భార్య గొంతు కోసి హతమార్చిన భర్త | - | Sakshi
Sakshi News home page

భార్య గొంతు కోసి హతమార్చిన భర్త

Published Thu, Dec 28 2023 12:58 AM | Last Updated on Thu, Dec 28 2023 1:37 PM

- - Sakshi

వీరులపాడు(నందిగామ): కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో ఆమె గొంతుకోసి హతమార్చాడు. ఈ ఘటన వీరులపాడు గ్రామంలో బుధవారం వేకువజామున వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. వీరులపాడు గ్రామానికి చెందిన బంకా మేరి (30)కి పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ బంకా సుందరరావుతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలం కాపురం సజావుగానే సాగింది. మూడేళ్లుగా భార్యపై అనుమానంతో సుందరరావు తరచూ ఆమెతో ఘర్షణ పడుతుండేవాడు.

నెల రోజుల క్రితం భర్తతో గొడవపడిన మేరి తన ఇద్దరు కుమారులను తీసుకుని వీరులపాడులోని పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో మేరి ఇకమీదట తాను శివాపురానికి రానని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో పెద్దల సమక్షంలో ఇద్దరికీ సర్దిచెప్పి కొంత కాలం దంపతులిద్దరూ వీరులపాడులోనే నివాసం ఉండాలని సూచించారు. దీంతో 15 రోజుల క్రితం వీరులపాడులో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో సుందరరావు విజయవాడ నుంచి ఆటోలో వీరులపాడు చేరుకున్నాడు.

ఆ సమయంలో మేరి తండ్రి మండూరి చిన్న అక్కడే ఉండటంతో రోజూ మాదిరిగా పిల్లలను తన తండ్రితో పంపించింది. ఇదే అదునుగా భావించిన సుందరరావు తనతో తెచ్చుకున్న కత్తితో భార్య గొంతు కోశాడు. ఆమె మృతి చెందిందని నిర్ధారించుకున్న తరు వాత ఆటోలో పరారయ్యాడు. తెల్లవారుజామున మేరి తండ్రి, కుమారులు వచ్చి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. అది చూసి కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ జనార్దన్‌నాయుడు, సీఐ నాగేంద్రకుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఏసీపీ మాట్లాడుతూ.. పరారీలో ఉన్న నిందితుడు సుందరరావు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement