
రాష్ట్రస్థాయిలో సత్తా చాటెన్
● కావ్యశ్రీని దత్తత తీసుకున్న కలెక్టర్
● పావని చంద్రికను దత్తత తీసుకున్న
ఆర్అండ్బీ ఎస్ఈ
నరసరావుపేట: పదవ తరగతి పరీక్షలలో 591 మార్కులు సాధించిన కారెంపూడి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కోనేటి కావ్యశ్రీని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు దత్తత తీసుకున్నారు. రామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల పుత్రిక అయిన కావ్యశ్రీ ఉన్నత చదువులకు ఇబ్బంది లేకుండా చూస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే మంచి మార్కులు రావనే అభిప్రాయాలను పటా పంచలు చేస్తూ జిల్లా విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించారన్నారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో స్టేట్ టాపర్గా నిల్చిన పావని చంద్రికకు స్వీటు తినిపించి అభినందించారు. కలెక్టర్ అడుగుజాడల్లో నడుస్తూ రోడ్లు భవనాల శాఖ ఎస్.ఈ రాజనాయక్ 598 మార్కులు సాధించిన పావని చంద్రికను దత్తత తీసుకున్నారు. అదేవిధంగా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం కలెక్టరేట్కు ఆహ్వానించి అభినందించారు. జేసీ గనోరే సూరజ్ ధనుంజయ్, డీఈఓ ఎల్.చంద్రకళ పాల్గొన్నారు.
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో సర్కార్ పాఠశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పది ఫలితాలలో రాణించారు. బుధవారం ప్రకటించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 433 ఉన్నత పాఠశాలల నుంచి 25,382 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 21,358 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 84.15 శాతంగా ఉంది. కాగా, గతేడాది 25,207 మంది హాజరు కాగా, 23,792 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఉత్తీర్ణతా శాతం 86.05 శాతంగా ఉంది. గతేడాది రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచిన పల్నాడు జిల్లా ఈఏడాది 11వ స్థానానికి ఎగబాకినప్పటికీ ఉత్తీర్ణత శాతం 2 శాతం దిగజారింది. కాగా, జిల్లాలో బాలుర ఉత్తీర్ణత 81.39 శాతం ఉండగా, బాలికలు పైచేయి సాధిస్తూ 86.91 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 16,887 మంది ఫస్ట్ డివిజన్, 3,070 మంది సెకండ్ డివిజన్, 1,401 మంది థర్డ్ డివిజన్ సాధించారు.
● జిల్లాలోని కారెంపూడి మండలం ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని అంగడి పావని చంద్రిక 598 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే షేక్ సమీర 596 (జడ్పీ బాలికల హైస్కూల్, మాచర్ల), ప్రత్తిపాటి అమూల్య 593 (జడ్పీ హైస్కూల్, తూబాడు), తన్నీరు సాయిరామ్ 591 (ఏపీ మోడల్ స్కూల్, చీకటీగల పాలెం), పిట్టల విజయలక్ష్మి 591 (జడ్పీ హైస్కూల్, చిరుమామిళ్ల), జె.ఖాతీజా 591 (జడ్పీ హైస్కూల్, వినుకొండ), చప్పల నవ్వ 590 (జడ్పీ హైస్కూల్, ఓబులేసునిపల్లె), జి.రాధిక 590, (జడ్పీ హైస్కూల్, నకరికల్లు), అనుముకొండ రేవతి 590 (జడ్పీ హైస్కూల్, శంకరభారతీపురం), కోనేటి కావ్యశ్రీ 590 (జడ్పీ హైస్కూల్, కారంపూడి) మార్కులు సాధించి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లుగా నిలిచారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందించారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, జేసీ సూరజ్ గనోరే, డీఈఓ తదితరులు టాప్ ర్యాంకర్లను అభినందించారు.
