
వాషింగ్టన్ డీసీ (వర్జీనియా): అవిభజిత ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం(ఇండియా కాలమానము ప్రకారం శనివారం ఉదయం) ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ఛార్జ్ శశాంక్రెడ్డి, సత్య పాటిల్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్రెడ్డి వల్లూరు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. సామాజిక దూరం పాటిస్తూ మహానేత వైఎస్సార్కి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్రెడ్డి వల్లూరు మాట్లాడుతూ.. స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి మాట తప్పని, మడమ తిప్పని రాజకీయ నేత అని కొనియాడారు. ప్రజల సంక్షేమానికి కట్టుబడి విద్యకు, వ్యవసాయానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చిన మహానాయకుడని గుర్తుచేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తన తండ్రి రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కుమారుడిగా వైఎస్ జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పారని, మాట నిలుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలులో టార్చ్ బేరర్ (మార్గ నిర్దేశకుడు)గా నిలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి అమరుడై 11 ఏళ్లు గడిచిపోయాయని, ఆ మహానేత దిశా నిర్దేశం చేసిన మార్గంలోనే గత 16 నెలలుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక రీతిలో సంక్షేమాభివృద్ధి పథకాలను పరుగులు పెట్టిస్తూ.. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలుపుకునే దిశగా చర్యలు చేపట్టడాన్ని హర్షించారు.
వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ఛార్జ్ శశాంక్రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారని ప్రశంసించారు. రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సంక్షేమ పధకాల ద్వారా ప్రజలతో మమేకమైయ్యారని చెప్పారు. ప్రతి ఊరు బాగుండాలని కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడకుండా సంక్షేమం కోరుకునే వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నినాద్రెడ్డి అన్నవరం, నాటా నాయకులు సత్య పాటిల్రెడ్డి, రఘునాథ్రెడ్డి, సుజిత్ మారం, రామిరెడ్డి , సునీల్, మదన గళ్ల, అర్జున్ కామిశెట్టి, వినీత్ లోక, పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment