
మినుము కొనుగోళ్లకు సన్నాహాలు
కంకిపాడు: మినుము కొనుగోళ్లకు అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. మార్కెట్లో ధర అర కొరగా దక్కుతున్న స్థితిలో రైతులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిపై ‘సాక్షి’లో ఈ నెల తొమ్మిదో తేదీన ‘మినుము రైతు దిగాలు’ శీరిక్షన కథనం ప్రచురితమైంది. ఈ కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఆఘమేఘాలపై జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మినుము కొనుగోలు చేపట్టేందుకు సన్నాహాలు చేశారు. ఇందులో భాగంగా తొలుత కంకిపాడు మార్కెట్ యార్డు ప్రాంగణంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నారు.
45 శాతం మినుము తీతలు పూర్తి
కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్లో 2,84,237 ఎకరాల్లో మినుము సాగు చేపట్టారు. ఇప్పటికే 45 శాతం మినుము తీతలు పూర్తయ్యాయి. పంట మార్కెట్కు చేరుతోంది. ఎకరాకు సరాసరిన ఆరు నుంచి ఎనిమిది బస్తాల వరకూ దిగుబడి వస్తోంది. దిగుబడులు ఫర్వాలేదనిపించినా మార్కెట్లో ధర ఆశాజనకం లేకపోవటంతో రైతులు ఆర్థికంగా నష్టాన్ని చవిచూస్తున్నారు. క్వింటా మినుము ధర ప్రస్తుతం రూ.7400 నుంచి రూ.7500 వరకు పలుకుతోంది. గత సీజన్లో ఇదే సమయంలో క్వింటా మినుముల ధర రూ.9100. మార్కెట్లో కొందరు వ్యాపారులు సిండికేట్గా మారి ధరను పెరగనివ్వకుండా అడ్డు కుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ కార ణంగానే గడిచిన పది రోజులుగా మార్కెట్లో ధర స్ధిరంగా ఉందని రైతులు అంటున్నారు. ఎకరాకు మినుము సాగుకు తెగుళ్లు ప్రభావంతో యాజమాన్య చర్యలతో కలిపి రూ.40 వేలపైగా పెట్టుబడులయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరను బట్టి రైతులకు ఖర్చులు కూడా చేతికందని దుస్థితి.
ప్రభుత్వం మద్దతు ధర రూ.7,400
ప్రభుత్వం క్వింటా మినుముల మద్దతు ధరను రూ.7400గా నిర్ణయించింది. ఆఖరికి అది కూడా దక్కే పరిస్థితి లేకపోవటంతో మినుము రైతుల కష్టాలుపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావటంతో అధికారుల్లో కదలిక వచ్చింది. మార్క్ఫెడ్ అధికారులు జిల్లాలో సాగు అధికంగా ఉన్న 12 ప్రాంతాలను గుర్తించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. బాపులపాడు మండలం ఆరుగొలనులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుకానుంది. మిగిలిన మోదుగుమూడి ఆర్ఎస్కే (అవనిగడ్డ), మల్లేశ్వరం ఏఎంసీ (బంటుమిల్లి), పెరికీడు ఆర్ఎస్కే (బాపులపాడు), గుడ్లవల్లేరు ఏఎంసీ (గుడ్లవల్లేరు), కంకిపాడు ఏఎంసీ (కంకిపాడు), మొవ్వ ఆర్ఎస్కే (మొవ్వ), పెడన ఏఎంసీ (పెడన), గంగూరు ఆర్ఎస్కే (పెనమలూరు), బొడ్డపాడు ఆర్ఎస్కే (తోట్లవ ల్లూరు), ఆత్కూరు ఆర్ఎస్కే (ఉంగుటూరు), ఉయ్యూరు ఏఎంసీ (ఉయ్యూరు) ప్రాంతాల్లో డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు ప్రక్రియ చేపట్టనున్నారు. ఆయా కేంద్రాల పరిధిలోని 144 రైతు సేవా కేంద్రాల ద్వారా నిర్దేశించిన కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోళ్లు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
నేడు తొలి కేంద్రం ప్రారంభం
జిల్లాలో తొలుత కంకిపాడు కేంద్రంగా మినుము కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు మార్క్ ఫెడ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు కంకిపాడు ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
‘సాక్షి’ కథనంతో కదిలిన అధికారగణం జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నేడు కంకిపాడులో కొనుగోలు కేంద్రం ప్రారంభం
మద్దతు ధర పొందాలి
మినుము సాగు రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి. బయట మార్కెట్లో ధర ఆశాజనకంగా లేకపోతే తక్షణమే రైతు సేవా కేంద్రంలో పేర్లు నమోదు చేసుకుంటే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాం. దళారులను ఆశ్రయించి మోస పోకుండా మద్దతు ధరను పొందాలి.
– మురళీకిషోర్, డీఎం, మార్క్ఫెడ్, కృష్ణాజిల్లా

మినుము కొనుగోళ్లకు సన్నాహాలు

మినుము కొనుగోళ్లకు సన్నాహాలు
Comments
Please login to add a commentAdd a comment