కారెంపూడి: టెన్త్ పరీక్షా ఫలితాలలో కారెంపూడి బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కె.కావ్యశ్రీ 591 మార్కులు సాధించిందని ఎంఈఓ రవి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పావని చంద్రిక, తల్లి సంధ్యలను అభినందిస్తున్న డీఈఓ చంద్రకళ, హెచ్ఎం
మీ భవితకు అండగా నిలుస్తాం
‘పది’ ఫలితాల్లో రాష్ట్రంలో 11వ
స్థానంలో నిలిచిన పల్నాడు
598 మార్కులతో ప్రభుత్వ
పాఠశాలల్లో స్టేట్ టాపర్గా నిలిచిన
ఒప్పిచర్ల విద్యార్థిని పావని చంద్రిక
విద్యార్థులను అభినందించిన
ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి, కలెక్టర్
598 మార్కులు సాధించిన
ఒప్పిచర్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని
కారెంపూడి: పల్నాడు జిల్లా కారెంపూడి మండలం ఒప్పిచర్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని అంగడి పావని చంద్రిక పదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. చంద్రిక 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించింది. హిందీ, ఇంగ్లిషుల్లో ఒక్కో మార్కు తగ్గింది గానీ మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు వచ్చాయి.
మట్టిలో మాణిక్యం
అంగడి పావని చంద్రిక తండ్రి సాంబశివరావు వినుకొండ పురపాలక సంఘం కార్యాలయంలో అటెండర్గా, తల్లి సంధ్య పిడుగురాళ్ల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో వాచ్మెన్గా పని చేస్తున్నారు. వీరి స్వగ్రామం పిడుగురాళ్ల.. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అక్కడ ఇంటిని అమ్మేశారు. అప్పటి నుంచి పావని చంద్రిక ఒప్పిచర్లలో ఉన్న అమ్మమ్మ సామ్రాజ్యం సంరక్షణలో ఉంటూ ఇంటికి దగ్గర్లోని జెడ్పీ హైస్కూల్లో చదువుతోంది. చంద్రిక తమ్ముడు లక్ష్మణ్ పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి పరీక్షలు రాశాడు. అమ్మమ్మ సామ్రాజ్యం, మేనమామ లక్ష్మణ్ల సంరక్షణలో పావని చంద్రిక చదువుపై శ్రద్ధ చూపింది. అల్లుడు, కూతురు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే మనవరాలిని దగ్గరకు తీసుకుని చదివించింది చంద్రిక అమ్మమ్మ సామ్రాజ్యం. కరోనా కాలంలో సామ్రాజ్యం భర్త వెంకటేశ్వర్లు మృతి చెందాడు. దీంతో మనవరాలు పావని చంద్రిక అమ్మమ్మకు తోడుగా ఉంటూ బాగా చదువుకుంది.
పల్నాడుకు ఖ్యాతి
పావని చంద్రిక ప్రత్యేకంగా ఏ ట్యూషన్కు వెళ్లలేదు.. స్కూల్లో ఏ రోజు చెప్పినవి అదే రోజు చదువుకునేది. అమ్మమ్మ తెల్లవారు జామున 4 గంటలకే నిద్ర లేపేది. స్కూలుకు వెళ్లేలోగా అమ్మమ్మకు ఇంటి పనిలో సాయం కూడా చేసేది. ఎలాంటి సౌకర్యాలు లేని పల్లెటూరులో నివాసం ఉంటూ జెడ్పీ హైస్కూల్లో చదివి అత్యుత్తమ మార్కులతో పల్నాడుకే పేరు తెచ్చింది పావని చంద్రిక. బాలికా విద్యలో వెనుకబడిన పల్నాడు నుంచి, పైగా గిరిజన తెగకు చెందిన బాలిక పావని చంద్రిక విజయకేతనం ఎగురవేసి రాష్ట్రమంతా తన వైపు చూసేలా సత్తా చాటింది.
అభినందనల వెల్లువ..
ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ టాపర్గా నిలిచిన పావని చంద్రికను జిల్లా కలెక్టర్ అరుణ్బాబు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, డీఈఓ చంద్రకళలు అభినందించారు. చదవులో మొదటి నుంచి పావని చంద్రిక ప్రతిభ చూపుతోంది. 8వ తరగతిలో నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికై ంది. ఆ తర్వాత జిల్లా, డివిజన్ స్థాయిల్లో నిర్వహించిన టాలెంట్ టెస్టుల్లో ప్రతిభ చూపింది. హెచ్ఎం విజయలలిత, ఉపాధ్యాయులు రమాదేవి, దుర్గాదేవి, కిరణ్ కుమారి, అబ్ధుల్ రఫీ, సీతామహాలక్ష్మి, సునీత, హనుమంతరావుల శిక్షణలో స్టేట్ టాపర్గా నిలిచింది.

రాష్ట్రస్థాయిలో సత్తా చాటెన్

రాష్ట్రస్థాయిలో సత్తా చాటెన్