైనల్‌కు ఓఎంఆర్‌..

ప్రీ ఫైనల్‌కు ఓఎంఆర్‌..

విద్యార్థులకు ముందస్తు అవగాహన

జిల్లాలో 9,127 మందికి ప్రయోజనం

లక్ష్మణచాంద:పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులకు రెండో గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థులకు ఓఎంఆర్‌పై అవగాహన కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈమేరకు ప్రీఫైనల్‌ పరీక్షలకు ఓఎంఆర్‌ విధానం అమలు చే యబోతోంది. ఓఎంఆర్‌పై అవగాహన లేకపోవడంతో చాలామంది విద్యార్థులు తప్పులు చేస్తున్నారు. పొరపాట్లను తగ్గించేందుకు ఈసారి ప్రీఫైనల్‌ పరీక్షలకు ఓఎంఆర్‌ విధానం అమలు చేయనుంది.

6 నుంచి ప్రీ ఫైనల్‌..

మార్చి 6 నుంచి జరిగే ప్రీ ఫైనల్‌ పరీక్షల సందర్భంగా ఓఎంఆర్‌ షీట్‌ వినియోగించనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఓఎంఆర్‌ షీట్‌పై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. మార్చి 21 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

వివరాలు నమోదు చేయాలి..

పదో తరగతి పరీక్షల సమయంలో ప్రతీ విద్యార్థికి ఆన్సర్‌ షీట్‌తోపాటు ఓఎంఆర్‌ షీట్‌ ఇస్తారు. విద్యార్థికి సంబంధించిన వివరాలు అందులో ముద్రించి ఉంటాయి. వాటిని ప్రతీ విద్యార్థి తమ తమకు కేటాయించిన షీట్‌లో సరి చూసుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే ఇన్విజిలేటర్‌కు తెలియజేయాలి. అతను ఇచ్చే ఖాలీ ఓఎంఆర్‌ షీట్‌పై విద్యార్థి వివరాలు రాయాల్సి ఉంటుంది. జవాబులు రాసేందుకు తీసుకున్న అడిషనల్స్‌ సంఖ్య కూడా ఓఎంఆర్‌ షీట్‌పై రాయాల్సి ఉంటుంది.

47 కేంద్రాలు.. 9,127 మంది విద్యార్థులు..

ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షల కోసం జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 235 ఉన్నత పాఠశాలకు చెందిన 9,127 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో 4,442 బాలురు, 4,685 బాలికలు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement