
స్విమ్మింగ్పూల్లో యువకుడి మృతి
మృతుడు మెదక్ జిల్లా చేగుంటవాసి
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఉన్న స్విమ్మింగ్పూల్లో మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రానికి చెందిన యువకుడు శనివారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చేగుంట మండల కేంద్రానికి చెందిన తిరుపతి సంజయ్ అలియాస్ లాల్ (21) కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెర్వులోని బంధువుల ఇంటికి వచ్చాడు. వారితో కలిసి పెద్దమల్లారెడ్డిలో ఉన్న ప్రైవేట్ స్విమ్మింగ్పూల్లో ఈత కొట్టేందుకు వచ్చాడు. ఈత కొడుతుండగా తలకు గాయమై ఫిట్స్ రావడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన బంధువులు వెంటనే సంజయ్ను ఒడ్డుకు తీసుకొచ్చి 108లో రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, సంజయ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు. తల్లి మంజుల ఉంది. మృతదేహాన్ని చేగుంటకు తరలించారు.
అపరిశుభ్ర హోటళ్లకు జరిమానా
నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లపై మున్సిపల్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జయకుమార్ సిబ్బందితో కలిసి నగరంలోని పలు హోటళ్లను పరిశీలించారు. రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న టీ హోటళ్లు అపరిశుభ్రంగా ఉండడంతో వారికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. కంఠేశ్వర్ బైపాస్లోని లహరి హోటల్లో పాడైపోయిన చికెన్ను గుర్తించి, నిర్వాహకులకు రూ. 10 వేల ఫైన్ వేశారు. ముబారక్నగర్, కుమార్గల్లి, ఖలీల్వాడీల్లోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టి రూ.45 వేల జరిమానా విధించినట్లు ఏఎంసీ జయకుమార్ తెలిపారు. వారి వెంట శానిటరీ ఇన్స్పెక్టర్లు షేక్ షాదుల్లా, కృష్ణ, జవాన్లు, సిబ్బంది ఉన్నారు.
ఆటో బోల్తా.. విద్యార్థులకు గాయాలు
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఆటో బో ల్తా పడి విద్యార్థులకు గా యాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పెర్కిట్లోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు తరగతులు ముగించుకొని రోజూ మాదిరిగానే ఆటోలో మొత్తం 9 మంది ఇంటికి బయల్దేరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోకి రాగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో సాత్విక్, శ్రీవల్లి అనే విద్యార్థులకు గాయాలు కాగా స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు విద్యార్థులకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. డ్రైవర్ రోజూ టాటాఏస్ వ్యాన్ తీసుకువచ్చేరని అది రిపేర్కు వెళ్లడంతో ఆటో తీసుకొచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పీడీఎస్యూ నాయకులు మమత, వినోద్, సిద్ధు గాయపడిన విద్యార్థులను పరామర్శించారు.
కీచక ఉపాధ్యాయుడిపై మరో కేసు
రామారెడ్డి: పోక్సో కేసులో బెయిల్పై వచ్చి బాధితులను బెదిరించిన ఉపాధ్యాయుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. రామారెడ్డి ఎస్సై నరేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు మహేశ్పై ఇటీవల విద్యార్థినులు షీటీంకు సమాచారం ఇచ్చారు. షీ టీం సభ్యులు విచారణ చేసి రెండ్రోజుల క్రితం మహేశ్పై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై బయటికి వచ్చిన మహేశ్ .. బాధితులను తీవ్రంగా బెదిరించగా శనివారం మరో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు.

స్విమ్మింగ్పూల్లో యువకుడి మృతి

స్విమ్మింగ్పూల్లో యువకుడి మృతి