కొరాపుట్: సిక్కిం కాంగ్రెస్ పార్టీ నేతలతో కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉల్క చర్చలు జరిపారు. సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్టక్లో సిక్కిం ప్రదేశ్కాంగ్రెస్ కార్యాలయాన్ని సప్తగిరి ఆదివారం సందర్శించారు. ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ సహచర విభాగాల నాయకులతో భేటీ అయ్యారు. ఎంపీ సప్తగిరిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈశాన్య రాష్ట్రాల పార్టీ పరిశీలకుడిగా నియమించింది. దీంతో సప్తగిరి తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తున్నారు.
మజ్జిగ, పుచ్చకాయల వితరణ
రాయగడ: పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని స్థానిక సాయిప్రియ వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో తుంబిగుడ కూడలిలో బాటసారులకు మజ్జిగ, పుచ్చకాయలను ఆదివారం వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటవీశాఖ రాయగడ రేంజర్ కామేశ్వర్ ఆచారి హాజరై బాటసారులకు మజ్జిగ, పుచ్చకాయలను పంపిణీ చేశారు. ఈ తరహా సేవా కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని ట్రస్టు సభ్యులను సూచించారు. ట్రస్టు కార్యదర్శి దయానిధి ఖండగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు జి.బ్రహ్మాజీ, లాడి చంద్రమౌళి, సన్యాసి పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రుల కాన్వాయ్పై రాళ్ల దాడి●
● కానిస్టేబుల్కు గాయాలు
● మయూర్భంజ్ జిల్లాలో సంఘటన
భువనేశ్వర్: మయూర్భంజ్ జిల్లాలో రాష్ట్ర మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ జిల్లా బంగిరిపోషి ప్రాంతం కాల వైశాఖి వైపరీత్యంతో భారీగా ప్రభావితమైంది. ప్రాంతీయుల్ని పరామర్శించి నష్టం తీవ్రతని క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా సమీక్షించేందుకు ఇరువురు మంత్రులు బయల్దేరారు. వీరిలో రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కృష్ణచంద్ర మహాపాత్రో ఉన్నారు. కాల వైశాఖి వైపరీత్యం నష్టా న్ని అంచనా వేయడానికి ఆదివారం ఇద్దరు మంత్రులు చేసిన పర్యటన ఉద్రిక్తంగా మారింది. వీరి రాకలో జాప్యం కారణంగా స్థానిక ప్రభావిత వర్గాలు ఆగ్రహంతో నిరసనలు చేపట్టి వారి కాన్వాయ్పై దాడి చేశారు. ఈ సందర్భంగా రాళ్లు రువ్వడంతో మంత్రుల కారు అద్దాలు పగిలాయి. ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. నష్టం అంచనా క్షేత్ర స్థాయి పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తుండగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల వైశాఖి వైపరీత్యానికి గురైన పలు ప్రాంతాల్ని సందర్శించకుండా వెనుదిరగడంతో ఆగ్రహించిన వర్గం ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. మంత్రుల పక్షపాత వైఖరి పట్ల ప్రభుత్వం బదులు ఇవ్వాలని ఆందోళనకు దిగిన గ్రామస్తులు నిరసన ప్రదర్శించారు. ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్ తలకు గాయమైంది. వాహనాలపై రాళ్లు వర్షం కురిపించారు. భద్రతా సిబ్బంది సకాలంలో పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి కుదుటపడింది.
గుర్తు తెలియని వ్యక్తి
మృతదేహం స్వాధీనం
రాయగడ: ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మునిగుడ పోలీసులు ఆదివారం రైల్వే స్టేషన్ సమీపంలోని తోపుడు బండిపై స్వాధీనం చేసుకున్నారు. కొంత మంది అటువైపుగా వెళుతున్న సమయంలొ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
సిక్కిం కాంగ్రెస్ నేతలతో కొరాపుట్ ఎంపీ చర్చలు
సిక్కిం కాంగ్రెస్ నేతలతో కొరాపుట్ ఎంపీ చర్చలు
సిక్కిం కాంగ్రెస్ నేతలతో కొరాపుట్ ఎంపీ చర్చలు